3, మార్చి 2012, శనివారం

కురుక్షేత్ర యుద్ధం మొత్తం కల్పితమేనా 2/3

కురుక్షేత్ర యుద్ధం మొత్తం కల్పితమేనా
(రెండవ భాగం)
- రావు తల్లాప్రగడ  

 
 
సీ.|| ధర్మ శాస్త్రజ్ఞులు ధర్మ శాస్త్రంబని - యధ్యాత్మ విదులు వేదాంతమనియు
నీతి విచక్షుణుల్ నీతి శాస్త్రంబని - కవి వృషభులు మహా కావ్యమనియు
లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని - యైతిహాసకు లితిహాసమనియు
బరం పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ -యంబని మహి కొనియాడుచుండ
 
ఆ.|| వివిధ వేదతత్వ విదుడు వేదవ్యాసు - డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై - పరగుచుండజేసె భారతంబు
 
మహాభారతాన్ని నన్నయ్య ఈ విధంగా  ప్రశంసించాడు. అంటే ఏదృష్టిలో చూస్తే అలాగ కనిపిస్తుందని నన్నయ అభిప్రాయము. అంటే భారతంపై మనం చేసే చర్చ ఏనాటినుంచో సాగుతోందని తెలుస్తోంది. గతమాసం కురుక్షేత్రయుద్ధం కల్పితమా అన్న విషయంలో జనాభా లెక్కల  గురించి ఆలోచించి చూసాము. మహాభారతంలో చెప్పిన 18 అక్షౌహిణుల సైన్యాలు యుద్ధం చేసాయీ అంటే అది నమ్మశక్యమో కాదో పరిశీలించి చూసాము. ఇంకా ఇది ఒక కవి కల్పనా లేకా చరిత్రా అన్న విషయాన్ని ఇప్పుడు విశ్లేషించి చూద్దాం. మన శాస్త్రజ్ఞుల ప్రకారం మహాభారతం అంతా ఒక కవి ఊహారూపమే. ఎందుకంటే అది ఒక చరిత్రలాగా లేదు, అది అంతా కల్పనలా కవితలాగా వుంది. “18 పర్వాలు, 18 అక్షౌహిణులు, 18 రోజుల యుద్ధం వంటివి చూస్తే ఆ సంఖ్యలన్ని కాకతాళీయం ఎలా అవుతాయి, ఒక మహాకవి మనోజనిత కల్పనలు తప్ప?”, అని వారి అభిప్రాయం.
 
తర్కం సమంజసంగానే వుంది. కానీ భారతంలో జరిగింది వ్రాసారా లేక కల్పించి వ్రాసారా అన్నదే మన ముందున్న ప్రశ్న. దానికి అసలు ఆ కావ్యానికి ప్రమాణగ్రంధము ఏది ఎదో తెలియాలి? తరువాత  అందులో ఏమున్నది అన్నది తేలాలి.  వ్యాసుడు చెబితే గణేశుడు వ్రాసాడన్న ఈ క్రింది శ్లోకంతో మన విశ్లేషణ మొదలుపెడదాం. దీనితో అనేక ప్రశలు మనమనస్సుని తొలిచివేస్తాయి..

శ్లో|| లేఖకో  భారత స్యాస్య భవత్వం గణనాయక
మయైవ ప్రోచ్య మానస్య మనసా కల్పితస్య చ
 
(ఓ గణేశా నీవు ఈ భారతానికి లేఖకుడిగా వుండుము. నేను నా మనస్సు చేత ఊహించి నీకు చెబుతాను).
అంటే మనస్సులోవున్న జ్ఞానానికి అక్షరరూపకల్పన చేసిచెబుతాను అని ఆయన భావమా? (ఆల్బరూనీ తన గ్రంధంలో వ్యాసుడే దేవుల ప్రేరణతో అక్షరాల రూపాలను గ్రహించి నిర్మించాడని చెప్పాడు) లేకపోతే నిజంగా భారతం మొత్తం కల్పితమా? అసలు ఈ శ్లోకము వ్యాసుడు చెప్పినదేనా? పరిశీలిద్దాం!
 
భారతాన్ని సరిగ్గా తెలుసుకోవడానికి ఒక ప్రమాణము అవసరము. శ్రీమత్తిరుమల వేంకట శ్రీనివాసాచార్యుల వారి శ్రీమహాభారత వైజ్ఞానిక సమీక్షలో ప్రమాణము అన్న మాట గురించి ఇలా వివరించారు. ప్రమ అంటే యధార్థ జ్ఞానము. ప్రమను కల్గించునది ప్రమాణము. "ప్రమాణతోర్థ ప్రతిపత్తౌ ప్రవృత్తి సామర్థ్యార్దవత్ ప్రమాణమ్" అని గౌతమ సూత్రము. ప్రమాణాలు 3 రకాలు. (1) ప్రత్యక్షము (2) అనుమానము (3) శాస్త్రము. సైన్సు ప్రత్యక్ష ప్రమాణాలనే కోరుతుంది. అనుమానము వల్ల ప్రశ్నోత్పత్తి జరిగి మనస్సే ప్రమాణాన్ని సాధించుకోగలుగుతుంది. శాస్త్రం సర్వోత్కృష్ఠమైనది. శాన్ (శాసించునది)+త్ర(రక్షించునది) అన్నదే శాస్త్రము. "తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యా కార్యవ్య వస్థితౌ  (గీత) "
  
1)      భారతం ఎవరు వ్రాసారు:  భారతం వ్యాసుడు రచించాడు అని అందరూ అనుకుంటారు. భారతం కూడా అదే ధృవీకరించింది. కానీ ఎన్నో పురాణాలనూ, భారతాన్నీ, ఉపనిషత్తులనూ, వేదాలనూ, ఇతిహాసాలనూ ఎన్నో శతాబ్దాలలో వ్రాసిన వ్యాసుడు అన్నవాడు ఒక వ్యక్తి కాకపోవచ్చును. అది ఒక పరంపర కావచ్చును. ఉదాహరణకి మనం శృంగేరీ పీఠాన్ని కొన్ని శతాబ్దాలుగా అధిష్టించిన అన్నితరాల పీఠాధిపతులనీ శంకరాచార్యులే అని అంటాము. అంటే అది ఒక పరంపరే అని తెలుస్తున్నదికానీ, ఒకే వ్యక్తి కొన్ని శతాబ్దాలుగా బ్రతికివున్నాడని మాత్రం కాదు, అని మనందరికీ తెలుసు. వ్యాస పరంపర కూడా అలాంటిదే.  అన్ని పురాణాలు ఒకే కాలంలో వ్రాయబడలేదనీ, అవి వేరు వేరు వ్యాసులు వ్రాసివుంటారని, అనుకోవడంలో తప్పులేదు. వేదాలను విభజించిన వారెందరో వేదవ్యాసులు. విష్ణుపురాణం 28 మంది వేదవ్యాసులని గుర్తించింది. కృష్ణద్వైపాయనవ్యాసుడు 28వ వ్యాసుడు. భారత రచనలో మిగితా వ్యాసుల పాత్ర సరిగ్గా తెలియదు కనుక, భారతరచన కృష్ణద్వైపాయనవ్యాసుడే చేసాడని అందరి విశ్వాసం.

అంతేకాదు,  వ్యాసుడే కాకుండా అతడి శిష్యుడు వైశంపాయనుడు, ఆ తరువాత ఎన్నో ఏళ్ళకు మళ్ళీ సౌతి, వారి వారి శ్లోకాలను కూడా భారతంలో వేలకొలది జొప్పించారని కూడా అదే భారతం నుంచీ తెలుస్తున్నది. వీరే కాకుండా గుర్తుతెలియని వారెందరో మరెన్నో ఎన్నో శ్లోకాలను భారతానికి కలిపేసి అంతా వ్యాసరచనే అని ఆయన పైకి తోసేసారని అందరికీ తెలిసిన మాటే.  నేడు భారతం దాదాపు 1,20,000 శ్లోకాలతో మనకు దొరుకుతోంది. ఎవరు భారతానికి ఎంత కలిపారు?, ఎందుకు కలిపారు? అన్నవి చాలా ఆసక్తికరమైన విషయాలు. ఎందుకంటే అసలు భాగం కంటే తర్వాత చేర్చిన భాగాలే పెద్దవిగా కనిపిస్తాయి.
 
కృష్ణద్వైపాయనుడు: కృష్ణద్వైపాయనుడనే పారాశర్యవ్యాసుడు "జయ" అనే పేరుతో మహభారతాన్ని మొదట వ్రాసాడని భారతం నుంచే మనకు తెలుస్తోంది. ఇదే అసలైన చరిత్ర భాగమని, మిగితాది అంతా కల్పితమని, లేక తరువాత చేర్చబడినదని మనం అనుకోవచ్చు. ఈ కృష్ణద్వైపాయనుడి పేరు ఆది పర్వంలోనూ, తైత్తిరీయ అరణ్యకంలోనూ, సామవిధానబ్రాహ్మణముకు చెందిన "వంశ" కృష్ణయజుర్వేద కాఠక భాగములో కూడా కనిపిస్తుంది.  ఆదిశంకరుడు కలిద్వాపరసంధిలో ఈ వ్యాసుడుండేవాడని అన్నాడు. వేదవ్యాసుడు మూడు వేదములనే విభజించాడని ఒక వాదన వుంది (త్రయీవైవిద్య, ఋకోయ జూంషి, సామాని- శతపద బ్రాహ్మణ్యము). అధర్వణవేదం తరువాత పుట్టిందంటారు. ఆల్బరూనీ తన గ్రంధంలో వ్యాసుడే దేవుల ప్రేరణతో అక్షరాల రూపాలను గ్రహించి నిర్మించాడని చెప్పాడు. పాణిని సూత్రములో (IV-3-104) "కలాపి వైశంపాయనాస్తే వాసి భశ్వ" అని వుండటం వల్ల వ్యాసుడికి వైశంపాయనుడనే శిష్యుడు ఉండటం రూఢీ అవుతుంది. అలాగే "అష్టాదశపురాణాం కర్తా సత్యవతీ సుతః" అంటూ అన్ని పురాణాలూ వ్యాసుడే రచించాడు అని కూడా అంటారు.


 కానీ భారతాన్ని (“జయను) వ్యాసుడే వ్రాసాడు అని భారతంలో తప్ప మరెక్కడా చెప్పలేదు.  మరి, భారతంలో వ్యాసుడు వ్రాసినదెంత మటుకు? మిగితా వారు ఎంత కల్పన చేసి కలిపి వుండివుంటారు? అనే దానిపైన చాలా భిన్నాభిప్రాయాలు కనబడుతున్నాయి.

2)      భారతంలో సంకలనాలు: భారతం మొత్తం 4 సంకలనాలుగా అభివృద్ధిచెందినది అని మనం గ్రహించ వచ్చు. వ్యాసుడు 8,800 శ్లోకాల భారతాన్ని జయ అన్న పేరుతో వ్రాస్తే, ఇప్పుడు మనం దాన్ని 120,000 శ్లోకాల మహాభారతంగా పెంచుకున్నామని తెలుస్తున్నది.  అసలు మూలప్రతి నేడు మనకు దొరకకుండా వుంది.
 
a)      జయ  ఆది పర్వం ప్రకారం 8,800 శ్లోకాలతో "జయ" గా వ్యాసుడు వ్రాసాడు.
b)      భారతం: వైశంపాయనుడు దానిని 24 వేల శ్లోకాలతో "భారతంగా" చేసాడు (11 పర్వాలు).
c)       మహాభారతం: సౌతి దానిని లక్ష శ్లోకాల మహాభారతంగా చేసాడు (18 పర్వాలు). ఈ లక్ష శ్లోకాలు కూడా ఒకొక్క చోట ఒక్కొక్క విధంగా, వివిధ ప్రతులలో దొరికాయి. కొన్ని ప్రతులలోని అధ్యాయాలు వేరే ప్రతులలో లేవు, న్నా అవి వేరే శ్లోకాలతో వేరే విధంగా వున్నాయి. ఉదాహరణకి మన నన్నయభట్టు చదివిన సంస్కృత మహాభారత ప్రతిలో 1,00,700 శ్లోకాలు వున్నాయి. కొన్ని ప్రతులలో 84,770 వుంటే, మరొక చోట 1,07,390 శ్లోకాలతో దొరికింది. బొంబాయి భారతం 95,826 శ్లోకాలుగా అలాగే  99,057 శ్లోకాలుగానూ దొరికింది.
d)      వర్తమాన మహాభారతం: వర్తమాన మహాభారతంలో 1,20,000 శ్లోకాలు వున్నాయి .
e)      ఏది అసలుసిసలైన భారత ప్రతో తెలియక మనం ఒక ప్రక్క సతమత మవుతూ వుంటే, భారతంలోనే మరొక చోట (ఆది 1-104, 106, 268, 269) వ్యాసుడు చెప్పినవి మొత్తం 60 లక్షలనీ, అందులో దేవతలకు 30 లక్షలు, పితృదేవతలకు 15 లక్షలు, గంధర్వులకు 14 లక్షలు, మనుష్యలోకానికి లక్ష శ్లోకాలు ఇచ్చాడనీ వుంది. అలాగే వైశంపాయనుడు లక్ష పాడాడనీ, సౌతి కూడా లక్ష పాడాడనీ, “4 వేదములు ఒక వైపు-భారతమును ఒక వైపు పెట్టగా భారతము వైపు మొగ్గగా దీనిని మహాభారతము అని అన్నారనీ కూడా భారతంలోనే వ్రాయబడివుంది.
 
3)      జయేతిహాసము: 18 అను సంఖ్య "జయ"  అను భావానికి సూచకము అని పెద్దలు చెబుతారు. అలా జయ అనే శబ్దము 18 ఆత్మ వివర్తనములకు, 18 భారత పర్వములకు, 18 గీతాధ్యాయములకు, అష్టాదశ పురాణలకూ  సంకేతము అవుతుంది అని అనుకుంటారు. అందుకే వ్యాసుడు జయేతిహాసమని పేరు పెట్టాడని కూడా అంటారు.  కాని నిజానికి భారతంలోని ఆది పర్వంలోని అనుక్రమణికను చూస్తే, వ్యాసుడు 18 పర్వాలు వ్రాసినట్లు గానీ సంకల్పించినట్లుగా గానీ కనబడటం లేదు. వ్యాసుడు వ్రాసినవి 11 పర్వాలే తెలుస్తున్నది. అందులో కూడా చాలావరకు శ్లోకాలు అతడు వ్రాసినవి కావు, అని కూడా తెలుస్తున్నది. ఆదిపర్వం ప్రకారం  వ్యాసుని భారతం ("జయ")లో 8800 శ్లోకాలే వున్నాయని; వ్యాస శుకులకు తప్ప ఈ విషయమెవ్వరికీ తెలియదని, ఆదిపర్వంలో (1-81,82) ఈ క్రింది ప్రస్తావన వల్ల తెలుస్తోంది.
 
శ్లో|| అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతానిచ
అహంవేన్ది శుకోవేత్తి సంజయోవేత్తి వానవా (1-81)
మరి 1,20,000 శ్లోకాలెక్కడినుంచీ వచ్చి చేరాయి?
 
4)      భారతకావ్యాభివృద్ధి : మహాభారతం మొదటి శ్లోకము చివరి పాదములోనూ ("తతో జయ ముదీరయేత్") అలాగే స్వర్గారోహణ పర్వంలో (5-46) (జయోనామేతి హాసోయం శ్రోతవ్యోమోక్షమిచ్చతా) కూడా "జయ" అనే శబ్దాలు వుంటాయి. అందుచేత చివరి వరకు వ్యాసుని రచనే అని కొందరంటే;  “కాదు ఆ చివరిది తరువాత చేర్చబడ్డది అని అంటూ, “కానీ వ్యాస వైశంపాయనులు వ్రాసిన భారతం 24 వేల శ్లోకాలు  వుండివుండవచ్చును అని రాజగురు "హేమరాజ" అభిప్రాయ వ్యక్తం చేసారు.   కానీ చాలామంది, ఆది పర్వములో అనుక్రమణిక వల్ల ఆదిపర్వములో ఉపరిచరుని కథతో మొదలయ్యి స్త్రీ పర్వాంతముతో ఫలశ్రుతితో ముగిసిందని, జయలో 8800శ్లోకాలు మాత్ర మే వుండి వుంటాయని నమ్ముతారు. మిగితాది మొత్తం  ప్రక్షిప్తము (అంటే తరువాత చేర్చబడినవి) అని అనుకోవచ్చు. కృష్ణద్వైపాయనుడు యద్దము జరిగిన తరువాత దాదాపు మూడేళ్ళ కాలం పాటూ భారతాన్ని రచించి, తన కుమారుడైన శుకునితో పాటూ తన శిష్యులైన పైల, జైమిని, వైశంపాయన, సుమతులకు వేదములతో పాటూ భారతం నేర్పినట్లు తెలుస్తున్నది. భీష్మపర్వంలో చెప్పినదాని బట్టి, వ్యాసుడు యుద్ధానికి  18 ఏళ్ళ తర్వాత, అనేకమంది ఋషులు కోరగా, తన శిష్యుడైన వైశంపాయనుడికి  తన భారతాన్నినేర్పి, జనమేయుని (అభిమన్యుని మనుమడు) యజ్ఞంలో ఆ భారతకథ పాడి వినిపించమని కోరగా, అప్పుడు వైశంపాయుడు పాడుతూ ఆ మహాభారతాన్ని లోకానికి ప్రకటించాడని తెలుస్తోంది.  అలా  వైశంపాయనుడు పాడి, అక్కడివారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సరికి ఆ 8800 శ్లోకాలు కాస్తా 24వేల శ్లోకాలు అయిపోయివుంటాయని విజ్ఞుల అభిప్రాయము. వ్యాసుడి సమక్షంలోనే ఈ శ్లోకాలు చేర్చబడ్డాయి, కనుక 24వేల శ్లోకాలు అనుకోవడంలో తప్పు లేదు. ఈ సంస్కరణతొ 8800 శ్లోకాల "జయ" 24 వేల శ్లోకాల "భారతంగా" మారివుంటుంది.
 
5)      మహాభారతకావ్య సంపాదకుడు:
శ్లో|| చతుర్వింశతి సాహస్రిం చక్రే భారత సంహితాం
ఉపాఖ్యానైర్వినా తావద్భారతం ప్రోచ్యతే బుదైః (1-1-101)

ఆ తరువాత పలువురు చేరిన మరిన్ని శ్లోకాలతో భారతం మరింత పెరిగిపోయింది కానీ అసలు భారతం ఏదో తెలుసుకోవాలీ అంటే, ఉపాఖ్యానలను వదలగా మిగిలినదే భారతము అని కూడా మళ్ళీ భారతమే తెలుపుతోంది. అంటే మొదటి 11 పర్వాలలో ఉపాఖ్యానములు, భగవద్గీత వంటి వాటిని తీసి వేస్తే మిగిలిన 24వేల శ్లోకాలే భారతం అనుకుని చూస్తే, అది అనుక్రమణికకు సరిగ్గా సరిపోతోంది. కనుక,  తతిమా 7 పర్వాలు తర్వాత చేర్చబడ్డాయని స్వామి వివేకానంద,  బంకిం చంద్ర చటర్జీ, వైద్యా, తిలక్ వంటి మహామహులు నిర్థారించారు. భారతం పెరిగిపోవడానికి కారణం - భారతాన్ని కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు ) తన నలుగురు శిష్యులకూ ఉపదేశింపగా వారు పరస్పర విరుద్ధమైన దోరణిలో దాన్ని వ్యాప్తి చేసారట. కానీ జనపరంపరని అనుసరించి వైశంపాయనుడు అలా పెరిగి పోయిన భారతానికి ఒక ముఖ్య సంపాదకుడుగా నిలిచి, మహాభారతగ్రంధానికి ఒక రూపాన్ని ఇచ్చి, ప్రాచుర్యంలోకి తెచ్చాడని ఒక నమ్మకం.      
              
6)      వైశంపాయనుడు తరువాత, రోమహర్షుని కుమారుడు ఉగ్రస్రవససౌతి (సౌతి) తన తండ్రి దగ్గిర నేర్చిన మహాభారతాన్ని శౌనకాదిమునులకు ఒక లక్ష శ్లోకాలలో విడమర్చి చెప్పాడని భారతంలోనే మరొక కథ. ఆదిపర్వములో "నా చేత రచింపబడినవి లక్ష శ్లోకములని ఎఱుంగుడు" (1-107). అలా భారతం లక్ష శ్లోకాల "మహాభారతంగా" మారివుంటుంది.

 
7)      భారతంలో ప్రమాణంగా చెప్పిన 8800 శ్లోకాలే మహాభారతపు మొదటి రూపమని బుహ్లర్, మెక్‌డోనాల్డ్, స్మిత్ వంటి పరిశోధకులు నమ్మితే, క్రీ.శ. 1వ శతాబ్దికి చెందిన దాఖలాలను బట్టి 10వేల శ్లోకాలతో మొదటి ఆవృతం మొదలయ్యిందని చింతామణి వైద్యా నమ్మారు. కాని క్రీ.శ..6వ శతాబ్దానికే లక్ష శ్లోకాలు వున్న మరొక మహాభారతం ఉనికి ఒక శిలాఫలకంపై దొరికిందని బుహ్లర్ పేర్కొన్నారు.
 
8)      నేటి మహాభారతం 1,20,000శ్లోకాలతో మనకు దొరుకుతున్నది. అంటే జయ, భారత, మహాభారతము అని మూడు ఆవృతాలలో మహాభారతం కాలక్రమేణా వృద్ధిచెందింది. ఇప్పుడు వర్తమాన మహాభారతము నాల్గవ ఆవృతముగా మనం అనుకోవచ్చును. బహువిధ శైలులతో, పరస్పర ఛందొ వైవిధ్యంతో, పరంపరాగత వైరిభావ సిద్ధాంత  ప్రతిపాదనలతో, బహువిషయ వైరుధ్యంతో, ఈ మహాభారతం కాలక్రమేణా రూపాంతరాలు చెందుతూ ఒక విలక్షణ మిశ్రమరూపంతో మనకు దొరుకుతోంది. కనుక ఈ భారతం కొన్ని వేల ఏళ్ల క్రిందటి నుంచీ దొరుకుతున్నా, మనం చదివే నేటి భారతంలో వ్యాసుడు రచించినవ ఆనాటివి ఎంత మటుకూ దొరుకుతున్నాయి అన్నదే ముఖ్యాంశం. ఏ శ్లోకం ఎప్పుడు చేర్చబడింది, ఏ శ్లోకం జయలోనిది అన్నది మనకిక ఖచ్చితంగా తెలిసే ఆస్కారమూ లేదు, అదృష్టమూ లేదు. ప్రామాణికమెదో తెలియక ఒక ప్రక్క సతమతమౌతూ వుంటే, మరోప్రక్క తెలిసీతెలియక ఇంకా పెంచుకుంటూ పోయే నేటి రచయితలు ఇంకో శాపం.
 
9)      అంటే అనేకుల చేత అనేక కాలాలలో వ్రాయబడిన గ్రంధమే మనకు దొరికే మహాభారతం.  మన కురుపాంచాలుల చరిత్ర అనేక కట్టుకథలతో, అస్వాభావిక విషయములతో అభూతకల్పనలతో ఉబ్బిపోయి అసలు విషయాన్ని అనుమానాల పాలు చేసాయి. చారిత్రాత్మక అంశాలను అవమానం పాలుచేసాయి. భారతీయ పండితులు ఇలా ప్రక్షిప్త భాగాలు చేర్చడంలో పేరెన్నికగన్నవారు. వీరి సరదాల వల్ల రామాయణభారతేతిహాసాలు, ఉపనిషత్తులు, సూత్రములు, ఇతిహాసములు, పురాణాలు, ఉపపురాణములు, స్మృతులు, వంటి పవిత్ర గ్రంధలన్నిటి పైన కూడా మనకు అనుమానం కలుగుతోంది. పుస్తకాలు అచ్చువేయగల పరిజ్ఞాన సామర్ధ్యం లేకపోవడం చేత, మూలప్రతి అందుబాటులో వుండకపోవడం వల్ల, ఎవరి ఇష్టానుసారం వారు గ్రంధాలను మార్చివేసి, జనామోదం కోసం అన్నీ వ్యాసుడే చేప్పాడని ఆయన పైకి నెట్టేసారు.  దయానంద సరస్వతి అందుకే తులసీదాసు విరచిత రామాయణము వంటివి కూడా  ప్రమాణములు కావని, కేవలం వాల్మీకి రామాయణాన్నే చదవాలని ఉపదేశించారట. అలాగే ఈ నాడు మహాభారతాన్ని గురించి తెలుసుకోవాలంటే, శోధించి అసలైన వ్యాసభారతాన్ని సంపాదించి చదవాలి కానీ, కవిత్రయం వ్రాసిన భారతాన్ని కూడా  కాదు. ఎందుకంటే అందులో అనువాదకులు తమతమ అభిప్రాయాలు చేర్చే ఆస్కారము వుంటుంది.

 
10)      హిందీకవి "చాంద్ వరదాయ్" తన "పృద్వీరాజ రాసో" అనే గ్రంథాన్ని కేవలం 5000వేల పద్యాలతో వ్రాస్తే అది నాడు 1,25,000 పద్యాలతొ దొరుకుతోంది. ఈ మధ్య్య అసలు మూలప్రతి జోధపూరు సంస్థానములో ఆ కవి వంశీకుని ఇంట దొరికింది. ఆ వ్రాత ప్రతిని చూసి "స్మిత్" అసలు భారతీయ గ్రంధాన్వేషణ, కాలనిర్ణయాలు చేయాలంటే అది చరిత్ర శాస్త్రజ్ఞులకే ఒక అగ్నిపరీక్ష అని చెప్పాడు.
.
 
11)      భగవద్గీత: మెక్డోనాల్డ్ అభిప్రాయం ప్రకారం భగవద్గీత బాణుని కాలంలో భారతంలో  జొప్పించబడింది. ఆదిపర్వము అనుక్రమణికలో భగవద్గీత అసలు లేనేలేదు. మరి భగవద్గీత ఎవరు వ్రాసారు?”, అన్నది ఒక గొప్ప ప్రశ్న! అది వ్యాసప్రోక్తమూ కాదు, శ్రీకృష్ణప్రోక్తమూ కాదు, అని తేలుస్తోంది విశ్లేషణ. అందుకే కవిత్రయ భారతానువాదంలో కూడా భగవద్గీత కనపడదు. ఎవరు వ్రాసినా సరే, భగవద్గీత మాత్రం భారత దేశం గర్వింప దగ్గది, పూజింప తగ్గది అని అందరి ఏకాభిప్రాయం.  అసలు భారతగాధలో కృష్ణుడు పాత్ర అతితక్కువ అంటారు. పాండవపాత్రల కీర్తిని అత్యున్నతంగా చాటడానికి, జనామోదానికీ, వారికి చరిత్రలో సరియైన గుర్తిపును ఇవ్వడానికి, సమకాలీకుడైన, శ్రీకృష్ణభగవానుడిని దీనిలోకి చేర్పించారు, అని మరొక బలమైన వాదన వుంది.  అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణంలో కృష్ణుడిని ప్రార్ధించు భాగము కూడా కల్పితమే ననీ, నరకాసురవధ, వరహావతారము, అర్జున ఊర్వశీ కథలు, కుంతి పాండవుల వద్ద శెలవు తీసుకొనిపోవు భాగములన్నీ తరువాత చేర్చబడినవి అనీ సంస్కృత విశ్లేషకులు తేల్చి చెప్పారు.
 
12)      రామాయణం : అలాగే రామాయణంలోని అనేక భాగాలు కూడా మహాభారతంలో దూర్చబడ్డాయనే వాదనలు కూడా వున్నాయి. బాలకాండ లోని 14వ సర్గ, మహాభారతంలోని అశ్వమేధ పర్వంలోని ధర్మరాజు అశ్వమేధ వర్ణనే. అయోధ్యకాండలోని 110వ సర్గే భారతంలోని సభాపర్వంలోని 5వ అధ్యాయము. సుందరకాండ 15వ సర్గలోని సీతాదేవి వర్ణనే అరణ్య పర్వములోని దమయంతీ వర్ణన. ఇలా ఎన్నో వున్నాయని కొడాలి లక్ష్మీనారాయణ వ్యాఖ్య.
 
13)      సర్పసత్ర యాగంలో అనేక జనమేయుని ప్రశ్నలకి వైశంపాయనుడు సమాధానాలు చెప్పినట్లు, ఆ సమాధానాలన్నీ నేడు మనకు లభ్యమవుతున్న భారతంలో దొరుకుతొంది. అలా వ్యాసుడు   రాబొయే కాలంలో జరిగినవన్నీ తన రచనలో ఎలా చెప్పగలుగుతాడు అని సి.వి.వైద్య ప్రశ్నించారు. అలాగే సౌనకాదిమునులు తమ 12 ఏళ్ళపాటూ జరిగిన యాగంలో సౌతి కూడా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.  అవి కూడా భారతంలో భాగాలుగా చెలామణీ అవుతున్నాయి .
 
14)      అంటే అసలు వ్యాసుడు వ్రాసిన ఇతిహాసము (చరిత్ర) భారతంలో 4వ వంతు కన్నా తక్కువ అని మనం గ్రహించవచ్చు. ఈ యుద్ధగాధ క్రమేణా ఈనాటి రూపాన్ని సంతరించుకోవడానికి అనేక తరాలు గడిచివుంటాయని వీబర్ కూడా నిర్థారించాడు. అలాగే క్రీ.శ.1000 వ సంవత్సరానికి ముందు మనదేశంలో చరిత్ర వ్రాసే కళే లేదని అందరూ ఒప్పుకునే విషయమే. ఇవన్నీ చూస్తే 75శాతపు శ్లోకాలు(లేక గాధ) ప్రక్షిప్తము అని తెలుస్తున్నది. దానిని బట్టి భారతం కల్పితమనే వాదన సబబుగానే అనిపిస్తుంది.

కానీ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనకు దొరికిన భారతంలో 10 నుంచీ 25 శాతం వరకునైనా ఇతిహాసమేననీ , అది కల్పన కాదనీ, అది వ్యాస విరచితమేనని. అదే మనం గ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం. ముఖ్యగాధ కురుక్షేత్రయుద్ధానికి సంబంధించినత వరకు నిజమేననీ--  మిగితా చిన్నచిన్న పిట్టకథల వంటివి అనేకం అనేకుల ఇష్టానుసారం తర్వాత చేర్చబడ్డాయనీ గ్రహించవచ్చు.  భారతం (ముఖ్యగాధ -జయ) ఒక ఇతిహాసమే అని వ్యాసుడు తన రచనలో చెప్పాడు కూడా. అంటే ఆయన చెప్పినంత వరకు ఒక ఇతిహాసమేనని మనం నమ్మవచ్చు.  ఇతిహాస (ఇతి+హ+ఆస) అన్న శబ్దమునకు అర్థము " ఇటుల+ నే+ జరిగెను " . అంటే ఇది చరిత్ర అని ఇతిహాస శబ్దానికి అర్థము. "ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్" అన్న వాక్యమును బట్టి పురాణేతిహాసాలు వేద వివృతములని తెలుస్తున్నది.
 
15)      భారత ప్రస్తావన:  భారతాన్ని ఇతిహాసము, పురాణము, కావ్యము, అఖ్యానము అని రకరకాలుగా పిలుస్తారు. కానీ భారతము బ్రాహ్మణములలో కానీ ఉపనిషత్తులలో కానీ కనిపించదు. జనమేయ, పరీక్షిత్తుల వంశాలపైన కూడా వివాదాలు అనేకం వున్నాయి.   యజుర్వేద "కాఠక" సంహితలో "ధృతరాష్ట్ర వైచిత్రవీర్యుని" ప్రస్తావన వుంటుంది. కానీ అక్కడ కథమాత్రం మొత్తం వేరేగా వుంటుంది. ప్రొఫెసర్ ఎగ్లింగ్ "శతపద బ్రాహ్మణ్యము" ను తర్జుమా చేస్తూ అందులో కొద్దిపాటి మహాభారత ప్రస్తావనలు కనిపిస్తాయి అని పేర్కొన్నాడు. కానీ దాని పైన కూడా అనేక వివాదాలు వున్నాయి. మొత్తానికి యుద్ధము అనేది జరిగిందని ఒప్పుకున్నారు గానీ అది ఒక చిన్న జాతి తగాదా మాత్రమేనని పలువురి విశ్లేషకుల అభిప్రాయము.  కె.ఎం.మున్షీ అభిప్రాయం ప్రకారం మహాభారతం మొత్తం కల్పితమే. అలాగే చాందోగ్య ఉపనిషత్తులోని VI-17-9 సూచన వల్ల శతపథ బ్రాహ్మణ్యములోని విరోధభావముల వర్ణన వల్ల కురు వంశంలో యుద్ధం జరిగి వుండవచ్చునని రాయ్ చౌదరి అభిప్రాయము. ఎ.బి హవెల్ ఇది  ఆర్యుల మద్య క్రీ.పూ 1400-1300 లో జరిగిన యుద్ధమని, దానికి ద్రవిడులు సాయపడ్డారని సూచించాడు. ఇలా పలువురు పరిశోధకులు తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. భీష్మపర్వంలో వ్యాసుడు ధృతరాష్ట్రుడితో రాబోయే ఉపద్రవాలను చెప్పి నీ పుత్రుల కథను శాశ్వతముగావుండేటట్లు చేస్తానని చెప్పడం, భారతం ఒక ఇతిహాస మవ్వబోతోందని తెలుపడమే అనుకోవచ్చు.  
 
16)      రెండవ ప్రపంచ యుద్ధంతో పోలిక : హాలివుడ్‌లో రెండవ ప్రపంచయుద్ధం పైన అనేక చలనచిత్రాలు రూపొందించారు. కథను ఆసక్తికరంగా మలచడానికి ప్రతి చిత్రంలోనూ కథానాయకులను సృష్టించి కథలను నడిపించారు. అసలు కథకు సంబంధించిన ఇతివృత్తం కల్పితంకాదు, కానీ చాలా పాత్రలు కల్పితం అయ్యివుండొచ్చు అని మన అందరికీ తెలుసు. ఆ  సినిమాకథలలో ఏది ఎంత మటుకు కల్పితమైనా కూడా , మనం రెండవ ప్రపంచయుద్ధం జరగలేదని వాదిస్తామా? మహాభారత రచనలోనూ ఇలాంటివి ఎన్నో జరిగివుండవచ్చును అని మనం ఎందుకు అనుకోకూడదు?
 
 
a)      అంతే కాదు భారత యుద్ధంలోని పాత్రలను గమనించండి. మానవుని చిత్తవృత్తులే భారతంలోని పాత్రలు. వారి నామాలు కూడా వారి గుణాలకు అనుగుణంగానే వుంటాయి.  కొంతమందికి వారి గుణాలు, రాజ్యాల పేర్లు తప్ప వారి పేర్లుకూడా తెలియవు. ఉదాహరణకి ద్రౌపది, ద్రుపదుడు, గాంధారి, దుశ్శాశనుడు, ద్రోణుడు వంటివి.  యుద్ధగాధలలో వ్యక్తులకంటే వారి గుణాలు, దేశాల ఉనికే ప్రధానం అని మనందరికీ తెలుసు. ఈ పాత్రల పేర్లు కూడా అదే నిజాన్ని సూచిస్తూ, తాము ఈ చరిత్రలో ఒక భాగం అని గుర్తుచేస్తున్నాయి. చరణ త్రాణముల బట్టి చెప్పేది చరిత్ర అనే నిర్వచనము భారతానికి సరిగ్గా సరిపోతుంది.
b)      ఏ రచయితాకైనా ఇన్ని పాత్రలను పెట్టి, వారి మద్య అనేక సంబంధ వ్యవహారాలను జొప్పించి, క్లిష్టమైన వేరువేరు మనస్తత్వాలు నిర్మించి, అనేక తరాలవారిని జొప్పించి, అనేక నగరాల గురించి, రాజ్యాల గురించి, అనవసర వివరాలను గుప్పించి, క్లిష్టమైన ఎన్నో అసమాన్య రూపాలకు, పాత్రలకు రూపకల్పన చెయ్యడం అనవసరం, అసంభవం. ఎవరైనా ఒక కథ వ్రాయాలి అనుకుంటే 5 ముఖ్యపాత్రలు, లేకపోతే 10 పాత్రలకు రూపకల్పన చేసి కథ ముగిస్తారు. ఒక కథకు అంతకంటే ఎక్కువ పాత్రలు, వారి వివరాలు అనవసరం. ఒక వేళ ఏ పిచ్చి రచయితైనా  వేల పాత్రలను సృష్టించే ప్రయత్నం చేసినా, అన్నేసి పాత్రలను గుర్తుపెట్టుకుంటూ ఏ పాఠకుడూ ఆ కథను చదవలేడు. చదువుతూ ఫాలొ అయ్యాడూ అంటే, పాఠకుడికి ఆ పాత్రలు శతాబ్దాలుగా సుపరిచయమైనవి అని అర్థం.  పాత్రలు కథ చదవడానికి ముందే సుపరిచయం అయ్యాయి అంటే,  అది చరిత్రే అయ్యివుండాలి. ఊదాహరణకి రెండవ ప్రపంచ యుద్ధగాధలు చూస్తే తతంగం ఇలాగే వుంటుంది. మనకు తెలిసినవే అనేక పాత్రలు, అనేక కథలు, అనేక వ్యూహాలు ఉన్నాయి. వాటికి తోడు, అవసరార్థం కొత్త పాత్రలు సృష్ఠించుకుని అనేక సినిమాలొచ్చాయి. ముఖ్యకథ కల్పితం కాదు. కానీ అనేక పిల్లకథలు, పిల్లపాత్రలు వచ్చి అందులో చేరాయి.  కథని చరిత్రని వేరుపరచి తెలుసుకోవడం మన బాధ్యత.
 
 
c)      అంతేకాదు యుద్ధంపై భారతంలో ఇచ్చిన వివరాలు అనేకం. భారతంలో దాదాపు సగభాగం చర్చ యుద్ధవ్యూహాలు రచన, వ్యవస్థల పైనే జరిగింది. ఒక కథలో అన్ని అధ్యాయాలలో  ఆ వివరాలు ఎవడికి కావాలి? ఈ నాడు అమెరికాలొ రెండవ ప్రపంచ యుద్ధం గురించి వచ్చిన  సినిమాలను చూస్తే, వాటిల్లో కనిపించే వివరం మనకు ఏ మామూలు కథలోను కనపడవు.  ఐయినా నేపధ్యం మనకు తెలుసు కనుక మనకు ఎబ్బెట్టుగా అనిపించదు. మారిషియస్‌కీ మాలదీవ్స్ కీ యుద్ధం అని మీరు కొన్ని పదిపదిహేను పుస్తాకాలలో యుద్ధ వివరాలు కల్పించి గుప్పించి, అలాగే 10వేల పాత్రలు సృష్ఠించి వ్రాసి చూడండి! ఎవరిలో ఎంత ఆసక్తి రగిలించగలరో చూద్దాం! ఎంతమంది ఆ పుస్తకాన్ని కొనుక్కుంటారో చూద్దాం!
 
 
d)      కానీ రెండవ ప్రపంచ యుద్ధం అని ఒక అమెరికన్ ముందు అని చూడండి, అనేక యుద్ధ కథనాలు, అనేకమంది మిలటరి జనరళ్ళు, అనేక దేశస్తుల వివరాలు, అనేక కథలు, వ్యూహాలూ, రాజులు, రాజ్యాల వివరాలు వారే చెబుతారు. అందులో కల్పితాలూ ఊహాగానాలూ అనేకమున్నా, ఎన్నో వివరాలకు అర్థం లేకున్నా, అర్థం కాకున్నా, ఎంతో ఆక్తితో వారు కథను చెప్పగలుగుతారు, మనం కథను ఫాలో అవగలుగుతాము. మహాభారతయుద్ధం సంధర్భంలోనూ ఇదే జరుగుతుంది. సబ్జక్టు ఎంత క్లిష్ట మైనదైనా పాత్రలు అన్ని వున్నా,   పాఠకులు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే నేపధ్యం ఒక చరిత్ర కనుక! చాలామటుకూ అందరికీ తెలుసు కనుక!
e)      యుద్ధము చేసిన వారు తన మనుమలే అని వ్యాసుడు భారతంలో చెప్పాడు. ఇప్పటి దాకా ఏ కథారచయిత ఐనా నా కుటుంబీకులలో చాలా మందిని చంపవలసి వచ్చిందని రాసుకున్నాడా? దానితో మంచి జరిగింది అని చెప్పుకున్నాడా? వినడానికే బాగులేదు, మరి అలా ఎందుకు వ్రాసుకుంటారు? అది నిజమైతే తప్ప.
f)       కానీ ప్రతి చరిత్రలో ప్రతి చరిత్రకారుడు చేసిన తప్పులు ఇక్కడ కూడా జరిగి వుండవచ్చు. సామాన్యంగా గెలిచిన వాడు మంచివాడుగా, ఓడిన వాడు చెడ్డవాడుగా చరిత్రలలో వ్రాయించుకుంటారు. భారతంలోని చారిత్రాత్మక భాగాలలో కూడా ఈ సహజమైన తప్పు జరిగివుండవచ్చు. పాండవులు నిజంగానే మంచివారా?, కౌరవులు నిజంగానే చెడ్డవారా? అన్న విషయానికొస్తే అసలు అది వేరే పరిశోధన అవుతుంది.  అసలు ఈ చారిత్రాత్మక భాగాలు కాకుండా, మిగితా 75% ఎలాగూ ప్రక్షిప్తమే అనీ, అందువలన ఆ భాగాలను అనేకులు వేరు వేరు అవసరాల కోసం చేర్చుకున్నారనీ తెలుసుకున్నాం. అంటే నిజంగా సత్యాన్వేషణే చేస్తే మొత్తంలో 10శాతం మాత్రమే సత్యం అని కూడా తేలవచ్చును. కానీ అసలు యుద్ధమే  జరుగలేదని మాత్రం తేలదు.
 
17)      18 అనే సంఖ్య: ఇక 18 అనే సంఖ్య పలుమార్లు ఎలా వచ్చింది?, అన్న ప్రస్తావనకు వస్తే -- మహాభారతం అంతటి పెద్ద పెద్ద గ్రంధాల్లో, ఒకే సంఖ్య అనేకసార్లు రావడం అసంభవం కాదు, కాకూడదు. నిజానికి 18 అనే సంఖ్య చాలాసార్లు వచ్చినట్లే తతిమా సంఖ్యలు కూడా వచ్చాయేమో పరీక్షించి చూద్దాం. ఉదాహరణకు ఐదు అన్న సంఖ్య ఎన్నిసార్లువచ్చిందో గమనించి చూద్దాం. మనని ఆ విషయంలో పెద్దగా కష్టపెట్టకుండా, ఎస్.ఎస్.ఎన్.మూర్తిగారు వ్రాసిన The Questionable Historicity of the Mahabharataలో ఈ ఐదు అన్న సంఖ్య అనేక సార్లు వచ్చిందని వారు కూడా మరొక ఆక్షేపణ తెలిపారు. వారిచ్చిన వివరాలలో కొన్ని ఈ క్రింది విధంగా వుంటాయి.
భారతంలో సంఖ్య ఐదు వచ్చిన సందర్భాలు
1
పాండవులు ఐదుగురు
I.223,432.
2
ఉపపాండవులు ఐదుగురు        
III.117,251.
3
వేదాలు ఐదు(భారతం పంచమవేదం)
I.2, 15; 63,128.
4
వ్యాసుని శిష్యులు ఐదుగురు(తనపుత్రుడు శుకునితో కలిపి)
I.1,6;63,128 ; II.4,6
5
శుకుడిని పంచభూతాల అవతారంగా వర్ణించారు
XII.324,82.
6
కృష్ణ నామంతో ఐదుగురిని సంభోదించారు (1). కృష్ణుడు (2) ద్వైపాయన వ్యాసుడు (3) ద్రౌపది (4) అర్జునుడు (అతడికున్న 10 నామాలలో ఒకటి) (5) పౌండ్రక వాసుదేవుడు
IV.44,76.
V.49,119; 52,176;
59.139.
VIII.17,36, I.14,33.
7
కేకయ సోదరులు ఐదుగురు
V.19,32; 51.122
8
సుశర్మ సోదరులు ఐదుగురు
V.167,324
9
విరాటుని పిల్లలు  ఐదుగురు
 
10
యయాతికి  పిల్లలు  ఐదుగురు
I.75,165
11
జమదగ్నికి పిల్లలు  ఐదుగురు
III.116,249
12
వసు ఉపరిచారమహారాజుకు కొడుకులు ఐదుగురు
I.63,125
13
ద్రౌపది పంచకన్యలలో ఒకతి
I.199,392; V.33,65.
14
అర్జునుని కథలో ఐదుగురు అప్సరసలు
I.218,422
15
ఐదు సరోవరాల ప్రసక్తి
I.218,422
16
స్వయంవరం అనేది ఐదవ రకమైన వివాహ పద్దతి
I.102,219
17
అర్జునుడు స్వర్గంలో ఐదు సంవత్సరాలు గడిపాడు
II.44,99; IV.2,3.
18
అర్జునుడు ఐదుగురు దేవతల వద్దనుండీ దివ్యాస్త్రాలు పొందాడు (ఇంద్ర, వరుణ, కుబేర, రుద్ర, యములు)
II.36,80; 170,330.
19
అర్జునుడు ఐదు సంవత్సరాలు హిమవత్పర్వతంపైన గడిపాడు
IV.49,85
20
నిశాద ప్రాంతం ఐదు నదులు కలిగిన ప్రాంతంగా వర్ణింపబడింది (పంజాబా?)
III.34,76
21
కృష్ణుని శంఖం పేరు పాంచజన్యం
I.65,133; II.20,44.
22
భీష్ముని పతాకంపైన ఐదు నక్షత్రాలు
IV.55,96; VI.17,39
23
సంధిలో పాండవులు అడిగిన ఊళ్ళ సంఖ్య ఐదు
V.31,56; 55,130.
24
ద్రౌపది స్వయంవరంలో వాడిన అస్త్రాల సంఖ్య ఐదు
I.188,372; 190,376.
25
ఐదు అస్త్రాలు వాడిన అనేక సందర్భాలు
I.102,220;118, 245;
VI.47,113.
26
ఐదుగురు సైనికుల బృందం యుద్ధంచెయ్యడం
IV.32,58; I.47,113.
27
సుదర్శనచక్రపు పరిమాణం ఐదు మూరలు
V.68,149
28
తమరరాజుకు ఐదుగురు కుమార్తెలు
I.66,138
29
యుద్దక్షేత్రం నుంచీ యుద్ధశిబిరాల దూరం ఐదు యోజనాలు
V.198,375
30
గాంధారరాజు కుమారులు ఐదుగురు
I.188,372: V.6,15.
31
కృష్ణుడితో సతీసహగమనం చేసిన భార్యలు ఐదుగురు
XVI.7,14
32
ఐదు నదులు కల రాజ్యం
II.31,67; 82,171:
V.4,6; 19,32.
33
ద్రోణుడి ఆదిపత్యంలో యుద్ధం జరిగిన రోజులు
I.2,16
34
పాండవులకు తమతమ రెండవ భార్యలద్వారా కలిగిన సంతానం ఐదుగురు (ఘటోత్కజుని లెక్కించకుండా వుంటే)
I.95,205
35
పాండవులకు పంచసూర్యులతో పోలిక
IV.51,88
36
హిరణ్యకశిపునికి పిల్లలు ఐదుగురు
I.65,13
37
అబద్దం ఆడటం ఐదు సందర్భాలలో తప్పుకాదు
I.82,180
38
భరతుని తాతకు ఐదుగురు బిడ్డలు
I.94,200; 95,203.
39
కురుమహారాజుకు వాహినీ దేవి ద్వారా ఐదుగురు బిడ్డలు
I.94,201
40
ఋషి  కక్సివతునికి సుదేషణ ద్వారా ఐదుగురు బిడ్డలు (అంగ, వంగ, కలింగ, పుండ్ర, సుహ్మ).
I.104,226
41
ద్రోణుడిని పాండవులు చుట్టుముట్టిన సన్నివేశాన్ని ఐదు నక్షత్రాల హస్తా నక్షత్రంతో పోల్చడం
I.137,287
42
ఐదు ప్రదేశాల ప్రస్తావన
I.218,422; 219,424.
43
స్వేతకి మహారాజు ఐదు మహా దానాలు
I.225,435
44
మగధవద్దనున్న పర్వతాలు
II.21.45
45
ఐదురాజ్యాల ప్రస్తావన
II.26,57
46
కర్నాటుల ఐదు తెగలు
II.31,66
47
పంచభూతాల ప్రస్తావన
II.37,78; 50,109.
48
కమ్యకవనంలో పాండవుల  నివాసం ఐదు సంవత్సరాలు
II.50,109
49
చేతిని ఐదుతలల పాముగా వర్ణించడం
II.57,121; IV.22,42.
50
దమయంతి స్వయంవరంలో పోలికలు గలిగిన ఐదుగురు వ్యక్తులు 
II.57,121
51
పురాణాలను పంచమవేదంగా చెప్పడం
II.58,123
52
వందినఋషి పంచాగ్నులనూ, పంక్తి కి ఐదు పాదాలనీ, ఐదుదానాలనూ, పంచమహానదులనూ వర్ణించడం 
III.134,277
53
జయద్రుని పంచశిఖలు
III.257,529
54
పులస్య్తమునికి ఐదుగురు బిడ్డలు
III.258,534
55
లక్ష్మీదేవి రూపాలు ఐదు
IV.14,24
56
పంచాగ్నులు
V.33,62
57
పంచేంద్రియాలు
V.34.66; VI.39,89.
58
పంచమహాపాతకాలు
V.34,67.
59
పంచసామర్ధ్యాలు
V.37,80
60
పాండవులు పంచభూతాలు
V.65,146
61
ఐదు యోజనాల ఎత్తుగల ప్రదేశం
XIV.58,105
62
పంచప్రాణాలు
XIV.20,17
63
శుక్రునికి బిడ్డలు ఐదుగురు
I.65,134
 
ఇలాగే మనం ఒకటి లేక మూడు అన్న అంకెల కోసం కూడా వెతికి చూస్తే అవి కూడా ఎన్నో మార్లు కనిపిస్తాయి. అంటే లక్ష శ్లోకాలలో, మనం ఏ సంఖ్యకోసం వెతుక్కుంటే ఆ సంఖ్య పలుమార్లు కనిపించే అవకాశంవుంది. ఇలాంటివాటి కోసం వెతికితే, ఇంకెన్నో కూడా కనపడతాయి. అంగీరసుని పేరు 3200సార్లు, భృగువు 1500 సార్లు, వశిష్ఠుడు 830 సార్లు, మరీచి 175 సార్లు, అత్రి 60 సార్లు, పులస్త్య 35 సార్లు, పులహ 20 సార్లు, క్రతు 20 సార్లు, వచ్చాయి కనుక ఈ గ్రంథం భ్రాహ్మణుల గురించి చెప్పడానికే వ్రాసారు, అని కొడాలి లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇలాంటి స్టాటిస్టిక్స్ వేసుకుపోతే, మనం ఏ విషయం  చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు. నిజానికి అందరూ ఇలా చెప్పుకుంటూనే భారతాన్ని పెంచేసారు. అంత మాత్రం చేత ఆ పుస్తకం మొత్తం అసత్యం అయ్యే ఆస్కారం  లేదు!  ఈ సంఖ్యలు కాకతాళీయం కావచ్చు. లేకపోతే కవులు తమకు ఇష్టమైన సంఖ్యను అనేకసార్లు యదేచ్చగా వాడుకొని కూడా వుండవచ్చు. యధార్థ సంఘటనకు కల్పిత సంఘటనలు కొన్ని కలిపి వ్రాసివుండవచ్చును. అలా కల్తీ జరిగే ఆస్కారం తప్పకుండా వుంది! జరిగింది! ఆ కల్తీ ఇప్పటికీ జరుగుతునే వుంది! ఈ కల్తీ ఎంత జరిగిందీ అంటే,  11 పర్వాలని మనం 18 పర్వాలుగా  పెంచేసుకొని, ఆ తరువాత ఎందుకో 18 తప్పుగా అనిపించేసి, ఇప్పుడు 18 తప్పు కాబట్టి భారతమే తప్పు అనే స్థితికి చేరిపోయాము. తప్పు భారతానిది కాదు, తప్పు చరిత్రను కథలుగా మలుచుకోవలన్న మనలోని శతాబ్దాలనాటి తాపత్రయానిది. ఆ తాపత్రయంలో మనం చేసిన తప్పులే మనముందు మన భారతాన్ని ఒక దోషిగా ఈనాడు నిలబెట్టాయి. భాధ్యులు ఎవరు?

ఏ చరిత్ర వ్రాసేటప్పుడైనా అందులో కొన్ని రచయిత అభిప్రాయాలు దొర్లడం సహజమే, అంతే కాదు, కొన్ని సంఘటనలను వర్ణిచేటప్పుడు కొన్ని ఉపమానాలు వాడటం, అలాగే కావ్యం అందంగా అనిపించడంకోసం కొన్ని నగిషీలు చెక్కడం వంటివి సహజమైన అందమైన పొరపాట్లు జరిగివుండవచ్చును. భారతంలోనూ అదే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తున్నది. అందుకే ఒకొక్క చాప్టరునీ అధ్యాయం అనకుండా పర్వాలు అన్నారు.

1. ఆది పర్వం -జన్మించడం దాని వృత్తాంతాలు
2. సభాపర్వము- సర్వేంద్రియ మనోవికాసం
3. ఆరణ్య పర్వము- ఆత్మజ్ఞాన సముపార్జన
4. విరాట పర్వము - విరాడుపాసన. ఇది రహస్యభావం కనుక రహస్యంగా అజ్ఞాతం జరిగింది
5. ఉద్యోగ పర్వం - ఉత్+యోగం= (ఆత్మను) ఉత్తమ పురుష యోగమునకు ప్రయత్నించుట
6. యుద్దపంచకము(భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వములు) - అసుర వృత్తులను జయించుట
11.స్త్రీ పర్వము - ప్రకృతిః స్త్రీ. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం.
12. శాంతి పర్వము - సర్వధర్మ సంగ్రహణము
13. అనుశాసనిక పర్వము - వేదశాసనాను వర్తనము
14.-అశ్వమేధ పర్వము- అంతర్యాగము
15. ఆశ్రమవాస పర్వము - అనాసక్త కర్మానుష్టానము
16. మౌసల పర్వము - ఆత్మ నిష్క్రమణము
17. మహా ప్రస్తానిక పర్వము - సూర్యాభిముఖంగా మహాపథమునకేగుట
18. స్వర్గారోహణ పర్వము - స్వస్వరూప స్థితి పొందుట

పర్వమంటే  గ్రంధి.  ప్రతి గ్రంధీ రసాత్మకమవుతుంది కనుక భారతం రసోమయమై కనిపిస్తోంది. అంటే రసాత్మకత కనిపించాలి అని కవి ఆశించిన మాట విదితమే అవుతోంది. రసాత్మకత వుందీ అంటే చరిత్ర కాదు అని అర్థం మాత్రం కాదు. దానిని ఒక రచనాశైలిగా మనం గుర్తించ గలగాలి మహాభారతంలో ఆదిపర్వం, భీష్మ పర్వాలలో ఇది ఒక " ఇతిహాసమే " అని చెప్పడం జరిగింది.   ఆదిపర్వం, 62వ అధ్యాయంలో భరతవంశం గురుంచి చెప్పిన కథనం ఎక్కడ ఒక కవితలాగా అనిపించదు.  రాజుల పేర్లేకాదు, వారి భార్యల పేర్లు, బిడ్డల పేర్లు, చుట్టాల పేర్లు వంటి అనవసరమైన వివరాలు కవితలలో ఎందుకు చెబుతారు.    
 
"Whatever sphere of the human mind you may select for your special study, whether it be language, or religion, or mythology, or philosophy, whether it be law or customs, primitive art or science, you have to go to India. Some of the most valuable and instructive material of the history of man are treasured up in India and India only." -- Max Mueller
 
ఆ రోజుల్లో ప్రతీదీ శ్లోకాలలో చెప్పడం ఆనవాయితీ కనుక, మొత్తం కవితా రూపంలో చెప్పవలసి వచ్చింది అని అనుకోచ్చు కానీ, ఇది కేవలం కల్పితం అని చెప్పలేము. ఒక వేళ కేవలం ఇది ఒక కవితే అని అనుకుందామా అంటే భరత వంశ చరిత్ర ఎందుకు, యుద్ధ వ్యూహాలరకాలు ఉదహరించడం ఎందుకు? (భారతంలో ఉదహరించిన కొన్ని యుద్ధ వ్యూహాల పేర్లు ..  … క్రౌంచ వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, త్రిషూల వ్యూహం, చక్ర వ్యూహం కమల వ్యూహం లేక పద్మ వ్యూహం గరుడ వ్యూహం ఊర్మి వ్యూహం, మండల వ్యూహం, వజ్ర వ్యూహం, షకట వ్యూహం, అసుర వ్యూహం, దేవ వ్యూహం, సూచి వ్యూహం, శ్రింగటక వ్యూహం, చంద్రకళా వ్యూహం, సుచి వ్యూహం, చయన వ్యూహం, మాల వ్యూహం).  ఇవి భారతంలోని అతికొద్ది వివరాలు మాత్రమే. ఇలాంటి వివరాలు, తిథులు, గ్రహణాలు, గ్రహస్తితులు, రాజ్యాలపేరులు, రాజుల పేర్లలాంటి అక్కరలనే వివరాలు ఎన్నో ఎన్నెన్నో కనిపిస్తాయి. ఇలాంటి వివరాలేవి కథ విలువను ఏ విధంగానూ పెంచవు.  అంతే కాదు ఆఖరిలో కల్కి అవతారందాకా వచ్చే రాబోయే రాజులు, వారి వంశాల లిస్టుని ఇస్తుంది. ఇందులో ఏ కవిత్వమూ లేదు. ఇది కేవలం ఒక పట్టిక మాత్రమే. అందుకే మనలో చాలామంది ఆ లిస్టుని చదవకుండా పేజీలు తిరగేస్తాము. మరి ఇవి కవితలే ఐతే, ఈ అనవసరమైన సమాచారాన్ని ఎందుకు ఇస్తారు?
 
కాని, ఇది ఒక చరిత్ర అని అనుకుని చూడండి అప్పుడు కొన్ని అనవసరమైన వివరాలలోని అర్థం, పరమార్థం, స్వార్థం,  విడివిడిగా కనిపిస్తాయి.  అది చరిత్ర అని అనుకుని చూడండి, అందులోని ప్రతి శ్లోకం ,  ప్రతి పిట్ట కథ ఎవరు ఏ కారణంవల్ల, చేర్చుకున్నారో, దానివల్ల ఎవరికి ఏమి ప్రయోజనమొచ్చిందో తెలిసొస్తుంది.

మహాభారతంలో అనేక చోట్ల మనుస్మృతి ప్రస్తావనలుంటాయి కానీ మనుస్మృతిలో భారతం ప్రస్తావన కనబడదు. అంటే మనుస్మృతి తరువాతే భారతం  పుట్టింది అని ఊహించవచ్చు. మొదట మనుస్మృతిలో లక్ష శ్లోకాలు వుండేవట. తరువాత ఇవి 12 వేలు అయ్యాయి, ఆ తరువాత 4 వేలకు తగ్గాయట, కాని మనకు ఇప్పుడు దొరికే మనుస్మృతిలో కేవలం 2684 శ్లోకాలు మాత్రమే వున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మనుధర్మ శాస్త్రం మహాభారతానికి భిన్నంగా కుచించబడింది. కలియుగ ప్రభావమేమో - ధర్మశాస్త్రం పెరుగలేదు సరికదా తరిగిపోయింది - అధర్మాన్ని పరిచయం చేసిన భారతం  మాత్రం పెరిగిపోయింది!
 
క్రీ.పూ.10వ శతాబ్ధం నుంచీ క్రీ.శ. 4వ శతాబ్ధం వరకు ప్రతి కవీ, తన రచనాసంపాదకచాతుర్యాలను చూపి, పెంచి పెద్దది చేసిన - నేడు మనకు దొరుకుతున్న ఈ మహాభారతం - ఒక కవిది కాదు, ఒక కలానిది కాదు, ఒక కాలానిది కాదు. దీనిలో ఏ శ్లోకాన్ని ఎవరు ఎప్పుడు వ్రాసారో, ఇరికించారో, చెప్పగలగడం అసంభవం.  కానీ వ్యాసుడు వ్రాసిన "జయ" తో పాటుగా భారత, మహాభారత, వర్తమాన మహాభారతాలనన్నిటిలోనూ చారిత్రాత్మక సత్యాలను మాత్రమే గ్రహించగలిగితే మనకు కావలిసినంత చరిత్ర దొరుకుతోంది. అనేక సంకలనాల మూలంగా ఋషులు, దేవతలు, రాజులు, వారి వంశావళీ, వేదాంతము, అలనాటి ధర్మ శాస్త్రము, న్యాయశాస్త్రము, వంటి అనేక చారిత్రాత్మక వివరాలు, మూలకథయైన కురుక్షేత్రయుద్ధంతో కలిపి చెప్పబడివున్నాయి. చరిత్ర వరకు తీసుకుని చదివితే, తేదీలు సరిగ్గా తేలకపోయినా, జరిగిన వృత్తాంతాలెన్నో తెలుస్తాయి.
 
అందుచేత వ్యాస జయేతిహాసాన్ని చరిత్రగా మనం ఒప్పుకోవాలి. కాని ఆ ప్రతి మనకిక దొరకదు! నేడు మనం చదివే మహాభారతం మొత్తం చరిత్ర కాదు. ఇది కాలక్రమేణా అనేక కథలను కలుపుకుంటూ కురుక్షేత్రయుద్ధచరిత్ర చుట్టూ అల్లుకుని విలసిల్లిన కావ్యమే!    
          
            మీ
     రావు తల్లాప్రగడ 

 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/nov10/sujananeeyam.html

1 కామెంట్‌:

  1. ఇది చాలా చవకబారు ఆలోచనలు కలవాళ్ళు చేసే విశ్లేషణ. అసలు మనకి చరిత్రే లేదనీ, వుంటే అది పరాయివాళ్ళు భిక్షయేననీ ఇలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యానాలలాంటివి.

    రిప్లయితొలగించండి