9, అక్టోబర్ 2012, మంగళవారం

తాజ్‌మహల్ షాజహాన్ కట్టిచిందేనా? వాస్తు శాస్త్రం ( మూడవ భాగం)

  - రచన : రావు తల్లాప్రగడ
 

 
ముందుగా అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు!
--- --- ---
“సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్ర పాత్ |
స భూం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం ||” (పురుష సూక్తం)
(ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామి! అనేక శీర్షముల (Infinite number of vertexes), అనేక అక్షములు (Infinite number of Diagonals), అనేక భుజములు(Infinite number of Sides) కలిగిన వృత్తాకార తరంగము లాగా వ్యాపిస్తున్న ఈ విశ్వాని కన్నా పది అంగుళాలు ఆవలి వరకు వ్యాపించాడు). పురుషసూక్తం నాటికే, మన సంస్కృతిలో, ఇలా అంగుళం ప్రస్తావనలు కనిపిస్తాయి. ఇప్పుడు తాజమహలో కూడా ఇదే ప్రస్తావన రాబోతోంది!!! ముందు భాగాలలో (గత రెండు మాసాలలో) తాజమహల్లో వున్న హైందవ చిహ్నాలను, చారిత్రాత్మక ఆధారాలనూ పరిశీలించాము. సంతృప్తిపొందలేదు. ఇక సాంకేతికపరంగా, వాస్తుపరంగా ఆలోచించి చూద్దాము.
తాజమహల్ వాస్తు:
"తూర్పుదేశస్తులైన ఆ మహాస్థపతులు, అలనాటి వివిధదేశాలకు చెందిన సమకాలీన భావప్రకటనలకు స్పందించినవారు, ఆకళింపు చేసుకున్నవారు. వారి అంతిమ నక్షాలకు షాజహాన్ అనుమతి లభించే నాటికే, వారు ప్రపంచంలోని సమస్త మహాద్భుతకట్టడాలను, వాటి నక్షాలను పరిశీలించి జీర్ణించుకున్నట్టివారు. ఇంతటి బృహత్పధకం చేపట్టగలిగారు అంటే ఎన్నో సుధీర్ఘ సంప్రదింపులతో తాజమహల్ కు రూపకల్పనను చేసి, ముందుగా చెక్క నామూనాలను కూడా తయారు చేసే వుంటారు..." [ఏ.బి.హావెల్. ఇండియన్ ఆర్కిటెక్చర్, లండన్, 1913] అని తాజమహల్ నిర్మాతలైన స్థపతుల వాస్తుకౌశలాన్ని హావెల్ కొనియాడాడు.
 
తాజమహల్ కట్టడ సముదాయం:
(1). మహ్తబ్ బాగ్ (మూన్ లైట్ గార్డెన్న్, యమునకు ఉత్తరదిశ వైపు) ;
(2). తాజమహల్ అరుగు, సమాధి, మసీదు, గెస్టుహౌసు ;
(3). ఉద్యానవనం;
(4). ముఖ్యద్వారము, తతిమా సమాధులు, నివాస గృహాలు ;
(5). బాజార్ ప్రాంతము
తాజమహల్ నిజంగా ఒక పెద్ద రూపకల్పనే! తాజమహల్ని షాజహాన్ కట్టించినా కట్టించకున్నా, దాన్ని అభివృద్ధిచేసి, దాని చుట్టూతా ఒక మహాప్రణాళికను రూపొందించింది, లోకానికి పరిచయం చేసింది, షాజహానే అని మనం గుర్తించవచ్చు. తాజమహల్ ఒక భవనమే కాదు. ఒక కట్టడ సముదాయం. ఎన్నో భవంతులు, ఎన్నో ఉద్యానవనాలు, కొలనులు, ఫౌంటెనులు, బాజారులు, నివాస గృహాలు, ఒకటేమిటి, అది దాదాపుగా ఒక ఊరే. ఇలా దీన్ని ఎన్నో ఎకరాల స్థలంపై రచించి నిర్మించారు.
 
తాజమహల్ కట్టడసముదాయంలో ఉద్యానవనం మహమ్మదీయ స్వర్గాన్ని ప్రతిబింబిస్తుంది. సమాధికి దక్షిణభాగంలో (నెం.3) ఉన్న ఉద్యానవనం 984*984 అడుగుల వైశాల్యం కలిగి వుంటుంది. దీని మద్యలో నుంచీ ప్రవహించే నాలుగు కాల్వలు, ఈ ఉద్యానవనాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. ఈ నాల్గు భాగాలను గట్లతో మరొక నాలుగు భాగాలుగా విభజించి, వెరసి 16 భాగాలుగా చేస్తాయి. ఉద్యానవనంలోని ఈ నాల్గు నదుల డిజైన్నే ఇస్లాంలో వర్ణింపబడే చార్‌బాగ్ అని నమ్మకం.
 
సాధారణ మహమ్మదీయ సమాధులలో ఉద్యానవనాలు దీర్ఘచతురస్రాకారంలో వుంచి మద్యలో సమాధిని నిర్మిస్తారు. కానీ తాజమహల్లో ఎందుకో మద్యలో చదును చేసి, అందులో పాలరాతి నీటి చెరువును నిర్మించారు. సమాధిని ఉత్తర దిశగా ఒక పక్కన నిర్మించారు. అది ఉత్తరం నుంచీ దక్షిణం దాకా నిర్మించిన నీటికొలనులో ప్రతిబింబిస్తూ మరింత అందంగా వుంటుంది. మొదట్లో అనేక పూలమొక్కలు, ఫలవృక్షాలు వుండేవిట. తరువాత ఆంగ్లేయుల పాలనలో ఆ ఉద్యానవనాన్ని పునర్నిర్మించి వారి తరహాలో పచ్చికపట్లు (లాన్లను) వేసారట.
మహ్తబ్ బాగ్‌
యమునకు అవతల వైపున నల్లతాజమహల్ నిర్మించాలని షాజాన్ సంకల్పించినట్లు కూడా చరిత్ర కారులు చెబుతారు. ఇటీవల త్రవ్వకాలలో అక్కడ బయటపడిన మహ్తబ్ బాగ్‌ని (Moon Light Garden)ఆ పధకంలోని అసంపూర్తి భాగంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ కథనం ప్రకారం తాజమహల్ యొక్క చార్‌బాగ్ పధకంలో యమునని మద్య నదిగా ఉద్దేశించివుండి వుంటారని కూడా ఒక వివరణ మనకు వినిపిస్తూవుంటుంది. అలా ఆలోచిస్తే తాజమహల్ ఒక ప్రక్కగా కాదు, మద్యలోనే వుంది అందుకని అది మహమ్మదీయ చార్‌బాగ్ ప్రణాళికే అని, అక్కడి స్థానిక టూర్ గైడులు చెబుతారు. ఈ త్రవ్వకాలలో ఒక పెద్ద అష్టభుజాకారంలోని కొలను, 25 ఫౌంటెన్లు, మద్యలో ఒక చిన్న కొలను, రాజపుత్రశైలిలోని దీపాల గూడులు బయటపడ్డాయి. అలాగే 1652నాటి ఔరంగజేబు ఉత్తరంలో కూడా ఈ ఉద్యానవనం వరదలలో మునిగిపోయింది అన్న ప్రస్తావన కనిపించడంతో, ఇది ఆనాటి నుంచీ కూడా వుందని దృవీకరింపబడుతోంది. కానీ ఇక్కడ దొరికిన శిధిలాల వాస్తు కళని పరిశీలించి చూస్తే, ఇది రాజపుత్రుల నిర్మాణమే అని శాస్త్రజ్ఞులు వెలిబుచ్చిన అభిప్రాయము. అంటే ఈ మహ్తబ్‌బాగ్‌ని నల్లతాజమహలుగా మార్చడానికి షాజహానుకి సంకల్పం వున్నది కానీ, దానిపై కార్యాచరణ మొదలు పెట్టలేక పోయాడని మాత్రం మనం నిర్థారించవచ్చు.
ఇలా ఈ మహ్తబ్‌బాగ్‌ని కలుపుకుని, (మొదటిగా చూపిన పఠంలోని 5 ముఖ్యభాగాలు కూడా కలుపుకొని) అతి సువిశాలమైన పధకంతో తాజమహల్ నిర్మింపబడింది. ఏ కట్టడానికైనా స్థపతులు ఏదో ఒక కొలతల పద్దతిని అనుసరించాల్సి వుంటుంది. షాజహాను వ్రాయించుకున్న చరిత్ర ప్రకారం, స్థపతులతో పాటూ అందరు నిపుణులూ పర్షియా వంటి ఆవలి దేశాల వారే. అంటే తాజమహల్ నిర్మాణం పర్షియన్ల కొలమానాల ప్రకారం వుండాలి. వికిపీడియా ప్రకారం, అలనాటి పర్షియన్ల కొలమానాలు ఇలా ఉండేవి.

ఐవాస్ (వేలు కొలత) = 20 మిల్లీ మీటర్లు;
ద్వ (చేతి కొలత) = 5 ఐవాస్;
త్రయస్ (పాదం) = 3 ద్వ;
రెమెన్ (4 చేతులు) - 4 ద్వ; ... ...
ఇలా వుంటాయి వీరి కొలమానాలు. కానీ తాజమహల్‌లో ఇటువంటి కొలతలేవీ వాడినట్లు కనపడవు.
వాస్తుచరిత్రకారుల ప్రకారం మొగల్ కట్టడాలన్నీ వారి గజ్ (గజం) అనే మొగల్ కొలమానం తోటే నిర్మింపబడ్డాయి. 17వ శతాబ్దిలో గజం పొడవు 28½ ఇంచిలుగా పరిగణించేవారట. ఇప్పుడు దీనిని ఇంగ్లీషువారి యార్డుతో (0.91మీటరు) పోల్చుతూ లెక్క చెబుతారు.
1825లో తాజమహల్ సముదాయాన్ని సర్వే చేసిన జే.ఏ. హోడ్జసన్ ఈ నిర్మాణం ఎంతో సౌష్టవతతో కూడినదని, నేలపైన గళ్ళు (ఒక గ్రీడ్) గీసుకుని దానిపైననే ఈ కట్టడన్ని రూపొందించారనీ నిర్థారించాడు. కానీ ఏ రకమైన గ్రిడ్డు వాడారో అన్న నిర్థారణ చేయలేకపోయాడు. ఆ నిర్థారణ 1989లో బెగ్లే, దేశాయిల పరిశోధనల
ే తేలింది. ముందు 400 గజాల్ గ్రిడ్డుని రూపొందించి, దానిని విభజించుకుంటూ గ్రిడ్లని వేసుకుంటూ ఈ భవన సముదాయాన్ని కట్టారని వీరు నిర్థారించారు. కానీ ఈ కట్టడాలు ఆ గ్రిడ్డులో సరిగ్గా పట్టక పోవడంతో దానికి అలనాటి కొలమాన వివరణా లోపాలే కారణమయి వుండవచ్చని సరిపుచ్చుకున్నారు.
తరువాత 2006వ సంవత్సరంలో కోచ్, రిచర్డ్ ఆండ్రే బర్రాడ్ అనే శాస్త్రజ్ఞుల పరిశీలనలో 17వ శతాబ్దిలో తాజమహల్ కట్టినప్పుడు మరింత క్లిష్టతరమైన గ్రిడ్డుని వాడి వుంటారని నిర్ణయించారు. బెగ్లే, దేశాయ్‌లు ఒక నిర్దిష్టమైన సరళమైన గ్రిడ్డుని ఊహించి దాని పైన భవనాలు కట్టారని అభిప్రాయపడ్డారు. కానీ కోచ్, రిచర్డ్ ఆండ్రే బర్రాడ్ గ్రిడ్డులు ఒక చోట ఒక రకంగానూ మరొక చోట మరొక రకంగానూ విభజించుకుంటూ పోయి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైన గ్రిడ్డుని ఊహించారు. వీరు వాస్తుచరిత్రకారులు చెప్పినట్టు, మూడు చతురస్రాలని (ఒక్కొక్కటీ 374 గజాలుగా) ఊహించారు. ఒక్కొక్క చతురస్రాన్ని వేరువేరురకాల గ్రిడ్డులుగా విభజించారు. 17 గజాల చదరాన్ని జిలౌఖానాకీ, బాజార్‌కీ నియమించారు. అలాగే 23గజాల చదరాన్ని ఉద్యానవనానికి నియమించి చూసారు. భవనాలకి చిన్ననిన్న చదరాలని ఊహించారు. అయినా వీరి
సర్దుబాటులోకూడా అనేక లోపాలు మిగిలిపోయాయి.
చివరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్, ఆర్. బాలసుబ్రమణ్యం 2009వ సంవత్సరంలో, బర్రాడ్ పరిశోధనను కొనసాగిస్తూ, బర్రాడ్ ఊహించిన గ్రిడ్ల విరణలోని లోపాలను చూపిస్తూ, వాటికి కారణం అందులో వాడిన కొలమానమే అని తేల్చిచెప్పారు. గజాలకు బదులుగా హైంద కొలమానమైన అంగుళం (1.763 సె.మి.) కొలమానంగా వాడి చూస్తే, ఉన్న లోపాలన్నీ తొలగిపోతాయని సూచించారు. ఈ అంగుళం (12 అంగుళాలు = ఒక విస్తస్తి) ప్రస్తావన క్రీ.పూ 300 నాటి అర్థ శాస్త్రంలోనూ, సిందూనాగరికతలోనూ కనిపిస్తుంది. అన్నిటికన్నా పురాతనమైన వేదాలలో, ఈ వ్యాసానికి మొదట్లో ఉదహరించిన పురషసూక్తంలో కూడా అంగుళం ప్రస్తావన కనిపిస్తుంది. హైందవ కట్టడాలన్నీ ఈ అంగుళం కొలమానంతోనే కట్టేవారు.
ఈ పరిశోధన ప్రకారం తాజమహల్లో వాడినది విస్తస్తి గ్రిడ్డే అని ప్రొఫెసర్, ఆర్. బాలసుబ్రమణ్యం గారు ఋజువుచేసారు. ఈ కొలమానం వల్ల ఒక రకమైన గ్రిడ్డునుంచీ మరొక రకమైన గ్రిడ్డులోకి మార్పిడి కూడా సులభతరమవుతుందని విశదీకరించారు. అంటే తాజమహల్ షాజహానే కట్టినా, లేక అంతకు ముందు వారే కట్టినా, అందులో వాడిన కొలమానం మాత్రం నిస్సందేహంగా హైంద కొలమానమైన అంగుళమే అని తేలుతోంది. (షాజహాన్ తెచ్చిన
స్థపతులు, నిపుణులు అందరూ మహమ్మదీయులే అని గత అధ్యాయాలలో తెలుసుకున్నాము. ఇందులో హిందువులు కూలీ వారే తప్ప నిపుణులు కారు) మరి మొగలాయులు కట్టించినప్పుడు గజాలు వాడాలి. లేకపోతే పర్షియన్ స్థపతుల కొలమానమైన "ఐవాసు"లు వాడాలి. మరి, ఈ అంగుళమెక్కడినుంచీ వచ్చింది అన్న ప్రశ్న మిగిలిపోతోంది. అంటే, ఇది మొగల్ నిర్మాణం కాదా అన్న అనుమానం మళ్ళీ మొదలవుతోంది.
 
హావెల్, బేట్లి, కెనోయర్, హంటర్ వంటి విశ్వవిఖ్యాత పరిశోధకులు కూడా మొదటి నుంచీ తాజమహల్ వాస్తుకళ మహమ్మదీయ వాస్తుకళను అనుసరించలేదని అనుమానిస్తున్నారు. అది హైందవ ఆలయాలకు చెందిన వాస్తు లాగా కనిపిస్తోంది అని అనుమానపడుతున్నారు.
తాజ్‌మహల్ నక్షా:
తాజమహల్ నక్షా (ప్లాన్‌ని) చూసిన తరువాత తాజ్‌మహల్ చూసిన ప్రతి యాత్రికుడికీ, అసలు తాను చూసింది తాజమహలేనా అన్న అనుమానం వస్తుంది. తన పరిశీలనాశక్తిపైనే తనకు అనుమానం వస్తుంది. తనకు అక్కడ కనపడనివి కొత్తకొత్తవి ఎన్నో ఈ నక్షాలలో కనిపిస్తాయి కనుక, తన కళ్ళపైన తనకే అనుమానం రావడం సహజమే.
గూగుల్ మాపు లో తాజమహల్
పైన కనించే ఈ గూగుల్ మాపుని చూస్తే ఉత్తరదిశగా యమునా నది కనిపిస్తోంది. కానీ ఈ తాజమహల్ కట్టడసముదాయాన్ని యమునానది వారగా కట్టలేదు. ఖచ్చితంగా ఉత్తర దిశనే లెక్కించి, ఉత్తరముఖంగానే నిర్థారించి కట్టినట్టు కనిపిస్తోంది. దీనిని బట్టి రెండు విషయాలు తెలుస్తున్నాయి.

(1) మొదటిది ఉత్తరదక్షిణదిశలలో శివునికున్న విశేషము. శివాలయాలు ఉత్తర దిశగా వుండటం సహజమే. దక్షిణదిశలో ప్రవేశమార్గం ఉండటం కూడా దక్షిణామూర్తి యైన శివుడికే చెల్లుతుంది. ఈశాన్య దిక్కులో కొలను; లేకపోతే ఉత్తరదిశనుంచీ ఈశాన్యదిక్కుగా ప్రవహించే నది ఉండటం, హిందూ సాంప్రదాయమే కనుక, ఉత్తరదిశలోని యమునానది ఆలయాల వాస్తుకి సరిపోతుంది.
ఇది తాజమహల్ కట్టడసముదాయంలో పశ్చిమముఖియైన మసీదు
(2) ఇక రెండవ విషయానికొస్తే, ఈ గూగుల్ మాపులో తాజమహలుకి కుడిఎడమల వైపున మరో రెండు కట్టడాలు కనిపిస్తాయి. వీటిలో ఎడమ వైపునున్న దాన్ని మసీదుగా, కుడి వైపు దాన్ని గెస్టుహౌసుగా షాజహాను కట్టించాడని చరిత్రకారులు చెబుతారు. వీటితో మరో రెండు ప్రశ్నలు వస్తాయి. "అసలు సమాధిలో గెస్టుహౌసు కట్టే సాంప్రదాయం ఏ మతంలోనూ ఉండదు కదా! అంటే ఇది నిజంగానే సమాధేనా?" అన్నది మొదటి ప్రశ్న.

ఇక రెండవది చాలా ముఖ్యమైన ప్రశ్న! ఇక్కడి మసీదు ఖచ్చితమైన పశ్చిమ దిశగా (cardinal westగా) కట్టబడి వుంది. కానీ మసీదులని
మక్కా దిశగా మాత్రమే కడతారు. తాజమహల్‌ పశ్చిమానికి క్రిందగా 14 డిగ్రీల 15 నిమిషాల నైరుతీ దిశలో మక్కా వుంటుంది. ప్రపంచంలోనీ ఏ మూల నుంచి యైనా మక్కాదిశను ఖచ్చింతంగా నిర్థారించగలిగే పరిజ్ఞానాన్ని, తొమ్మిదవ శతాబ్దికాలానికే మహమ్మదీయ స్థపతులు సాధించుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. అందుచేత వారు ఇంత ముఖ్యమైన విషయంలో (మసీదు నిర్మాణంలో) పొరపాటు చేస్తారని అని అనుకోవడం మన అవివేకమే అవుతుంది. "అంటే ఈ కట్టడ సముదాయం మహమ్మదీయ నిర్మితమేనా?", అన్న ప్రశ్న రావడం సహజమే.
ఈ కట్టడ సముదాయాన్ని నది వారగా (ఉత్తర దిశకు నిర్దేశించకుండా) కట్టినా మసీదు మక్కా వైపుకు తిరిగివుండేదే?, మరి ఉత్తర దిశను ఖచ్చితంగా లక్కించుకుని నదివారగా ఎందుకు కట్టకూడదనుకున్నారు? అంటే ఆ భవన నిర్మాతలు మసీదుకి మక్కాదిక్కుతో ప్రమేయంలేదని అభిప్రాయపడినట్లుగానే అనిపిస్తోంది. అంటే అది మసీదుగా ఉద్దేశించి కట్టిన భవనం కాదని మనం అనుకోవడంలో తప్పులేకపోవచ్చు 
అలాగే , మహమ్మదీయ సమాధులు (మసీదులే కాదు) కూడా పశ్చిమ దిక్కుగానే (మక్కా దిశగా) ఉంటాయి, ఉత్తర దక్షిణాలతో పని లేదు. కానీ ఈ భవనంలో సౌస్ఠవత ఉత్తరదక్షిణ అక్షము (NS axis) పైనే ఉంది. సమాధికి (తాజమహల్ ముఖ్యభవనానికి) పశ్చిమద్వారం తెరిచి, మిగితా మూడు ద్వారాలు మూసేస్తే, నక్షాలోని సౌస్ఠవతకు భంగం కలుగుతుంది. అందుకే తూర్పుపశ్చిమ ద్వారాలు మూసి వేయ వలసి వచ్చి వుంటుంది. ఇక ఉత్తరదిశగా నది వుండటంచేత, దక్షిణ ద్వారం గుండానే ఊళ్ళోకి వెళ్ళాలి. అందుకే తాజమహల్ సమాధి అయినప్పటికీ దక్షిణ ద్వారం నుంచే ప్రవేశం కల్పించ వలసి వచ్చిందేమో? ఇది మహమ్మదీయ కట్టడమే అయితే వారు ఇలా డెజైను చేసేవారా?
తాజమహల్ ముఖ్యభవనంలోనికి నాల్గువైపుల నుంచీ వెళ్ళడానికి ద్వారాలున్నాయి. కానీ దక్షిణ ద్వారం తప్ప మిగితావన్నీ మూసివేయబడి వుంటాయి. మూసేసారు సరే, కానీ మిగితా మూడు దిక్కులలో ఈ అక్కరలేని ద్వారాలు ఎందుకు కట్టించినట్లు? ముఖ్యంగా అవసరం లేని ఆ నదివైపుకు అన్ని దారులు ఎందుకు పెట్టినట్లు? "అంటే ఆ భవనం కట్టేటప్పుడు దాని నిర్మాతకు ఇది ఒక సమాధి కోసం కడుతున్నాము అని తెలియదా?", అన్న అనుమానం రావడం సహజమే.
కానీ అది ఆలయమో, లేదా ఒక నివాసయోగ్యమైన భవనమో అని అనుకుని చూస్తే, అప్పుడు నదివైపుకి దారులు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. తాజమహల్ ఇప్పుడున్నట్లుగా కేవలం దక్షిణముఖంగానే కాకుండా, ఉత్తరదిశగా కూడా మార్గం వుండేటట్లుగా (అంటే నది ముఖంగా కూడా ఉండేటట్లుగా ఉద్దేశించి) మొదట్లో ఈ భవనాన్ని కట్టారనడానికి మరేమైనా సాక్షాలు వున్నాయా?
1) బేసిమెంటు అంతస్తులనుంచీ, నదివైపుకు ఇప్పుడు మూసివేయబడి కనిపిస్తున్న ద్వారాలు వున్నాయి.
2) దొరికిన నక్షాల ప్రకారం మిగితా ఫొటోలప్రకారం, ఉత్తరదిశలోని నదివైపు నుంచీ పైకి వెళ్ళడానికి మెట్లు కూడా వున్నాయి.
tajphoto039
కర్నల్ హోడ్జ్సన్ 1825లో సర్వే చేసి తయారు చేసిన నక్షా. ఉత్తరదిశగా (వాయువ్యం నుంచీ ఈశాన్యం వైపుకుకు) వున్న ప్లాట్ఫారం చూస్తే అక్కడనుంచీ నదివైపుకు మెట్లు కనిపిస్తాయి ఇందులో. అంటే ఇది ఒక నదీమార్గాన్ని సూచించడమే కాకుండా, అది ఒక నివాసయోగ్యమైన ప్రదేశమని తెలుపుతుంది..
3) నిజానికి తాజ్మహల్ భవనంలోకి యమునానది నుంచీ లోనికి రావడానికి అనేక మార్గాలున్నాయి. నది వైపుకి ఎన్నో తలుపులు, కిటికీలు వున్నాయి. అన్నిటినీ రాళ్ళు పెట్టి అనుమానం రాకుండా మూయించేసారు.
4) నదినుంచీ ఈ భవనంలోకి పడవలలో కూడా వచ్చేవారని నిరూపించడనికి ఆ భవనం ముందున్న లంగరు రింగులే నిదర్శనాలు.

 
లంగరు రింగులు
పడవలను కట్టడానికి తాజమహల్‌కి ఉన్న రింగులివి. తాజమహల్‌కి ఉత్తరదిశగా మూడున్నర అడుగుల ప్లాట్ఫారం నడుస్తుంది. దానిపైన ఇలా ఎన్నో రింగులు కనిపిస్తాయి. అంటే ఈ భవనం కట్టిన అసలు యజమాని ఈ భవనంలోకి పడవలు రావాలని ఆశించి కట్టినట్టు తెలుస్తున్నది. ఆ భవనంలో (లేక ఆలయంలో) అనేక గదులుండటం చేత ఇక్కడకు వచ్చినవారు పడవల్లో ప్రయాణం చేసి వచ్చి విశ్రాంతి తీసుకునేవారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పక్కనే ఒక గెస్టుహౌసు కూడా వున్నదని ముందే తెలుసుకున్నాము. అంటే ఇది ఒక ఆలయమో, పూజాస్థలమో, ఆరామమో, భవనమో అయివుండవచ్చు. సమాధిలో అన్ని గదుల అవసరమూ, గెస్టుహౌసు ఉపయోగమూ లేవని తేలికగా చెప్పవచ్చు.  
      ఇక మిగితా నక్షాలను పరిశీలిస్తే మనకు తెలిసే విషయాలు ఇవి.
1885లో జే. ఫర్గూసన్ చిత్రించిన ముఖ్య కట్టడపు అవచ్చేదనపు (cross-section) బ్లూ ప్రింట్. దీనిలో గుప్తపరచిన బేస్మెంటు కనిపిస్తుంది.
బేస్మెంటులోలో ఉన్న 22 గదులకి వెళ్ళడానికి మెట్లని చూపించే బ్లూప్రింటు. ఈ దారికి చెందిన ఈ బ్లూప్రింటు 1902వ సంవత్సరంలో దొరికిందట. వి.యస్ గాడ్బోలే గారు 1981లో ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ బేస్మెంటుని చూసి వచ్చారట. 
(1) మనం అరుగని భావించే అంతస్తుల మూసివేయబడ్డ తలుపులు కిటికీలు.
(2) నదివైపునుంచీ చూస్తే మరొక రెండు అంతస్తులు బేసిమెంటులో కనిపిస్తాయి. ఒక భూగర్భంలోని అంతస్తు బయటకు కనిపించదు
 
నిజానికి తాజ్‌మహల్‌కి ఒక యాత్రికుడుగా వెళ్తే, మనకు పైన ఒక అంతస్తు చూపించి. మహా అయితే ఒక క్రింది అంతస్తులోని సమాధి గది చూపించి పంపించేస్తారు. ఆ తరవాత మనం చూడ గలిగింది అంతా .. .. ఆ భవనం చుట్టూ తిరగడమే. కానీ పైన చూపిన ఫొటోలో నది వైపు నుంచీ చూస్తే మూడు అంతస్తుల బేసిమెంటొకటి కనిపిస్తుంది. ఇందులో ఎన్నో నివాసయోగ్యమైన గదులున్నాయని, వాటి నుంచీ నది వైపుకి, రెండవ వైపుకి వెళ్ళడానికి అనేక మార్గాలున్నాయని కూడా ఈ నక్షాలవల్ల ఫొటోలవల్ల తెలుస్తోంది. బేసిమెంటులోని క్రింద అంతస్తు నేలక్రిందకి వుండటం చేత బయటకి కనపడదు. రెండవ మూడవ అంతస్తులు కనిపిస్తాయి. కానీ ఈ రెండు అంతస్తులనీ పూర్తిగా మూసివేసారు. అందులోకి ఎవరినీ వెళ్ళనీయరు, కానీ అందులో ఎన్నో గదులున్నాయని తెలుస్తోంది. మూడవ అంతస్తులోని కొన్నిగదులలోకి మొదట్లో కొందరిని అనుమతించేవారట. అందులో 22 అపార్టుమెంట్లు వున్నాయని, 300 అడుగుల పొడవైన పెద్ద కారిడార్ వుందని, పాత నక్షాల వల్ల తెలుస్తోంది. ఇప్పుడు అందులోకి కూడా ఎవరినీ వెళ్ళనీయరు. అన్ని అంతస్తుల లాగే ఈ మూడు అంతస్తుల కూడా ఎర్రరాతితోనే కట్టబడి వుంటాయి. కాకపోతే ఈ బేసిమెంటు లోని మూడు అంతస్తుల పైన పాలరాతి తాపడం చేయలేదు.
 
(1) మనకు చూపించని అనేక గదులలో ఉదాహరణకి ఒకటి
(2) పై అంతస్తుకి మూసివేయబడిన ద్వారం.
(3) క్రింది అంతస్తులకి మూసివేయబడిన దారి .
ఈ "మూడు అంతస్తుల బేసిమెంటు" పైన మరో రెండు అంతస్తులున్నాయి. వీటిని మనం తాజమహల్ కూర్చున్న ప్లాట్ఫారంగా గమనిస్తూ వుంటాము. వీటి పైన పాలరాతితో తాపడం చేయబడివుంటుంది. ఇందులో క్రింది అంతస్తులో (అంటే 4వ అంతస్తులో) ముంతాజ్ అసలు సమాధి వుంటుంది. మహమ్మదీయుల సాంప్రదాయం ప్రకారం, అసలు సమాధిని ఎవరికీ చూపించరు. దాని పైన మరొక అంతస్తు కట్టి, దానిలో మరొక సమాధి వంటి దాన్ని కట్టి, దానిని అందరినీ చూడనిస్తారు (పీటర్ మండీ చూసిన సమాధి కూడా ఇదే అయ్యివుండాలి). అంటే ఐదవ అంతస్తులో మరొక సమాధిని కడితే, దానినే మనకు చూపిస్తున్నారన్న మాట. ఈ ఐదవ అంతస్తులోని సమాధి చుట్టూ వున్న గదులలోకి కూడా మననెవరినీ వెళ్ళనీయరు. కానీ సమాధి గదిలోకి మాత్రం అనుమతిస్తారు. ఇకపైన వున్న ఆరవ అంతస్తే నిజంగా యాత్రికులను చూడనిచ్చేది.

పైన ఉన్న గోపురంలో రెండు పొరలు వుంటాయి. అది కూడా నిజానికి మరొక అంతస్తే. దానిని ఏడవ అంతస్తుగా పరిగణిస్తారు. ఇందులోకి కూడా మనకు అనుమతినీయరు.
ఎన్నో గదులు: తాజ్‌మహల్ క్రింద బేసిమెంటులో మూడు అంతస్తులు, అందులో ఎన్నో గదులు, వాటికి నదివైపుకి (ఇప్పుడు మూసివేయబడి వున్నా) తలుపులు కిటికీలూ కూడా కనపడుతున్నాయి. సమాధిలో, అందులోనూ నేల మాళిగలలో(భూగర్భ అంతస్తులలో), అన్ని గదుల అవసరం ఏముంటుంది? కానీ అది ఒక భవనమైతే, లేక ఒక శివాలయమయి వుండివుండుంటే, ప్రతి గదికి ఒక ప్రణాళిక, ఉపయోగం వుంటాయి అని వెంటనే తెలుస్తుంది. హిందూమందిరాలలో, భవనాలలో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకమైన పూజాపునస్కారాలు జరిగే అవకాశముంటుంది. పూజారులకి వసతిగృహాలకు అవకాశం ఉంటుంది. ఆలయాలలో బాటసారులకు ఆరామాలు, విడిది ఏర్పాటులు ఉంటాయి, మౌనమందిరాలు వుంటాయి. ఇలా ఒక్కొక్క గదికీ అనేక ప్రణాళికలు వుంటాయి.

తాజమహల్ బైటవున్న ముఖ్యద్వారంలో కూడా ఎన్నో గదులు, నడవాలు, తాజమహల్ ప్రక్కన గెస్టుహౌసు అనబడే మరొక పెద్ద కట్టడము, ఈ కట్టడ సముదాయంలో ఎన్నో రాజపుత్రశైలిలోని దారులు, వాటికి ఇరుపక్కలా అనేక నివాసయోగ్యమైన గదులు. ఇలా ఎక్కడచూసినా నివాసయోగ్యమైన కట్టడలు, గదులు లెక్కలేనన్ని ఉంటాయి. ఈ నక్షాలు చూస్తే, నిజానికి ఒక సమాధిలాగా కాదు, ఒక మహారాజభవనంలాగా, ఒక మాహా ఆలయంలాగా కనిపిస్తుంది.
(1) క్రింది అంతస్తులో 300 అడుగుల పొడవైన కారిడార్- (2) క్రింది అంతస్తులో ఉన్న 22 ఎపార్టుమెంటు గృహాలలో ఒకదానికి ద్వారం. అన్నీ మూసివేయబడ్డాయి -(3) దిగువ అంతస్తులలో ఇటుకలతో మూసివేయబడ్డ ద్వారాలు
నది వైపునుంచీ తాజమహల్ కట్టడసముదాయం
నది వైపునుంచీ చూస్తే, దాచబడ్డ మరో రెండు అంతస్తులు కనిపిస్తాయని విన్సెంట్ స్మిత్ కూడా తను 1911 లో వ్రాసిన "History of Fine Art in India and Ceylon", పుస్తకంలో పేర్కొన్నాడు. ఆ రహస్య అంతస్తుల ఫొటో మనకు 1844 నాటి స్లీమన్ వ్రాసిన –"Rambles and Recollections of an Indian Official" పుస్తకంలో కూడా కనిపిస్తుంది. కానీ ఏ పరిశోధకుడినీ ఈ అంతస్తుల్లలోకి వెళ్ళనీలేదు. ఆ అంతస్తులలో ఇంకా ఎన్నిఋజువులు దొరుకుతాయో తెలియదు, ఇంకా ఎన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతాయో తెలియదు. ఇన్నిన్ని అంతస్తులు, ఇన్నిన్ని గదులు ఎందుకున్నాయని? వీటిల్లో ఎవరు వుండేవారనీ? సమాధిలో ఈ గదులు వుండవలసిన అవసరమేమిటీ అని? చివరగా .... ఇది హిందూ మందిరమే ఐతే ... .. హిందువుల మందిరాన్ని ఇలా అపవిత్రం చేసి సమాధిగా ఎందుకు మార్చారని? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, ఆ అంతస్తులన్నిటినీ యాత్రికులకూ, పరిశోధకులకూ, చరిత్రకారులకూ అన్ని అంతస్తులనూ అందుబాటులో లేకుండా చేసారని మనం తేలికగా వూహించవచ్చు. అలా తాజ్‌మహల్ భవనం మొత్తం 7 అంతస్తులని, అందులో ఇంకా చాలా చాలా గదులు వున్నాయనీ మనకు తెలియనివ్వరు. అది ఈ నాడే కాదు. షాజహాన్ ఆ భవనాన్ని చేజిక్కించుకున్న నాటి నుంచీ అంతే. అన్ని గదులకు వెళ్ళే దారులను మూసేసారు, అని మనం ఊహించుకోవడం తప్పు కాదేమో?
(1) పై బేసిమెంటు అంతస్తులోని ఎపార్టుమెంటుకి గాలి రావడానికి ఏర్పరచిన పాలరాతి జాలీ. (2) లోపలనున్న అనేక పూజామందిరాలు.
నగర్ ఖానా: ముఖ్యద్వారానికీ పాలరాతి తాజ్మహల్కి మద్య, దారికి ఇరుపక్కలా నగర్ ఖానాలనబడే రెండు మృదంగవాయిద్య ప్రదర్శనల భవనాలు (Drum Houses) కనబడతాయి. సమాధిలో సంగీత ప్రదర్శనలేమిటి? అందునా ఇస్లాంలో సంగీతం నిషిద్ధం కూడా! కానీ శైవాలయాలలో మేళతాళలకు ఒక ప్రత్యేక విశిష్ఠతవుంది. పూజావిధానంలో సంగీతం ఒక ముఖ్యభాగం కూడా. శివాలయాలలో మృదంగ డోలకుల వంటి వాయిద్యాలతో శివతాండవ నృత్యాలు అనాదిగా పరిపాటే.
గోశాల: తాజ్మహల్ పరిధిలోని తూర్పు మూలనే, ఒక గోశాల అని పిలవబడే  పాక వుంటుంది. సమాధిలో గోశాల అవసరం లేదు. కానీ ప్రతి హిందూదేవాలయంలోనూ గోశాల సర్వసాధారణమే. ఇంత సౌష్ఠవతతో కట్టిన తాజమహల్లో ఒకే మూల కనపడే, ఈ గోశాల తాజమహల్ సౌష్ఠవతకు భంగం కలిగించుతోంది. అంటే దాని ఎదురుమూలలో మరొక గోశాల లేదు. ఈ సఔష్ఠవతకూ భంగం కలింగించే ఈ గోశాలకు సమాధిలో వుండవలసిన ఆవశ్యకత ఏమిటి. అదే ఒక మందిరంలోనో భవనంలోనో ఐతే గోశాలను (భవనసముదాయసౌష్టవతకు భంగం కలిగించినా) ఎందుకు నిర్మించవలసి వచ్చిందో ఊహించడం అంత కష్టమేమీ కాదు. అంతే కాదు పేరుకూడా సంస్కృత నామమే. ఆలయం, మహమ్మదీయుల ఆధీనంలోకి వచ్చి ఒక సమాధిగా మారిపోయినా, అక్కడి స్థానిక ప్రజలు అలవాటు ప్రకారం దాన్ని ఇంకా గోశాల అని పివడమే పేరుకి కారణం అయివుండి వండవచ్చు.
1) పైనున్న గదులకి వరండాలు. సమాధులలో ఇన్ని గదులు, వరండాల అవసరం లేదు అది ఒక భవనమో మందిరమో అయితే తప్ప.  (2) బౌలీ బుర్జ్ లోని నీటి భావి- ఏడు అంతస్తుల క్రింద వున్న ఈ భావిలోనుంచీ నీరు తోడుకునేవారు. దాని చుట్టూ ఎన్నో గదులు. అన్ని గదులల్లోకీ నీరు రావడమే కాక, అక్కడ ఉన్న నీటి వలన అన్ని గదులల్లోకీ చల్లటి గాలి వస్తుంది. అంటే నివాస యోగ్యంగా వుండటానికి, బతికున్నవారికోసం, కట్టినది ఈ కట్టడం అని తెలుస్తోంది).
ఇలా తాజమహల్ వాస్తుని పరిశీలించిన కొద్దీ, కొత్త ప్రశ్నలు వస్తూనేవుంటాయి. బాదుషానామా ప్రకారం ఇది రాజా మాన్సింగ్ వారి భవంతి అని తెలిసింది. ఇంకా ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు దొరికాయి, అలాగే ఎన్నో హైందవ చిహ్నాలను కూడా గమనించాము. ఇన్ని చూసిన తరువాత, ఇది మహమ్మదీయ కట్టడమేనా అన్న అనుమానం మరింత బలపడిందే కానీ, మనకు దొరికిన సాక్షాలు నిరూపించడానికి చాలవు. ఎందుకంటే వాస్తు పరంగా ఇంకా అందరూ అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి పోయింది. తాజమహల్ బల్బు గోపురాలు, ఆర్చిలూ, మినారులూ చూస్తే అవి మహమ్మదీయతనే ప్రతిబింబిస్తున్నాయి. అసలు హిందూ ఆలయాలను ఇలా నిర్మించే ఆచారం వున్నదా? ఉన్నా అటువంటి అచారం తాజమహల్ కంటే ముందు వున్నదా? అంతే కాదు, షాజహాన్ కన్నా ముందునుంచే తాజమహల్ వుంది అంటే, దాని వయస్సుని నిర్థారించలేక పోయారా? ఇలా చాల ప్రశ్నలు మిగిలి పోతాయి. అంటే ఇక సైన్సులోకి పోవాలన్న మాట. అవి తరువాతి భాగాలలో అన్వేషించి చూద్దాం.
                                                                                 (సశేషం)

 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb12/sujananeeyam.html

6, అక్టోబర్ 2012, శనివారం

తాజ్‌మహల్ షాజహాన్ కట్టిచిందేనా? చారిత్రాత్మక ఆధారాలు (రెండవ భాగం)

- రచన : రావు తల్లాప్రగడ
 
గతభాగంలో  తాజమహల్లొ కనపడిన హైందవ చిహ్నాలను గమనించాము. 
 
ఈ అధ్యాయంలో చారిత్రాత్మకమైన అధారాలను పరిశీలించి చూద్దాము.

మన దేశంలో చరిత్ర వ్రాసుకునే అలవాటు మొదటి నుంచీ కొంచెం తక్కువే. అందుకే చరిత్ర తెలుసుకోవాలంటే మనకు విదేశీ పర్యాటకులు వ్రాసుకున్న పుస్తకాలే చాలా వరకు ప్రామాణికమయ్యాయి. కానీ మొగలు చక్రవర్తుల వద్ద ఆస్థాన చరిత్రకారులు ఉండేవారు. మొగలులు కూడా నిజానికి తురకలు (టర్కీ దేశస్తులే) కాబట్టి వారి ఆచారవ్యవహార పద్దతులు యూరోపియన్ల వలే కొంచెం ఆధునికంగా వుండేవి. ఇలా మొగల్ చక్రవర్తుల వద్ద మనం నేర్చుకున్న విషయాలు నిజానికి అనేకం. ఒకరకంగా చూస్తే, మనకి డాక్యుమెంటేషన్ గురించి నేర్పింది వారే అని చెప్పుకోవచ్చు. వారివల్ల మనకు ఆధికారిక పరిభాష, పద్దతులు అనేకం వచ్చి చేరాయి. అలా మనకు కొంచెం మంచి జరిగినట్టే, చెడు కూడా కొంచెం జరిగింది. మంచిచెడులు కలిసిరావడం సహజమే, కాకపోతే మంచిని గ్రహించి చెడుని వదులుకోవ గలగడమే వివేకం.

ఇక చరిత్ర విషయానికొస్తే మనకు మిగిలింది లేక దొరికేవి మొగలు ఆస్థాన చరిత్రకారులు వ్రాసినవి, అలనాటి యూరోపియన్ పర్యాటకులు ప్రత్యక్షంగా చూసి వ్రాసుకున్న యాత్రానుభవాలు. వీటి గురించి గతంలో పి.ఎన్ ఓక్ గారు జరిపిన విశ్లేషణలే ఈ నాటికి కూడా మార్గదర్శకాలు. ఓక్ గారు ఒక చరిత్రకారుడు కాక పోయినా, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఇంతవరకూ ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోయారన్నిది మాత్రం నిజం. ముందు పి.ఎన్.ఓక్ గారు తన ఇతిహాస్ పత్రికలో ప్రచురించిన చారిత్రాత్మక అధారాలని పరిశీలిద్దాం. 

షాజహాన్ 

షాజహాన్ పుట్టింది జనవరి 5, 1592; చనిపోయింది జనవరి 22, 1666. ఇతడు భారతదేశాన్ని 1628 నుంచీ 1658 దాకా పాలించాడు. మొగల్ వంశంలో ఇతడు బాబర్, హుమాయున్, అక్బర్, జహంగీర్ల తరువాత ఐదవ వాడు. తన సామ్రాజ్యాన్ని 3లక్షల చరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెంచి, చివరికి తన కుమారుడైన ఔరంగజేబు చేత బంధింపబడి 1666లో మరణించాడు. తాజమహల్ తొ పాటూ, ఢిల్లీ లోని ఎర్రకోట, జామా మసీదు, ఆగ్రా కోట లోని కొన్ని భాగాలూ, వజీర్ ఖాను మసీదు, లాహోరులోని మోతీ మసీదు ఇతడు, మున్నగునవి ఇతడే కట్టించాడని చరిత్ర చెబుతున్నా, అది పూర్తిగా నిజం కాదనే వాదనలు అనేకం వున్నాయి. కానీ ప్రస్తుత వ్యాసం తాజమహల్ పైననే కనుక ఈ వ్యాస పరిధిని ఇంతవరికే పరిమితం చేద్దాం.

అనేక శతాబ్దాలుగా తాజమహల్ అంటే ... ఇది షాజహాన్ తన భార్యపై ప్రేమతో కట్టించిందని; అది ఒక అమర ప్రేమకు చిహ్నమని చదువుకుంటూ వస్తున్నాము. షాజహాన్ తన పూర్వీకుల లాగే తన అంతఃపురంలో అనేకమంది భార్యలు, ఉంపుడుగత్తెలు, నర్తకీమణులను ఉంచుకునేవాడు అని అనేకమంది యూరోపియన్ పర్యాటకులు వ్రాసారు. మొగల్ ఆస్థానంలో పనిచేసిన "Niccolao Manucci" అనే ఒక ఇటాలియన్, తన స్మృతిలో వ్రాసుకున్నదాని ప్రకారం, "అమ్మయిలను వెతుక్కుని తెచ్చుకుని తన కామాన్ని తీర్చుకోవడమే షాజహాన్ చేసే ముఖ్యమైన పనిగా కనిపిస్తుంది. అలా తెచ్చుకున్న స్త్రీలతో, తన కొలువులో ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుపుకునేవాడు. దానిలోకి హోదాసంపదలకు ప్రమేయము లేకుండా కేవలం అందమైన ఆడవారినే తెచ్చుకునేవాడు. వేరే వారెవరినీ అందులోనికి అనుమతించరు." చిట్టచివరికి షాజహాన్ని అతడి స్వంత కుమారుడే (ఔరంగజేబు) కారాగారంలో బంధీగా వుంచాడు. అప్పుడు "తన తండ్రికి ఇచ్చిన అదనపు అనుభోక్తంగా, ఆ చిట్టచివరి రోజులలో తన చుట్టూ ఆ వందలాది ఆడవారిని వుంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు". అంటే అవసాన దశలో సైతం, ఆ కారాగారంలో ఉన్నప్పుడు కూడా, షాజహాన్ స్త్రీ లోలుడుగానే ఉండేవాడని అని తెలుస్తోంది. అంతేకాదు మొగల్ అధికారిక చరిత్రకారుడైన "క్వజినీ" కూడా షాజహాన్‌కి కనీసం ముగ్గురు భార్యలని వ్రాసాడు. ఇలాగే షాజహాన్ అంతఃపురంలో 5000 మందికి పైగా స్రీలు వుండేవారని మరొక కథనం కూడా వినపడుతుంది..

ఇదంతా ఒక ఎత్తైతే మరికొందరు యూరోపియన్ పర్యాటకుల కథనాలలో షాజహాన్‌కి తన స్వంత కుమార్తె ఐన జహనారా బేగంతో కూడా అక్రమ సంబంధం వుండేదని కూడా పుకార్లు వున్నాయి. ఇది మనం నమ్మవలసిన పనిలేదు కానీ, అందులో నిజానిజాలను పక్కనపెట్టి, చరిత్రకారులేమి వ్రాసారో చూస్తే కనపడే విషయాలివి. ఫ్రాంకోస్ బెర్నియర్ తన "Travels in the Mogul Empire, A.D. 1656-1668 (translated by A. Constable and edited by V. A. Smith (1914))" అన్న పుస్తకంలో " షాజహాన్ పెద్ద కూతురైన బేగం సాహిబా చాలా అందంగా వుండేది... వదంతుల ప్రకారం వారిరువురి మద్య సంబంధం నమ్మశక్యం కాని స్థాయికి చేరింది. దానిని అతడు సమర్ధించుకునే విధానాన్ని తన ముల్లాలు, వైద్యుల పైన వదిలేసాడు. వారి సమర్థనల ప్రకారం.. .. చక్రవర్తికి తన తోటలోని ఫలాలను రుచి చూసే హక్కువుంటుంది" అని వ్రాసాడు. జోనాస్ దె లెయట్ అనే యూరోపియన్ ఈ వదంతులను మొట్టమొదటి సారిగా గ్రంధస్థం చేసినట్లు తెలుస్తోంది. పీటర్ ముండీ, జేన్ బాప్టైస్ టావెర్నియర్ లు కూడా ఇదే వదంతి పైన వ్రాసినట్లుగా తెలుస్తోంది. కానీ కె.ఎస్.లాల్ ప్రకారం "ఈ వదంతులు ఔరంగజేబు వలనే పుట్టాయి. అతడే వ్యక్తిగత స్పర్థల వలన ఇలా ఒక పెద్ద అపవాదుని చిత్రీకరించి వుండివుంటాడు. అతడే షాజహాన్ని బంధించి, షాజహాన్ పితృవాత్సల్యానిని ఒక కళంకంగా నిందించి వుండవచ్చును; అలా కనుక ఐతే అది ఔరంగజేబు చేసిన పనులన్నిటిలోకీ నీచాతినీచము;...... ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితులలో ఈ విషయంపై ఖచ్చితంగా ఎటూ నిర్థారించలే ము"... అని పేర్కొన్నాడు. నిజమే షాజహాన్ మరీ అంత దిగజారి వుండకపోయి వుండవచ్చు కానీ, మొత్తానికి అతడి వ్యక్తిత్వమేమీ అంత గొప్పది కాదని మాత్రం మిగిలిన సమాచారం వల్లనైనా నిర్థారించవచ్చు.
ఐతే, ఈ షాజహాన్ గురించా, మనం ఒక అందమైన ప్రేమ కథను అల్లుకుని పులకరించిపోతున్నాము? ఈ కామంధుడా తాజమహల్ ని కట్టించి ఒక మహాప్రేమికుడిగా చరిత్రలో నిలిచిపోయింది? తాజమహల్ని షాజహానే కట్టించినా కట్టించకపోయినా, ఒక్కటి మాత్రం చెప్పవచ్చు, దానిని అల్లుకుంటూ చెప్పే ప్రేమ కథ మాత్రం అంతా ఒక కట్టుకథ మాత్రమే అని, అది అలా వ్రాయించుకున్నది మాత్రమే అని. ఇహ పోతే, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన ఈ తాజమహల్ని కూడా దగ్గిర నుంచీ చూసి పరీక్షిద్దాం. తాజమహల్ అసలు మొగలాయిలు కట్టించిదో కాదో చూద్దాం. 

షాజహాన్ యమునా నది ఒడ్డున 1631-53 సంవత్సరాల మద్య తాజ్‌మహల్‌ని నిర్మించాడన్నది అందరూ చదువుకున్నదే. కానీ పి.ఎన్. ఓక్ వ్రాసిన పుస్తకం ప్రకారం ఇది 12వ శతాబ్దికి చెందిన ఒక శైవ మందిరం. మొగలాయిలు ఆక్రమించుకుని అపవిత్రం చేయగా, పూజలు నిలుపవేయ బడిన అనేక హిందూ మందిరాలలో ఇది ఒకటి. హుమాయున్ కాలలంలో వారి సామంతుడైన రాజా మాన్‌సింగ్ ఈ ఆలయాన్ని వశం చేసుకుని ఒక భవనంగా మిగిల్చాడు. ఆ తరువాత ఆ ఆలయాన్ని రాజా జయసింగ్ వద్దనుంచీ షాజహాన్ కైవసం చేసుకుని, దానిని ఒక సమాధిగా మార్చాడని, శ్రీ ఓక్ గారు నిర్థారించిన విషయం. అంటే తాజ్‌మహల్ షాజహాన్ కన్నా కొన్ని వందల ఏళ్ళ పాతది అయి వుండాలి. ఐతే షాజహాన్ కట్టించింది ఏమిటి? ఉన్న ఈ భవన సమూహాన్ని ఆక్రమించుకుని, కొన్ని చోట్ల కూల్చి, మార్పులు చేసి, హిందూ మందిరాన్ని ఒక మహమ్మదీయ సమాధిగా మార్చి, ఆ అందమైన కట్టడం మొత్తాన్నీ తానే కట్టించినట్టుగా చరిత్ర తిరగ వ్రాయించుకోవడమే ... అని మరికొందరు ఊహించిన విషయం. ఆ చరిత్ర నిలబడటం కోసం, దాని చుట్టూ ఒక ప్రేమ కథను సృష్ఠించి, దాన్ని తన ప్రియురాలి సమాధిగా చిత్రీకరించి వుంటాడు అనేది మరొక ఊహాగానం.

ముంతాజ్

కానీ, దీనికి భిన్నంగా, షాజహాన్ తన భార్య, ముంతాజ్ పైన ప్రేమతో, ఆమెకు సమాధిగా 20 వేల మంది కూలీలతో, 22 ఏళ్ళ కాలంలో (1631-1653 ) ఈ తాజమహల్ని నిర్మించాడని చరిత్ర గొప్పగా చెబుతోంది. ఐతే, ఇదే చరిత్ర ప్రకారం, ముంతాజ్ ఆగ్రాలో చనిపోలేదు. ముంతాజ్ బర్హంపురంలో (ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో వుంది) జూన్ 20, 1631 నాడు చనిపోతే, అక్కడే ఆమెకు సమాధి కట్టారని, దానికి ఋజువుగా అక్కడి సమాధి కనిపిస్తోంది. అక్కడ షాజహాన్ యుద్ధం చేస్తూ వుండగా తనతో ఉండటానికి ఆమెను తెచ్చుకున్నాడట. అక్కడ కాన్పులో ప్రసవిస్తూండగా ఆమె మరణించిందట. ఆరు నెలల తరువాత (1632 జనవరిలో), బర్హంపూర్ సమాధిని తవ్వి, ఆమె శరీరాన్ని బయటకు తీసి, ఆగ్రాలోని తాత్కాలిక సమాధిలోకి తరలించారని, మళ్ళీ ఆ తరువాత ఎప్పుడో తెలియదు కానీ, ఆమె శరీరాన్ని తాజమహల్‌లోకి మార్పించారని తెలుస్తోంది. ఇలా "ముంతాజుని మూడు చోట్ల సమాధి చేసారు" అని చరిత్ర చెబుతోంది.


ఆధికారిక "బాదుషానామా"లోనుంచీ, షాజహాన్ జారీచేసిన "ఫర్మానాల" నుంచీ, రాజా జయసింగ్ దగ్గిర తాజ్‌మహల్ భవనానికి మక్రానా గనుల నుంచీ పాలరాయి కొనుగోలుకై వ్రాసి ఇచ్చిన "విక్రయపత్రాల" నుంచీ, "ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి పీటర్ మండీ" వ్రాసుకున్న తన "ఆగ్రా యాత్రానుభవాల" నుంచీ, ఫ్రెంచ్ వర్తకుడైన "జె.బి. టవెర్నియర్" వ్రాసుకున్న తన "యాత్రానుభవాల" నుంచీ, సేకరించినవే. అవి కూడా పరిశీలిద్దాము.

బాదుషానామా:

బాదుషానామాలో ఇలావ్రాసుందట... " ముంతాజ్ శవాన్ని బర్హంపురం సమాధి నుంచి త్రవ్వి తీసి, ఆగ్రాకు తరలించారు. ఆగ్రాలో ఒక తాత్కాలిక సమాధిలో వుంచారు. ఎంచుకున్న అంతిమ సమాధి ఆగ్రా నగరానికి దక్షిణ భాగాన వున్న అందమైన తోటలలో వుంది. అందులో రాజా మాన్‌సింగ్ వారి భవంతిని ఎంపికచెయ్యడం జరిగింది. ప్రస్తుతం అది రాజా జయసింగ్ వారి ఆధీనంలో వుంది. రాజా జయసింగ్ ఆ భవంతిని తన పూర్వీకుల విశిష్టమైన వారసత్వ ఆస్తిగా, ఒక పుణ్యప్రదేశంగా భావిస్తాడు. కానీ షాజహాన్ ని కాదనలేక, ఇవ్వడానికి ఒప్పుకోవలసివచ్చింది. ఫలితంగా అతనికి సర్కారీ భూమిని ఇవ్వడం జరిగింది. తరువాత సంవత్సరం మహరాణి దేహం, ఆ భవనంలో పూర్తి విశ్రాంతి పొందింది. రాజశాసనం ప్రకారం, అధికారుల సమక్షంలో ఆకాశమంత ఎత్తువున్న ఆ సమాధిలో ఆ మహారాణిని దాచిపెట్టారు. ఎంతో సువిశాలము, ఘనము అయిన ఆ భవనం ఒక పెద్ద మహాగోపురంతో (ఇమారత్-అ-ఆలిషాన్ వా గుంబేజ్) శోభిల్లుతూ, చక్రవర్తుల శక్తిని తెలుపుతూ, అందనంత ఎత్తులో వుంది. వేసిన పునాదులు, క్షేత్రగణితజ్ఞులకే అందనంత పెద్దగా  వుండి, స్థపతుల జ్ఞానశక్తిని తెలియచేస్తున్న, ఈ కట్టడానికి రూ 40 లక్షలు ఖర్చయ్యింది."

బాదుషావామాలో ఒక పేజీ

దీన్ని చదివితే ఎవ్వరికైనా అర్థమయ్యేది -- షాజహాన్ బలవంతంగా రాజా జయసింగ్ దగ్గర నుంచీ ఒక పూర్వీకుల పవిత్ర భవంతిని లాక్కుని దానిపై 40 లక్షల రూపాయిలు ఖర్చు పెట్టి, దానికి మార్పులు చేర్పులు చేయించి, హిందువుల మందిరాన్ని సమాధిగా మార్పించాడని తెలుస్తోంది. ఈ భవనం రాజా మాన్‌సింగ్‌ది. షాజహాన్ కట్టించినది కాదు అని చాలా సీదాసాదాగా స్పష్టంగా కనిపించిన మాటే అయినా, తరతరాలగా జానపదంలో మిగిలిన కథనం ప్రకారం, షాజహానే ఈ భవనం కట్టించాడు అని చాలా మంది వాదిస్తారు. వారి వాదనకున్న ఆధారం ... "అందులో పునాది వేసాడన్న మాట". నిజమే ఆ మాట వింటే మళ్ళీ షాజహానే కట్టించాడన్న వాదనకు బలం కనిపిస్తుంది. కాబట్టి షాజహాన్ కట్టించలేదు అని వాదించేవారికి మరిన్ని ఋజువులు చూపించాల్సిన అవసరం వుంది. 

"పునాది వేసాడు" అన్న మాటకు అర్థంగా "భవన మరమ్మత్తుల పధకానికి అంకురార్పణ" అని కూడా తీసుకోవచ్చు అని "ఓక్" గారి వాదన. ఈ వాదనలో వున్న బలాబలాలు తెలియాలంటే ఈ కట్టడాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది. ఇందులో మార్పులు జరిగినట్లు ఎక్కడైనా కనిపిస్తే అవి తరువాత చేర్పించినట్టుగా తెలుసుకోవచ్చు. 


ఈ పాలరాతి మెట్లు తరువాత అతికింపబడ్డవని అవి ఆ మెట్ల వల్ల అర్థాంతరంగా, అర్థరహితంగా కప్పబడిన డిజైన్లను చూస్తేనే తెలుస్తుంది.

మసీదు అనబడే కట్టడం. ఇందులో ముల్లాలు ఎక్కి కూర్చునే మెట్లని గమనిస్తే, ఆ మెట్లు వెనుక గోడల పైనున్న డిజైనులని కప్పివేస్తూ విరిచివేస్తూ కనిపిస్తాయి. అంటే ఆ భవనం మసీదుకోసం కట్టినది కాదని, తరువాత అలా మార్చుకున్నారనీ అనుకోవచ్చు. ఎందుకంటే మసీదుమొత్తంలోకీ ఇంత ముఖ్యమైన స్థానాన్ని ఇలా అడ్డకోలుగా ఎవరూ కట్టరు. దానిచుట్టూతా డిజైనులు వేస్తారు కానీ, డిజైనులను కప్పుతూ ఈ స్థానాన్ని నిర్మించరు

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా ఫొటోలే కాకుండా చారిత్రాత్మక వివరణలు కూడా పరిశీలిద్దాం. బాదుషానామా ప్రకారం బర్హంపురంలో జూన్ 20, 1631 నాడు ముంతాజ్ మృతి చెందారు. తరువాత జనవరి 8, 1632 నాటికి ఆ శరీరాన్ని ఆగ్రాకి తరలించడం జరిగింది. కానీ తాజ్‌మహల్లో ఎప్పుడు సమాధి చేసారు అన్న మాట మాత్రం (ఆగ్రాకి వచ్చిన తరువాతి సంవత్సరం అనడం తప్ప) ఇందులో చెప్పలేదు. అన్ని తేదీలూ చెప్పి, ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఎందుకు వదిలి పెడతారు అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. అంటే తాజ్‌మహల్‌లో ముంతాజ్‌ని నిజంగా పాతిపెట్టరా లేదా అన్న అనుమానం కూడా వస్తుంది! కాని పాతి పెట్టడం అంటూ నిజంగా జరిగిందే అనుకుంటే, అది ఫిబ్రవరి 25, 1633 నాటికన్నా ముందే ఎప్పుడో జరిగి వుండాలి. ఎందుకంటే, ఆ నాటికి "ఆ అద్భుత భవనాన్నీ, ఆ సమాధిని నేను చూసాను, ఆ సమాధి చుట్టూ బంగారు కడ్డీలు అమర్చారు. ఇది ఇప్పటికే ఒక యాత్రాస్థలంగా ప్రసిద్ధి పొందింది " అని "పీటర్ మండీ" తన పుస్తకంలో వ్రాసుకున్నాడు కనుక. 
 
కానీ తాజమహల్ కట్టింది 1631-53 మద్యలో అని చరిత్ర చెబుతోంది. ఆ సమాధి తాజమహల్ లోని 5వ అంతస్తులో వుంది. అంటే 1632 నాటికే కనీసం 5 అంతస్తులైనా పూర్తి అయ్యివుండాలి. తాజమహల్ అందరూ అనుకున్నట్టుగా 2 అంతస్తుల భవనం కాదు. ఇది మొత్తం 7 అంతస్తుల భవనం. ఇది 7 అంతస్తుల భవనమేనని ఔరంగజేబు కూడా తన లేఖలో వ్రాసుకున్నాడు. ఆ అంతస్తుల వివరాలు తరువాతి అధ్యయాల్లో మరింతగా పరిశీలిద్దాం. షాజహాన్ ఒక్క సంవత్సరంలోనే 5 అంతస్తులు కట్టించి నగిషీలు చెక్కించి బంగారుమయమైన కట్టడాన్ని నిర్మించేస్తే మిగితా 21 సంవత్సరాలు ఏమి కట్టించినట్లు? 

ఇలా ప్రశ్నిస్తే వచ్చే సమాధానం.. .. ఇలా రావచ్చును. బాదుషానామాలొ చెప్పినట్లు రాజా జయసింగ్ దగ్గిర కొన్న భవంతిలో కింది 5 అంతస్తులు ముందే వున్నాయి అనుకుంటే, మిగితావి రెండే అంతస్తులు కనుక, సమాధిని కట్టడానికి సమయం సరిపోయింది. అంటే ఆ పైన వున్న (నేడు మనకు కనబడే) పాలరాతి తాజమహల్ని తరువాత 21 సంవత్సరాలలో షాజహాన్ కట్టించి వుండవచ్చు అని మనం అనుకోవచ్చు. అలా అయివుండటానికి అవకాశం తప్పకుండా వుంది. ఈ అవకాశాన్ని కూడా పరిశీలిద్దాం. 

ఔరంగజేబు లేఖ:
ఔరంగజేబు లేఖ:

తాజమహల్ కట్టించింది 1631 నుంచీ 53 దాకా అని ఇందాకే చెప్పుకున్నాము. 1652 లో షాజహాన్ కుమారుడు ఔరంగజేబు తాజమహల్ పర్యటించి దోల్పూర్ నుంచీ వ్రాసిన లేఖలో ఇలా అన్నాడట ( వి.యస్. వత్స్ గారి తర్జుమా)-- "పవిత్రమైన సమాధి గోపురాలన్నిటిలో నుంచీ నీరు కారుతోంది, వెంటనే వాటికి మరమ్మత్తులు చేయించాలి. వర్షాకాలంలో ఉత్తర దిశలో కారుతోంది. మిగితా చిన్న గోపురాలు, రెండవ అంతస్తులోని గదులలో, నాలుగు చిన్న గోపురాలలోనూ, భూమి కింద నున్న గదులలోనూ అనేక చోట్ల బీటలువారి వున్నాయి. క్రిత ఏదాది అన్నిటికీ మరమ్మత్తులు చేయించాము. కానీ మనం సఫలీకృతులయ్యామో లేదో తెలియాలీ అంటే, మళ్ళీ వర్షాలు పడితే కానీ తెలియదు. జామాయిత్ ఖానా పైన, అలాగే మసీదు పైన వున్న గోపురాలు కూడా కారుతున్నాయి. మన స్థపతి అభిప్రాయం ప్రకారం, రెండవ అంతస్తు కప్పుని మొత్తం విప్పి మళ్ళీ సున్నంతో కట్టి, అలాగే అదనంగా అరగజం సున్నం ముట్టిస్తే గదులు ద్వారబంధాలు కూడా కారకుండా వుంటాయి. కాని మహాగోపురానికి మాత్రం ఎలా మరమ్మత్తు చేయాలో స్థపతులకి తెలియదంటున్నారు. .... .... ... "

ఈ ఉత్తరం చూస్తే మనకు అర్థమయ్యేది 1652లో మొత్తం అన్ని గోపురాలలోనూ నీరుకారుతోంది. తాజమహల్ కట్టినది 1631 నుంచీ 1653 దాకా అని మనం చదువుకున్నాము. మరి నిర్మాణం కూడా పూర్తికాకుండానే ఇన్ని మరమ్మత్తులేమిటి? నిర్మాణంలోని తప్పులైతే నిర్మాణం సరిగా చేయలేదని స్థపతులని ఆపేక్షించినట్లు కూడా లేదిక్కడ! గమ్మత్తుగా లేదూ! అంతేకాదు స్థపతికి మహాగోపురం మరమ్మతు ఎలా చేయాలో తెలియదట. కట్టింది ఆయన కాదా?

అంటే బాదుషానామాలో చెప్పిన "ఒక మహాగోపురం క్రింద వున్న భవనంలో ముంతాజ్‌ని సమాధి చేస్తున్నారు" అని వున్న మాట అక్షరాలా నిజమన్న మాట. అంటే అది రాజా జయసింగ్‌వారి భవనమే అని తేలుతోంది. గోపురాలతో సహా అన్ని అంతస్తులు పాతవే, అన్నీ ముందునుంచే వున్నాయని తేలుతోంది. అంటే షాజహాన్ అప్పటికే వున్న అ భవనాన్ని తీసుకుని, మరమ్మత్తులు దాదాపు 22 సంవత్సరాలుగా చేయించాడని, అందులో చాలా మార్పులు చేసి, ఒక మహమ్మదీయ కట్టడంగా చూపించడానికి ప్రయత్నించాడనీ అర్థం చేసుకోవచ్చు. ఇదే మాటని ఫర్మానాలు కూడా బలపరుస్తున్నాయి.
ఫర్మానాలు(రాజాజ్ఞలు):

మన పరిశొధనలో మనకు మరింత సమాచారం అందించేవి ఈ ఫర్మానాలు. షాజహాన్ వద్దనుండీ జయపూర్ రాజా జయసింగ్‌కి పంపిన ఈ మూడు ఫర్మానాలు పరిశోధకులకు లభించాయి, అని పి. యస్. భట్ మరియు ఏ. ఎల్. అటావలే లు తమ పరిశోధనా పత్రాలలో పేరొన్నారు. ఈ మూడు ఫర్మానాలూ పాలరాతి కొనుగోలుకు చెందినవే. వీటిని చూపే కొందరు, తాజ్‌మహల్‌ని షాజహానే కట్టించాడని ఇప్పటిదాకా వాదిస్తూ వస్తున్నారు. అందుచేత వాటిలో ఏముందో కూడా మరొక సారి పరిశీలిద్దాం.

1) జనవరి 21, 1632(9 రజబ్, 1041 హిజ్ర ) నాటి ఫర్మానా:

పాలరాతిని తీసుకురావడానికి చాలా బండ్లు కావాలి అని ఇంతకు ముందే మీకు ఫర్మానా పంపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అనేక బండ్లని సంసిద్ధం చేయవలసిందిగా తెలుపడం జరుగుతోది. ఆ బండ్లని "మక్రానా గనులకి" పంపి పాలరాతిని వెంటనే పంపవలెను. దీనికి అయిన ఖర్చుని మా ముసద్దీ వారికి జమా ఖర్చుల లెక్కలు చూపించి వారి వద్ద నుంచీ పొందగలరు.

2) సెప్టెంబర్ 9, 1632 (4 రబి-ఉల్-అవ్వాల్, 1043 అల్ హిజ్ర) నాటి ఫర్మానా:

పాలరాయి తీసుకురమ్మని "అంబెర్"కి "ముల్క్ షా"ని నియమించాము. అతడికి వెంటనే బండ్లు సమకూర్చమని మీకు ఆదేశం. "ముల్క్ షా" ఎంత పాలరాయి కావాలంటే అడిగిన మేరకు అతడికి దక్కేలా చూడమని కూడా మా అదేశము. అయిన ఖర్చు మొత్తం మీరు మా ఖజానా నుండీ పొందగలరు. మాకు కావలసిన పాలరాతిని, శిల్పులను, వెంటనే రాజధానికి పంపవలెను.

3) జూన్ 21, 1637 (7 సఫ్ఫెర్, 1047 అల్ హిజ్ర) నాటి ఫర్మానా:

ఆంబెర్, రాజ్‌నగర్లకు చెందిన పలువురు రాతిని చెక్కేవారు మీ ఆధీనంలో పనిచేస్తున్నారని తెలిసింది. దీనివల్ల మాకు రాతిపనివారి కొరత ఏర్పడి ఇబ్బంది కలుగుతోంది. అందుచేత మీ ఆధీనంలోవున్న పని వారినందరినీ మాకు స్వాధీన పరచాలని ఆదేశిస్తున్నాము. 

ఈ ఫర్మానాలు చూసిన తరువాత, జరిగిన కథ మరొక్కసారి నెమరువేసుకుని చూద్దాము. బర్హంపూరులోని ముంతాజ్ సమాధి చూస్తే అది పూర్తిచేసిన సమాధి. తాత్కాలిక సమాధిలావుండదు. కానీ ఆగ్రాలోని తాత్కాలిక సమాధిని తాత్కాలికమనే భావించారు కనుక, దానికి ఒక సమాధిలాగా కట్టడమేమీ వుండదు! కానీ బర్హంపూరులోని సమాధి అలా కాదు. దానికి అన్ని నగిషీలు చేసి పూర్తి చేసారు. అంటే ఆ బర్హంపూరులోని సమాధి కట్టేటప్పుడు కూడా 'షాజహాన్ మనస్సులో తాజమహల్ కట్టిద్దామన్న ఆలోచనే లేదు' అని అనుకోవచ్చును. అలాంటి ఆలోచనే అప్పటికి వుంటే బర్హంపూర్ లో సమాధి అలా పూర్తిచేసిన కట్టడమై వుండదు. వున్నా తాజమహల్ పూర్తి ఐతే కానీ బర్హంపూర్ నుంచీ ఆగ్రాకు ఆ పార్థివశరీరాన్ని తెద్దామన్న ఆలోచన కూడా రాకూడదు. కానీ, ఆరునెలలు గడవగానే, జనవరి 1632లో, ముంతాజ్ పార్థివశరీరాన్ని ఆగ్రాకి తెచ్చాడు. అంటే అక్కడ తాజమహల్ అప్పటికే వుంది అని అనుకోవచ్చు. 

అంతే కాదు, ఆగ్రాకి దేహాన్ని తెచ్చిన రెండు వారాల తరువాత, మొదటి ఫర్మానా వ్రాయబడింది. అంటే దాదాపు ఆ పార్థివశరీరం ఆగ్రాకి వచ్చిన సమయంలోనే తాజమహల్ సంకల్పం షాజహాన్ మనస్సులో మొదలయ్యింది. తాజమహల్ క్రింది మూడు అంతస్తులు ఇటుకలు, ఎర్ర రాతితో కట్టబడ్డాయి. అలాగే ఆ పైన వున్న అంతస్తులు కూడా ఇటుకలు ,ఎర్రరాతితోనే కట్టడం జరిగింది, కాకపోతే వాటిపైన పాలరాతితో తాపడం చేసారు. పైన కనపడే గోపురంతో సహా మనకు కనపడే పాలరాతి కట్టడం మొత్తం పైపైన పాలరాతి తాపడమే కానీ, లోపల వున్నదంతా ఇటుకలు, ఎర్రరాళ్ళే. అంటే కట్టడంలోని ఏడు అంతస్తులు కట్టిన తరువాత కదా ఆ పాలరాతి అవసరం!? దానికి ముందు పాలరాయి కోసం షాజహాన్ అంత కంగారుపడ అవసరం లేనే లేదు!!! అసలు ప్లాను వెయ్యడానికి, మహాశిల్పులను సేకరించడానికే ఎంతో సమయం పడుతుందే.. మరి ఇంత భారీ సౌధం పునాదినుంచీ లేపి కట్టి, అది పూర్తయ్యాక కదా ... ... ఈ పాలరాతి తాపడం. ఆ తరువాత కదా ఈ ఫర్మానాలు, హడావిడీను. అంటే ఆ రెండు వారాలలోనే (పోనీ, ఆరు నెలలలోనే) ఏడంతస్తుల తాజమహల్ ని నిర్మించేసి, వెంటనే పాలరాతి కొనుగోలుకై కంగారు పడసాగాడు అని అనుకోవాలా?

పాలరాతి తాపాడానికే 22 ఏళ్ళు పట్టినప్పుడు, కొద్ది వారాలలో, నెలలలోనే తాజమహల్ భవననిర్మాణం ఎలా వూర్తి చేయగలరు? అందుచేత ముంతాజ్ శరీరాన్ని ఆగ్రాకి తరలించడానికి ముందే తాజమహల్ భవనం అక్కడ వుందని తేలుతోంది. పురాతన భవనం రెడీగానే దొరికింది కనుక, బర్హంపూరు సమాధిని త్రవ్వి శరీరాన్ని ఆగ్రాకు తేవడం జరిగింది అని తెలుస్తోంది. తెచ్చిన తరువాత ఇంకా మరమ్మత్తులు చేస్తే బాగుంటుంది అనిపించి, మరమ్మత్తుల పధకాన్ని ఆవిష్కరించినట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మరమ్మతులు, మార్పులు చేయడానికి మాత్రమే పాలరాతిని కొన్నారని మాత్రమే ఈ ఫర్మానాలనుంచీ గ్రహించవలసిన విషయం అని తేలిపోతోంది.

తాజ్‌మహల్ లో కనిపించే ఖురాన్ వ్రాతల ఫలకాలన్నీ (మొత్తం ఖురాన్లోని 14 అధ్యాయాల వరకు చెక్కించాడట - అంటే చాలా ఫలకాలే అవుతాయి) ఖచ్చితంగా షాజహాన్ వ్రాయించి అతికించినవే. ద్వారాల అంచులు, సమాధి గదిలోని గోడలకున్న పాలరాయి ఫలకాలు అన్నీ షాజహానువే. అలాగే లోపలి అనేక పూల డిజైన్లు చెక్కుళ్ళు మహమ్మదీయ సాంప్రదాయానివే. అవన్నీ షాజహాన్ చేయించినవే. వీటికి చాలా, చాలా పాలరాయి కావలసి వస్తుంది. వాటిని చెక్కడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎంతో ఖర్చు కూడా అవుతుంది. అదే షాజహాన్ చేసిన పని. కానీ మొత్తం తాజమహల్ నిర్మాణం చేసినట్టు అనిపించడం లేదు. 

అలాగే పీటర్ మండి వ్రాతల ప్రకారం 1632-33 నాటికే (షాజహాన్ తన తాజమహల్ పనిని దాదాపుగా మొదలు పెట్టిన సంవత్సరంలోనే ) తాజమహల్ ఒక యాత్రాస్థలిగా ప్రసిద్ధిపొందింది. ఆనాటికే "ముంతాజ్ సమాధి చుట్టూ బంగారు కడ్డీలతో చేయబడ్డ కంచెలు వున్నాయి. పర్యాటకులు ఆ సమాధిని చూసి వస్తున్నారు. కట్టడం మొత్తం అయిపోయింది. కేవలం అక్కడ జరిగే పని అంతా బంగారం, వెండి, పాలరాతితో జరిగే మెరుగులు మాత్రమే" నని పేర్కొన్నాడు. అంటే షాజహాన్ పని మొదలు పెట్టడానికి ముందే, తాజమహల్ అక్కడ పూర్తయిపోయి వుంది. అక్కడ "ఖురానుకి వ్రాతల ఫలకాలను తాపడం చెయ్యడం, బంగారు వెండి రేకుల తాపడం జరుగుతోంది. బంగారం వెండి ఉన్న మిగితా గదులలోకి యాత్రికులకు అనుమతి ఇవ్వడంలేదు" అని చెప్పాడు, కానీ నేడు ఎక్కడా వెండి బంగారాలు కనిపించడంలేదు, అంటే దాని అర్థం ... అక్కడ స్వతహాగా వున్న వెండిబంగారాల్ని కొల్లగొట్టుతూ కనిపిస్తే, దాన్ని చూసి పీటర్ మండీ అక్కడేదో పని జరుగుతోందని అనుకున్నాడేమో?! 

1632 నాటికి షాజహాన్ మరమ్మత్తుల పని మొదలు పెట్టివుండవచ్చు కానీ, ఆ భవన నిర్మాణం మాత్రం కాదు అని అలా నిర్ధారించవచ్చును. ఫర్మానాలను మాత్రమే చూస్తే షాజహాన్ పాలరాతి కట్టడం ఒకటి కట్టిస్తున్నాడని అనిపిస్తుంది. కానీ, దొరికిన మిగితా ఋజువులన్నీ కలిపి చూస్తే, ఆ షాజహాన్ కొనుగోలుచేసిన పాలరాయి, కేవలం మార్పులు చేర్పుల కొరకు మాత్రమేననీ, భవన నిర్మాణానికి కాదని తేటతెల్లమవుతుంది.
అలాగే క్రింద చూపబడ్డ "పర్షియన్ దస్త్రాల" ప్రకారం, పనిచేసిన వారిలో స్థపతులు, గోపుర నిర్మాతలు, శిల్పులు తక్కువ (పూలని చెక్కే శిల్పులు తప్ప). వున్నవారంతా తాపీమేస్త్రీలు, ఖురాను వ్రాత కళాకారులు (Calligraphers), పాలరాతి తాపడం చేసే కార్మికులు, ఎక్కువ అని తెలుస్తోంది. ఈ పట్టిక ప్రకారంగా చూసినా భవన నిర్మాణం జరగలేదనే తెలుస్తోంది. అంటే అందరూ దాదాపుగా చివరలో పైపైన డిజైను చేసే వారే ఎక్కువగా కనపడుతున్నారు. తాజమహల్ భవన సముదాయం చూస్తే అందులో ఎన్నో భవనాలు, ఎన్నో గోపురాలు, ఎన్నో చెక్కుళ్ళు, కనిపిస్తాయి. మేస్త్రీలు కనిపిస్తున్నారు. మరి కావలసిన స్థపతులు, గోపుర నిపుణులు, శిల్పులు ఏరి? వీరు కదా ఎక్కువగా కావలసిన వారు. తాజమహల్లో ఎక్కువ పని వీరిదే కదా? వీరెవరూ లేకుండా ముఖ్యభవనం ఎలా తయారయ్యింది? ఇద్దరు కలశ నిపుణులుంటే గోపురనిపుణుడు ఒక్కడేనా? ఇంత తక్కువమంది వుంటే వీరు గోపురాలను కట్టారనుకోవాలా లేక మరమ్మత్తులు చేసారనుకోవాలా?

తాజ్‌మహల్ - నెలసరి జీతాల వివరాలు (ఇతిహాస పత్రిక అధారంగా)
(పర్షియన్ వ్రాతలు - నేషనల్ లైబ్రరీ, కలకత్తా, ఈ.బీ హావెల్ ప్రకారం)

 
అంతే కాదు! షాజహానుకి పరమతసహనం లేదని ముందే తెలుసుకున్నాము. ఇందులో వాడిన స్థపతులు, ముఖ్యనిపుణులు కేవలం మహమ్మదీయులే, ప్రత్యేకంగా బయటనుంచీ తెప్పించబడినవారే. మిగితా పనివారంతా చిన్నచిన్న పనులు చేసేవారూ, కూలీలూను. ఈ చిన్నచిన్న పనులు చేసేవారిలో హిందువులున్నా, వారంతా పైవారు చెప్పింది చేసేవారే కానీ, నిర్ణయాలు తీసుకునేవారు కాదు. అంటే హిందూ చిహ్నాలు తాజమహల్లోకి ప్రవేశపెట్టగలిగిన అర్హత, హోదా వున్నవారెవరూ లేరు అని తెలుసుకోవచ్చు. కానీ తాజమహల్లో హిందూ చిహ్నాలు అనేకం కనిపిస్తున్నాయి అని ముందే తెలుసుకున్నాము. అంటే ఈ చిహ్నాలు ముందునుంచే వున్నాయి, లేక తాజమహల్ ముందు నుంచే వుంది అని కూడా అనుకోవచ్చు. 

అలాగే ఆస్థాన చరిత్రకారులు, రాజుని పొగడానికి వచ్చిన అవకాశాలను సాధారణంగా వదులుకోరు. ఉన్నదానిని లేనిదానిని కలిపి పొగడ్తలు గుప్పిస్తారు. మరి ఆ 1600 పేజీల బాదుషానామాలొ, ఇంత మహాకట్టడమైన తాజ్‌మహల్ నిర్మాణం గురించి ఒక్క పేరా మాత్రమే వుంది. ముంతాజ్ ఖననం గురించి రెండు పేజీలు వుంది. ముంతాజ్ ని అక్కడ సమాధి చేసిన తేదీ కూడా ప్రస్తావించలేదు. అంటే ఆ నాటికి అందరి ముందూ, అందరికీ తెలిసిన ఆ భవనాన్ని తామే నిర్మించామని బాహాటంగా ఆధికారికంగా చెప్పుకోలేకే అని అనిపిస్తుంది. అందుకే జానపద కథలుగా నృత్యరూపకాలుగా తన ప్రేమకథలను వ్రాయించుకుని మెల్లి మెల్లిగా ప్రచారం చేయించుకున్నాడని అనుకోవడంలో తప్పులేదు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా మరెన్నో కనిపిస్తాయి. అలాగే టావెర్నియెర్, అనే ఫ్రెంచ్ వర్తకుడు వ్రాసుకున్న యాత్రావిశేషాలలో ఇలా వ్రాసాడట "షాజహన్ కావాలని ముంతాజ్ సమాధిని విదేశీయులందరూ బసచేసే తాజ్-ఈ-మఖాన్ (తాజమహల్ అనుకోవచ్చు) అనే భవనంలో చేసాడు. ఆ రోజులలో కలప తక్కువగా వుండడం మూలంగా, ఆ భవననిర్మాణానికి చుట్టూ ఇటుకలతోనే scaffolding చేసారు. ఆ scaffoldingsకి అయిన ఖర్చు భవనం కట్టడానికి అయినదానికన్నా ఎక్కువే అయ్యిందని భోగట్టా". అంటే భవన నిర్మాణానికి పెద్దగా ఖర్చు జరగలేదని చెబుతున్నాడు. లేక భవనం ముందు నుంచే వుందని చెబుతున్నాడు. scaffoldings అన్నవి పైపైన చేసే పనులకే కదా వాడేది!!

అదిసరేలే, అసలు షాజహానుకి వేరే భవనం తీసుకుని మహమ్మదీయకట్టడంగా మార్చుకోవలసిన అవసరమేమొచ్చిందని కూడా ఎవరైనా ప్రశ్నించి చూడవచ్చు. ఏ దేశ చరిత్రలో చూచినా మహమ్మదీయత ప్రాభల్యం మొదలయ్యిన రోజుల్లో అక్కడి ఆలయాలను, చర్చిలను, ద్వంసం చేయ్యడమో లేక వాటిని మహమ్మదీయ కట్టడాలుగా మార్చడమో జరిగిన సందర్భాలు వేలకు మించి వున్నాయి. అవన్నీ ఇక్కడ చర్చించలేము కానీ ఆ సాంప్రదాయాన్ని గురించి చర్చించుకోవచ్చు.

షాజహానుకి (పాద్‌షా ఘాజి జిల్లుల్లా), ఇతడి తండ్రి యైన జహంగీర్‌కీ, మొగల్ సామ్రాజ్యన్ని స్థాపించిన బాబర్ చక్రవర్తికీ, అతడి ముత్తాత యైన అమీర్ టైమర్‌కీ, ఉన్న బిరుదులలో "ఘాజీ" అనేది ఒక ముఖ్యమైన పదము. "ఘాజీ" అంటే అరబిక్ లో "దోచుకోవడం" అని అర్థం. దోచుకోవడం అన్నది వారికి తప్పుగా అనిపించే పదం కాదు, ఎందుకంటే పరమతస్థులను దోచుకోవడం అన్నది, వీరందరూ వారివారి హక్కుగా, ఒక సత్సాంప్రదాయంగా భావించిన వారు. 14వ శతాబ్దంలో చరిత్రలో ఎవ్వరూ హింసించలేనంత హీనాతిహీనంగా భారతీయులని హింసించి, లక్షలాది ఇళ్ళలోకి జొరబడి, చంపించి, మానభంగాలు జరిపించి, స్త్రీలను బానిసలుగా మార్చి ఎత్తుకుపోయి, వారి సంపదనంతా దోచుకుని, అన్ని రకాల నేరాలనూ కొన్ని రోజుల్లోనే జరిపించి, దేశం మొత్తం పీల్చి పిప్పిచేసి, ఇక అక్కరలేదు అని వదిలేసి వెళ్ళిపోయిన ఘనత, కేవలం అమీర్ టైమర్ కే దక్కుతుంది. అమీర్ టైమర్ తన సైనికులకి జీతాలేమీ ఇవ్వకున్నా సైనికులందరూ ఎంతో నమ్మకంగా పనిచేసేవారట. ఎందుకంటే ప్రతి యుద్ధంలోనూ గెలిచిన తరువాత, ప్రతిసైనికుడూ శత్రురాజ్యంలోని ఏ ఇంటిలోకైనా వెళ్ళి తనకు కావలసిన డబ్బులనూ, వస్తువులనూ, స్త్రీలనూ, యదేఛ్ఛగా తెచ్చుకోవచ్చు; పరమతస్తులనైతే కావలసినంత మందిని బానిసలుగా చేసి పట్టుకుపోవచ్చు. ఈ ఫార్ములాతో రోజురోజుకీ పెరిగిపోతున్న అతిక్రూరమైన సైన్యంతో, యుద్ధాలే పనిగా పెట్టుకుని, అనేక దేశాలను కొల్లగొడుతూ, జల్సా చేస్తూ ఇతడు కాలాన్ని వెళ్ళబుచ్చాడని చరిత్ర చెబుతోంది. తన క్రూరత్వానికి పరాకాష్ఠగా, నిదర్శనంగా, తన మతంలోకి మారని వారికి, లేక మాట వినని వారికి (భారతీయులకి) లక్షల కొలది శిరఛ్ఛేదన చేసాడని కూడా చరిత్ర చెబుతోంది. 
 
బాబర్ కూడా తన జీవితకాలం మొత్తం, ఇలాగే యుద్ధాలు చేస్తూ, చివరికి తన అవసానదశలో భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగి, ఇక్కడ స్థిరపడ్డాడు. కానీ అప్పటికే లెక్కలేనన్ని యుద్ధాలు చేసి అలసి, దేశాన్ని ఆక్రమించుకున్న నాలుగు సంవత్సరాలకే చనిపోయాడు. ఇలా మొదలయ్యింది మొగల్ సామ్రాజ్యం. ఈ వంశంలో పుట్టినవాడే షాజహాన్ కూడా. ఇతడు బాబర్, టైమర్ల అంత క్రూరుడు కాడు కానీ, ఇతడు కూడా పరమత సహనం పెద్దగా లేని వాడే అని, అనేక హిందూ మందిరాలను నాశనంచేసాడనీ, కొల్లగొట్టాడనీ ఇప్పటికే తెలుసుకున్నాము. యుద్ధాలు అనేకంగా చేసి రాజ్యవిస్తరణ చేసినవాడు, స్త్రీలోలుడు. కానీ ఒక సౌందర్యపిపాసి. స్త్రీలయినా, వస్తువులైనా, కట్టడాలయినా ఏవైనా సరే అందాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతకైనా వెనుకాడని క్రియాశీలుడు.
ఈ ఒక్క గుణమే షాజహాన్ని చరిత్రలో ఒక చిరస్మరణీయుడుగా నిలిపింది. ఈ గుణంతోనే, షాజహాన్ ఎన్నో కట్టడాలను సొంతం చేసుకున్నాడు. వాటికి మార్పులు చేసి తనదైన రీతిలో అందాలను సృష్ఠించుకున్నాడు. ఖ్యాతిని సాధించుకున్నాడు. తాజమహల్ని ఇతడు కట్టించినా కట్టించకున్నా, ఆ భవనానికి నేడున్న నిండుదనానికీ, ఆ అంతర్జాతీయ ఖ్యాతికికీ అతడే కారణం. అతడు దానిమీద మరమ్మతులే చేయించినా, ఉన్నది దోచుకున్నా, మెరుగులే దిద్దినా సరే, చివరికి మిగిలినదేమీ తక్కువ రకానిది కాదు. అది ఒక మహాద్భుతభవనంగానే మనకు దర్శనమిస్తోంది. అందుచేత ఆ ఖ్యాతిలో షాజహానుకి చెందాల్సిన వాటా నిస్సంశయంగా షాజహానుదే. కాకపోతే మొత్తం అతడిదే కాకూడదన్నదే ఈ వాదన.

ఇలా చారిత్రాత్మక ఆధారాలను పరిశీలించి, అందులోని హిందూ చిహ్నాలను గమనించి, ఆలోచిస్తే తాజమహల్ భవనం షాజహానుకి ముందు నుంచే వుండివుండాలనీ, షాజహాన్ దానిని సమాధిగా మార్చి, మార్పులుచేర్పులతో, మెరుగులు, మరమ్మత్తులు చేయించాడనీ అనుకోవడానికి ఆస్కారం కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా ఇంకా నిర్థారించలేము. ఆ కట్టడం పైన కార్బన్ డేటింగు వంటి పరీక్షలు చేసి ఆ కట్టడం షాజహాన్ కన్నా పురాతనమైనదని నిర్థారించగలిగితే కానీ ఈ వాదనలో తగిన బలం దొరకదు. అంతే కాదు మహమ్మదీయ చిహ్నాలుగా కనిప్పించే ఆ గోపురాలు మినార్ల సంగతి కూడా తేలాలి, వాస్తుపరంగా కూడా అధ్యయనం చేయాలి. అవి వచ్చే అధ్యాయంలో పరిశీలిద్దాం. 

(సశేషం)
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan12/sujananeeyam.html

4, అక్టోబర్ 2012, గురువారం

తాజమహల్ షాజహాన్ కట్టించిందేనా? చారిత్రాత్మక ఆధారాలు - 1వ భాగం

రచన :- రావు తల్లాప్రగడ





అంతులేనివాడిని అక్ష్యమగువాడిని, అన్నీ తెలిసినవాడిని, అందరికీ మంచి చేసేవాడిని, బోర్లించిన పద్మాకారమున వుండే హృదయసముద్రంలో నిలిపి పూజిస్తాను.

నారాయణ సూక్తంలోని ఇలా తలక్రిందులుగా ఉన్న పద్మం గురించి, దాని ప్రాశస్త్యం తెలుపుతుంది. మరి మహమ్మదీయులు కట్టించిన ఆ తాజమహల్ పైన ఆ పద్మం ఎందుకుంది?

అంతే కాదు కాక మహమ్మదీయుల గోపురాల పైన పద్మాలే కాదు, కలశం వుంచే సాంప్రదాయం కూడా వుండదు. వారి గోపురాలు సాధారణంగా నున్నగా బోడిగుండ్లవలే వుంటాయి. కానీ తాజమహల్ గోపురం పైన ఒక (తలక్రిందులుగా ఉన్న) పద్మం; దాని పైన ఒక త్రిశూలం; ఆ త్రిశూలం లోని మద్య శూలంగా ఒక కలశం; ఆ కలశంపై కొబ్బరికాయ, మామిడాకులు వుండడం; ఆ (శివుని) త్రిశూలమే అర్థచంద్రాకారంలో ఉండటం.... ఇందులో ఏదైనా ... ఏ ఒక్కటైనా... ... ఏ రకంగా ఆలోచించినా .... ... మహమ్మదీయ సాంప్రదాయానికి సంబంధించినవా? మరి ఐతే, ఇవన్నీ ఆ తాజమహల్ నెత్తిన ఎందుకున్నట్లు.. ? ఇంకా ఈ విషయం ఆలోచనను రేకెత్తించకుంటే ... మనం అసలు ఆలోచించడం లేదన్న మాట!

సరే ఇక అనుమానం మొదలయ్యింది కనుక, అధ్యయనం మొదలు పెడదాం. సాక్షాధారాలను పరిశీలించి నిర్ణయిద్దాం! ఇది హైందవభవనమో లేక ఆలయమో అనిపిస్తే సగర్వంగా చెప్పుకుందాము. మనకు కావలసిన్నని కలహాలు ఇప్పటికే వున్నాయి కనుక; ఇంకో కొత్తది సృష్ఠిద్దామని కాదు; ఇకపైన తాజమహల్ని ఒక హిందూ మందిరంగా మార్చేసుకుందామనీ కాదు; మన సంస్కృతిని సరిగ్గా గుర్తించి అందరికీ చాటి చెప్పుకోవడమే ఇందులోని పరమార్థం. నిజానిజాలను గుర్తించి చరిత్రను సరిగ్గా వ్రాసుకోవాలన్న ఆలోచనే, ఈ అన్వేషణలోని స్ఫూర్తి. కేవలం వక్రదృష్టి తోనో లేక విరోధభావంతోనో చూసే వారి కి ఈ వ్యాసాన్ని ఇక పై చదవద్దని విజ్ఞప్తి. 

తాజమహల్ అన్న మాట వింటేనే చాలు, మన మనస్సులలో ఏదో తెలియని ఆనందము, ఒక ప్రేమ కథ, ఒక మధురచిహ్నము అనేటువంటి స్పందనలు కలుగుతాయి. ఎన్నో శతాబ్దాలుగా ఇది మన మస్సులో నాటుకు పోయిన తీపి భావన ఇది. ఈ భావన చాలు, దాని వెనుక వున్న నిజాలన్నీ మర్చిపోవడానికి! అందుకే ఎందరో ఎన్నో మాటలు అంటున్నా, కొత్తకొత్త వాదనలు వినిపిస్తు,న్నా ఇంకా మనం వాటిని పట్టించుకోకుండా ఈ మధుర భావననే నమ్ముకుంటూ సాగిపోతున్నాము. కానీ మన ఆనందం కోసం, లేక నిజంగానే మనం సెక్యులర్ అని నిరూపించుకోవడాని కోసం, చరిత్రను మార్చుకుంటే .... అది మాత్రం నిశ్శంశయంగా తప్పే అవుతుంది. మనకు నచ్చినా నచ్చకున్నా సరే, "చరిత్ర" అన్నది నిక్కచ్చగా జరిగింది చెప్పాలి గానీ, మనకు నచ్చేది మాత్రం చెబితే అది చరిత్ర కాదు. అలనాటి మహారాజులు, షెహన్‌షాలు, అలాగే నేటి పశ్చిమ దేశాలు ... ఎవరికి బలముంటే వారుగా ... వారివారి కాలాలలో ... అందరూ చరిత్రలను వారికి నచ్చేటట్లు వ్రాయించుకున్నారన్నది (అది మనకు నచ్చినా నచ్చకున్నా) ముమ్మాటికీ నిజమేనని, అందరూ ఏకీభవిస్తారు. కాని అంత మాత్రం చేత, పరిశోధకులు ఏ చరిత్రనీ వదలరు. అసలు విషయం ఎప్పటికైనా బయటికి రాకా మానదు! తాజమహల్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఆసక్తి వున్నవారికి, ఆ శక్తి వున్నవారికి, వెతుక్కుంటే వెతుక్కున్నంతగా కావలసినన్ని ఋజువులు దొరుకుతున్నాయి. "ఈ పరిశోధన అవసరమా?" అన్న వారికి అసలు బాధే లేదు. వారు నిశ్చింతగా వారి స్వప్న ప్రపంచంలో విహరించ వచ్చు. ఒకరికి జ్ఞాన తృష్ణే లేనప్పుడు మనం ఏమి చెయ్యగలము. అలాగే మొండివాడు మహాబలుడు. వాడినీ ఒప్పించలేము. కానీ తెలుసుకుందామన్న జిజ్ఞాస వున్న వారిని మాత్రం ముందుకు తీసుకెళ్ళగలము.

మొదట్లో తాజమహల్ లో ఒక శివాలయము వుండేదనీ, దానిపేరు తేజోమహాలయమనీ, అందులో అగ్రేశ్వరుడనబడే శివలింగముండేదని, మొగల్ చక్రవర్తులే దాన్ని అపవిత్రం చేసి, సమాధిగా మార్చేసి, అంతటితో వదలక, ఆ కట్టడాన్ని కట్టిన ఘనతను తమకు తామే ఆపాదించుకున్నారనీ .... ఇలా హిందూ సంస్థల వద్ద నుంచీ మనం వింటూనే వున్నాము. ఇందులో నిజానిజాలు ఎంత వరకున్నాయో పరిశీలిద్దాం.

"తాజమహల్ అంటే ఒక సమాధి" అన్న భావన కొన్ని వందల సంవత్సరాలగా మనలో జీర్ణించుకుపోయిన నమ్మకం. ఒక త్రిశూలమో, కలశమో చూపించేసి ఆ నమ్మకాన్ని తుడిచేయలేము. అందుకే చాలా విస్త్రుతమైన విశ్లేషణ జరపాల్సిన అవసరం వుంది. అందుకే ఈ
విశ్లేషణ మొత్తం నాలుగు భాగాలలో చేద్దాము.

1) తాజమహల్‌లో హిందూ చిహ్నాలేమైనా వున్నాయా. ఒక వేళ వున్నా, అవి అలా వుండటానికి వేరే కారణాలేమైనా వున్నాయా?

2) అది హిందూ మందిరమే అనడానికి చారిత్రాత్మక ఆధారాలేమైనా వున్నాయా?

3) వైజ్ఞానికంగా పరీక్షలేమైనా జరిపి, సైన్సుపరంగా విశ్లేషణలు జరిపి, అది హిందూ కట్టడమే అని నిర్ధారణ చేయగలమా? 

4) పైన చెప్పినవన్నీ వున్నా, ఆ గోపురము మినార్లు, ఆర్చీలు చూస్తే అవి మహమ్మదీయ కట్టడంలాగానే కనిపిస్తున్నాయి. అది హిందూ నిర్మాణమే అని ఎలా చెప్పగలరు? 

ఈ నాలుగు భాగాలనూ విడివిడిగా చర్చిద్దాం. ఈ నాల్గు రకాల విశ్లేషణలు జరిగితే కానీ ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేము. అందుకే కొన్ని ఋజువులుగా ముందుముందుగా కనిపించినా, మన తుది నిర్ణయం మాత్రం ఈ నాలుగు భాగాల విశ్లేషణ తరువాతే చేద్దాం.

తాజమహల్ -- హిందూ చిహ్నాలు :

"తాజ్ మహల్" అన్న మాటకు ఉర్దూ అరబిక్లలో అర్థం - భవనకిరీటమట. దీన్ని 1631లో షాజహాన్ చక్రవర్తి తన మూడవ భార్య ముంతాజ్ మహల్ మరణానంతరం ఆమె పైన ప్రేమతో, ఆమెకు సమాధిగా కట్టించాడని అంటారు. దీన్ని కట్టడానికి 22 సంవత్సరాలు పట్టిందట. చివరికి 1653 లో పూర్తయ్యిన ఈ కట్టడానికి రూ 40 లక్షలు ఖర్చయ్యిందట. దీన్ని కట్టడానికి 20వేల మంది కూలీలను వాడాడనీ, మళ్ళీ ఇలాంటిది మరొకటి లేకుండా చెయ్యడానికి వారందరినీ షాజహాన్ చంపించేసాడనీ ఒక కథ ప్రచారంలోనూ వుంది. 

తాజ్ మహల్ ఒక అసమాన అష్టభుజాకారం లోని (unequal octagon) అరుగుపైన నిలుచుని మనకు దర్శనమిస్తోంది. శివునికి చుట్టూ అష్టభుజి అంటే దానికొక వైదీక అర్థం వుంటుంది. అది అష్ఠదిక్కులను, అష్ఠదిక్పాలకులను సూచిస్తుంది. ఉమ కూడా అష్టభుజే! కట్టడం మొత్తం ఆష్టభుజి మండలాకారమైన అరుగు మీదనే కాదు, లోలోపలి సమాధి గదిలో కూడా అష్థభుజి అకారంలో అలంకరించిన ఒక కంచెను (railed structure) నిర్మించి అందులో శవపేటికలను అమర్చారు. అంటే ... ఆ ఆష్టభుజి మండలాకారానికీ, తాజ్‌మహల్‌కీ ఏదో ఒక సంబంధము, విశిష్ఠత వుండివుండాని అని అనుకోవడంలో పొరపాటు ఏమీ లేదు. అంటే మన అనుమానం నిజమైతే, అది ఇదివరలో ఒక శివాలయము అని అనుకుంటే... ఆ శవపేటికలున్న స్థానంలోనే ఇదివరలో శివుడిని ప్రతిష్టించి వుండి వుండాలి.

సమాధి చుట్టూ అష్టదిక్పాలకులను సూచించే అష్ఠభుజి. ఇక్కడ మొదట్లో ఉన్న శివలింగాన్ని తీసేసి సమాధి నిర్మించారని అనుమానం.

ముఖ్య గోపురంపైన త్రిశూలకలశాలు:
 
ఈ త్రిశూలకలశాలకి చెందిన చరిత్రను కొంచెం పరిశీలీలిద్దాం. నిజానికి ఇక్కడ కనపడే ఈ రాగి కలశం అసలుది (original) కాదని అనడానికి అనుమానాలు లేకపోలేదు. ముహమ్మద్ సలహ్ కుంబో వ్రాసిన షాజహన్ నామా ప్రకారం మొదట్లో అక్కడ బంగారు కలశం వుండేది. కానీ 1873-74 కాలం నుంచీ ఇది రాగిదిగా మారిపోయి కనిపించడం మొదలు పెట్టింది. "జోసెఫ్ టైలర్" అని ఒక ఇంగ్లీషు వ్యక్తి పేరు కూడా ఆ రాగికడ్డీ మీద కనిపిస్తోందిపుడు. కాప్టెన్ టైలర్ ఒక బ్రిటీషు అధికారి. ఆయన 1810లో తాజ్ మహల్ కి మరమ్మత్తులు చేయించాడట. అంటే ఆయన ఆ కాలములో ఈ కలశాన్ని ఎందుకో మార్చివేసాడన్నమాట. అలాంటప్పుడు ఈ నకిలీ (లేక మార్చబడ్డ) కలశాన్ని పట్టుకుని మన వాదనని ఎలా కొనసాగిస్తాం? అసలు ఇలా కొనసాగించడం కూడా సమంజసమేనా?

సమంజసమే అంటున్నారు వాస్తుశాస్త్రనిపుణులు. ఎందుకంటే , తాజమహల్ కట్టడసముదాయంలోనే భాగమైన "జమైత్ ఖానా" అనబడే చోట, ఇదే త్రిశూలకలశ చిహ్నం నేల పైన కూడా తాపడం చెయ్యబడి కనిపిస్తోంది. పక్కనున్న రాళ్లతో కలిసిపోయిన ఈ నేల పైన వేయబడిన చిహ్నం, అదే రాళ్లకు, ఒకే కాలానికి చెందినదని తెలుపుతోంది. ఈ నేల పైన చిహ్నమూ, గోపురం పైన ఉన్న త్రిశూలకలశాలూ దాదాపు ఒకే పరిమాణంలో కూడా వున్నాయి. అంటే గోపురం పైన ఉన్నదానికి ఇది ఒక నకలు డిజైనని తెలుపుతోంది; అంతేకాదు, ఆ త్రిశూలకలశ చిహ్నం కూడా కేవలం అలంకారప్రాయం మాత్రమే కాదు అని గుర్తు చేస్తూ, దానికున్న మతపరమైన విలువను, ప్రాముఖ్యతనూ చాటి చెబుతూ; ఒక సాక్షంగా మనకు దర్శనమిస్తోంది. గోపురం పైన ఉన్న త్రిశూలకలశాలు సామాన్య కాకతాళీయ రూపకల్పనలు కావు అనే వాదనను బలపరుస్తోంది. ఇలా ఈ నేల పైన వున్న ఈ బొమ్మ, నల్లపాలరాతి పైన కూర్చబడి 30' 6" పొడవున కనిపిస్తుంది. కాకపోతే ముఖ్యగోపురం పైన ఉన్న త్రిశూలకలశ చిహ్నం 32' 5 ½" ఎత్తుగా వుంటుంది. మరి ఈ రెండు అడుగుల ఎత్తు తేడా ఎందుకు వచ్చింది? కాప్టెన్ టైలర్ చేయించిన మరమ్మతులలో, బంగారు త్రిశూలకలశాలని తీసి రాగిదానితో మార్చినప్పుడు ఈ ఎత్తులో పొరపాటు జరిగి వుండవచ్చు. కానీ నేలపైన కనిపించే చిహ్నంతో పోల్చి చూస్తే, సరిగ్గా అదే ఆకృతి, ఆకారంతో వుంది కనుక, బ్రిటీషువారు (బంగారాన్ని సేకరించినా, తస్కరించినా) కనీసం ఆకారం మార్చకుండా రాగిదానితో, తగిన జాగ్రత్తతో అదే ఆకృతిలో వున్న దానితోనే, మార్పిడి చేసారని, మనం నిర్ధారించవచ్చు. అది చాలు ఇది హైందవుల చిహ్నమే అని చెప్పడానికి! 

ఇక ఈ కలశాన్ని పరిశిలిస్తే, దాన్ని కలుపుకుంటూ ఒక త్రిశూలము, అర్థచంద్రుడు కనిపిస్తారు. ఈ కలశం హిందూసాంప్రదాయ కలశాన్ని(కొబ్బరికాయ, మామిడాకులతో కూడిన కలశం) పోలి వుంటుంది. అన్నీ, శివాలయ సంకేతాలే. ఇందులోని చంద్రుడిని ఇస్లాం చిహ్నమైన చంద్రుడుగా కొందరు భావిస్తారు. కానీ ఇస్లాం చంద్రుడిని సామన్యంగా నిలువుగా చూపెడతారు. ఉదాహరణకి క్రింద చూపిన మసీదుల పైనున్న చంద్రుని చిహ్నాలను చూస్తే. అవి ఏ రకంగానూ త్రిశూలాకారం లో కనిపించవు. అవి ఇస్లాం చంద్రుడిని చూపేవిధానాలు. అందుచేత తాజమహల్ పైనున్న చంద్రుడు హిందూచిహ్నంగానే మనం అనుకోవచ్చు.

                    
Crescent designs on Mosques
 
అంతే కాదు మహమ్మదీయులకి చంద్రుడిని త్రిశూలాకారంలో చూపే పద్దతిగానీ, అవసరం కానీ కూడా లేవని మనకు తెలుసు. అందుచేత ఈ త్రిశూలము, చంద్రుడు, కలశము, పద్మము .. ... ఒక శివాలయన్నీ సూచిస్తున్నాయేమో అని మనం పడే అనుమానంలో కొంత బలం కనపడుతోంది. ఇక మిగితా సంకేతాలను గమనిద్దాము.

హైందవ చిహ్నాలు అనేకం:
 
ద్వారం పైన గూడు: దక్షిణద్వారం పైన (తాజ్ గంజ్ లో) ఒక గూడు కనిపిస్తుంది. హిందూ మందిరాలలో, కోటలలో ఒక వినాయకుడి విగ్రహం అక్కడ వుంచడం పరిపాటి. ఆ విగ్రహాన్ని మొగలాయులు తీసేసి వుండవచ్చు.

రాజపుత్రుల ఆహ్వాన చిహ్నం: ముఖ్యద్వారపు గోడల పైన, వంటశాలపైన "గులాబ్-దాని" (rose-water cans) , "ఇలైచి-దాని" (cardamon pots) వంటి సంప్రదాయ రాజపుత్రుల ఆహ్వాన చిహ్నాలు కనిపిస్తాయి. దీగ్ (భారత్‌ పూర్), జైపూర్ల లోని రాజపుత్రుల భవనాలలో ఇటువంటి చిహ్నాలే కనిపిస్తాయి.

గణేష తోరణాలు: ముఖద్వారపు అంచు మొత్తం నడుము ఎత్తులో "గణేషతోరణలు" కనపడతాయి. అది హిందూదేవుడు అనుకోకపోయినా, జంతు చిహ్నాల అలంకారాలు కూడా ఇస్లాం లో ఏలాగూ నిషిద్ధమే.

మరికొన్ని వివరాలు:.
పుష్పశిల్పంలో జాగ్రత్తగా "ఓం" అన్న గుర్తును ఇమడ్చడం 
పద్మాకారంలోని త్రిశూలం
దక్షిణద్వారం పైన హైందవ కలశాలు. శివుడికి ఏకాదశ కుంభాలు (పదకొండు) సాంప్రదాయసిద్ధమే. అంతే కాక క్రిందనున్న నాగులతలలు కూడా శైవ సాంప్రదాయమే. ఇక వాటి క్రింద కనిపించే ఖురాన్ వ్రాతలు తరువాత చేర్చబడ్డవిగా తెలుస్తున్నాయి.

గోడలపై రాజపుత్రుల సాంప్రదాయిక డిజైన్లు
                    
అనేకచోట్ల ఇలా ధోత్ర పుష్ప చిత్రాలు 
ఆనేకచోట్ల ఆకులను శంఖువులుగా చిత్రీకరించడం
నాగబంధాలు
ముఖద్వారంపైన ఉన్న వినాయకుడిని తలపించే ఏనుగుతలలు
    
                         
లోపలి అష్ఠభుజి పైన చిత్రించిన కుంభాలు, పుష్పాలు అల్లికలు. శివాభిషేకానికి కావలసినవి.
హిందూ రాజపుత్ర శైలిలోని వరండాలు
లోపల 1000 అడుగుల మార్గం. మార్గానికి ఇరుప్రక్కలా అనేక నివాసయోగ్యమైన గదులు. ఇది సమాధి కాదని ఇక్కడ ఎందరో ప్రజలు నివసించేవారని తెలుపుతున్నాయి.
మూసివేయబడ్డ గదుల కప్పులపై వైదీక యంత్రాలు
గోపురం లోపల చెక్కిన బొమ్మలు. సూర్యుడు చుట్టూ ఆవరించిన త్రిశూలాలు. ఖచ్చితంగా వైదీక చిహ్నాలే మరి

ఇలా అనేక రకాల హైందవ చిహ్నాలు, జ్ఞాపకాలు తాజమహల్ లో మిగిలి కనిపిస్తాయి. హిందూ చిహ్నాలన్నీ అన్నీ తీసివేసిన షాజహాన్ ఈ చిహ్నాలను ఎందుకు వదిలేసాడు? అంటే అవి అతడికి స్పష్టముగా కనిపించకపోవడమే కారణం! అవి వేరే సాధారణ డిజైన్లని భ్రమపడే అవకాశం వుండటమే! అందువల్ల ఇవి పొరపాటున మిగిలిపోయి, మిగితా ఖురాను వ్రాతల చుట్టూ అలంకారాలుగా మిగిలిపోయివుండి వుండవచ్చు. కానీ ఇవి హైందవ చిహ్నాలని, ఏ హిందువుకైనా సరే, చూడగానే తెలిసిపోతాయి. 

" ఇదేదీ కాదు! షాజహానుకి పరమత సహనం ఎక్కువ! అందుకే హిందూ శిల్పులని తమకిష్టమొచ్చిన చిహ్నాలను చెక్కుకోమని వదిలేసా డు" అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. కానీ అతడి బాదుషానామాలోనే ఇలా వ్రాసివుందిట ...
" ఇస్లాం మతం పై నమ్మిక లేనివారికి నిలయమైన బెనారస్ లో అనేక విగ్రహారాధకులు మందిరాలను నిర్మిస్తున్నారు, అని షెహన్షావారికి తెలపడమైనది. ఆ నిర్మాణ కార్యక్రమాన్ని వారు నిలిపివేయించడం మూలంగా, ఈ విగ్రహారాధకులు తమ మందిర నిర్మాణాలకు అనుమతి ఇమ్మని కోరుతున్నారు. ఐనా చక్రవర్తులు, ఇస్లాం మతపరిరక్షకులు! వెంటనే అన్ని ప్రాంతాలలోనూ, అన్ని మందిరాలను తొలగించాలని ఆదేశాలని జారీ చేసారు. అలహాబాద్ రాష్రం నుంచీ ఇప్పుడే అందిన వార్త - - బెనారస్ లో 76 మందిరాలను నాశనం చేయించాము." ...
ఇది పరమత సహనం ఎలా అవుతుంది? షాజహానుని ఒక విశాలహృదయుడు అని ఎలా మెచ్చుకోవడం? అంతే కాదు తాజమహల్ నిర్మాణంలో హిందూ శిల్పులని వాడలేదన్న విషయానికి కూడా ఋజువులు వున్నాయి. అవి కూడా తరువాత అధ్యాయాల్లో పరిశీలిద్దాం.

ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఒక యాత్రికుడికి కనిపించేవి మాత్రమే. తాజమహల్ ముఖ్యభవనంలో యాత్రికులకు చూపించనివి ఇంకా ఐదు అంతుస్తులున్నాయి. అసలు అన్ని అంతస్తులున్నట్టే మనకు తెలియదు. ఎందుకంటే అన్నిటినీ రహస్యంగా గుప్తపరిచారన్నమాట. అందులోకి వెళ్ళి చూస్తే ఇంకా ఏమేమి కనిపిస్తాయో కూడా తరువాతి భాగాలలో చూద్దాము. 

అంటే ఇప్పటి దాకా మనం చూసింది, కొన్ని పై పై చిహ్నాలే. నిజానికి ఎవరైనా వింటే, వీటన్నిటినీ కాకతాళీయాలనీ, చెప్పి పూర్తిగా కొట్టేయచ్చు. అందులో తప్పులేదు! నిజానికి ఇది హిందువుల మందిరము అనే వాదనకి కూడా పైన చెప్పిన ఆధారాలేవీ చాలవు.

అందుకే ఇంకా లోపలికి వెళ్ళి తాజమహల్ చరిత్రను తొవ్వి చూద్దాం. ఆ చరిత్రలో బయటపడ్డ నిజాలను, ఎలా, కొట్టేస్తారో కూడా చూద్దాం! ఎన్ని భయంకర సత్యాలు బయటకి వస్తాయో చూద్దాం! (సశేషం).

 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec11/sujananeeyam.html