2, మార్చి 2012, శుక్రవారం

భారతీయ సాంస్కృతిక, ఆధ్యాతిక పునరుజ్జీవనం చేయడం ఎలా?


      ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రాచీన భారతదేశం సాంకేతికంగా, ఆర్థికంగా అత్యంత బలమైన దేశం. సహజంగా, ఇప్పుడు మనం అమెరికా పరుగులు తీస్తున్నట్టుగా, అప్పటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ భారతదేశం వెళ్ళాలని ఉవ్విళ్ళూరేవారు. అలా వ్యాపారం నిమిత్తమం, విజ్ఞానం నిమిత్తం ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. మంగోలాయిడ్లు, నీగ్రిటోలు, సుమేరియన్లు, పర్షియన్లు, అరబ్బులు ఇలా అనేక రకాల జాతుల ప్రజలు భారతదేశంలోకి వరదలా ప్రవహించారు. అలా బయటి వ్యక్తుల ప్రమేయం అధికమయ్యే సరికి ఇక్కడి ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం చోటు చేసుకుంది. కొత్త భాషలు, మతాలు, సంస్కృతులు ప్రవేశించే కొద్దీ సమాజంలో ఎన్నో సర్దుబాట్లు అవసరం అవుతాయి. వారి అలవాట్లు, వేషభాషలు ఇక్కడి వారికి అలవాటు పడడమో లేదా ఇక్కడి వారి సంస్కృతినే కొద్ది పాటి మార్పులతో వచ్చిన వారు అనుసరించడమో జరుగుతుంది. దీనినే సమాజ శాస్త్రం (సోషియాలజీ) లో అసిమిలేషన్‌ (తెలుగులో ??) అంటారు. అలా కొద్ది కాలం గడిచేప్పటికి సమాజంలో ఎన్నో చీలికలు కనిపిస్తాయి. పెద్ద కుటుంబాలు, ప్రాంతాలు, రంగులు, భాషలు ఇలా ఎన్ని రకాలుగా విడిపోవచ్చో అన్ని రకాలుగా సమాజం విడిపోవడం మొదలవుతుంది. ఇప్పటి వరకు అనుభవించిన సాంకేతిక పరిజ్ఞానం నిర్లక్ష్యం చేయబడుతుంది. సమాజంలో అలజడి రేగుతుంది. రాజ్యాలు కూలిపోతాయి. దేశమంతా చిన్న చిన్న ముక్కలవుతుంది. ఇక అంతటితో మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతారు. ఈ విధమైన అలజడులు భారతదేశ చరిత్రలో ఎన్నో పర్యాయాలు సంభవించాయి. వేదకాలం పూర్తయిన తరువాత ఒకసారి, మరలా రాముడు రాజ్యం చేసిన తరువాత మరోసారి, మహాభారత యుద్ధం జరిగిన తరువాత మరోసారి సమాజం పూర్తిగా కల్లోలమయింది. వీటినే మనం యుగాలు అంటున్నాము. పాశ్చాత్య చరిత్రకి అందినంత వరకు భారతదేశంలో అటువంటి స్థితి మౌర్య సామ్రాజ్య స్థాపన వరకు ఉంది. అశోకుడు చిన్న చిన్న రాజ్యాల్ని జయించి, విశాల భారత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాని అశోకుడి మరణం తరువాత మరలా సామ్రాజ్యం విచ్చిన్నమయింది. భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల మధ్య మత పరమైన విబేధాలు రాజుకున్నాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ తదితర మతాల మధ్య విద్వేషాలతో భారతదేశం అనేక కష్టాలలో పడింది. అటువంటి సమయంలో భారతదేశాన్ని ఆదుకొన్నవారు శంకర భగవత్పాదులు. ఆయన ఆసేతు హిమాచలం పర్యటించి, తన జ్ఞానంతో అన్ని మతాల సారం ఒకటే అని ప్రకటించి, దేశం నలుమూలలా శక్తి పీఠాలు స్థాపించి, అనేక చిన్న చిన్న మతాల్ని విలీనం చేసి, భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఒక్కటే అనే రూపుని తీసుకువచ్చారు. మరలా దేశం అభివృద్ధి పొందడం మొదలయింది.

    కాని ఆయన ప్రయత్నం మరలా వృధా అయింది. ఈ సారి ముస్లిం దురాక్రమణదారుల చేతిలో భారతదేశం నష్టపోయింది. 13వ శతాబ్ది మొదలుకొని జరిగిన దండయాత్రల్లో దేశానికి ఆర్థిక నష్టంతో పాటు, సాంకేతిక, ఆధ్యాత్మిక నష్టం కూడా జరిగింది. వారి చేతుల్లో అనేక విలువైన దేవాలయాలు కొల్లగొట్టబడ్డాయి, అరుదైన శిల్ప కళ ధ్వంసం చేయబడింది. కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన విలువైన గ్రంధాలు, పరిజ్ఞానం మంటల్లో కాలి బూడిదయిపోయింది. ఈ సారి భారత సమాజంలో మరిన్ని దుర్మార్గపు మార్పులు చేయబడ్డాయి. ముస్లిం దురాక్రమణదారుల నుండి కాపాడుకోవడానికి సంపదనంతా దాచిపెట్టేసుకోవడం, పక్కవాడికి ఉన్నా లేకున్నా మన వరకు దా(దో)చుకొని, జాగ్రత్త పడడం వంటివి భారతీయుల జీన్స్‌లో అప్పుడే ప్రవేశపెట్టబడ్డాయి. అవి ఇప్పటికీ మనల్ని వదల్లేదనుకోండి - అది వేరే సంగతి. మన రాజకీయ నాయకుల్లో మరింత స్పష్టంగా వీటిని గమనించవచ్చు. ఆ సమయంలో ముఖ్యంగా, ఎక్కువగా బలయిపోయింది, నష్టపోయింది - ఆడపిల్లలే. చిన్న తనంలోనే పెళ్ళిళ్ళు చేయడం (బాల్య వివాహాలు), భర్త చనిపోతే ఎవరికీ దక్కకుండా భార్య కూడా చితిలో దూకి చనిపోవడం (సతీ సహగమనం), వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరికీ కనబడకుండా ఉండాలనడం (పరదా పద్దతి) ఇవన్నీ మధ్య యుగాల్లోనే భారతీయ సమాజంలో ప్రవేశించి, మూఢాచారాలుగా స్థిరపడిపోయాయి. భారతీయులకి, ముస్లింలకి జరిగిన ఆధిపత్య పోరులో కూడా దేశం ఎంతో నష్టపోయింది.

    వీరిద్దరి పోరు ఇలా కొనసాగుతుండగా, మరో పెద్ద శత్రువు, యూరోపియన్లు వచ్చారు. వారి రాకతో హిందు, ముస్లింలు ఏకమైపోయి, ఆ పెద్ద శత్రువుని ఎదిరించే పనిలో లీనమైపోయారు. అయితే యూరోపియన్ల వల్ల, ముఖ్యంగా బ్రిటీష్‌ వారి వల్ల జరిగిన మంచి ఏమిటంటే, దేశానికి ఒక రూపం వచ్చింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ పోయి, ఒకే దేశంగా ఆవిర్భవించింది - భారతదేశం.

    ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా జరిగిన పోరాటాల వల్ల గాని, భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల వల్ల గాని భారతీయులలో మితిమీరిన సోమరితనం, నిర్లక్ష్యం, ఎదుటి వారిని దోచుకొనే తత్వం నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. దాని వల్లనే ఈనాడు సమాజంలో మనం చూస్తున్న అవినీతి, కోట్ల రూపాయిల కుంభకోణాలు, అభివృద్ధి లేకపోవడం, పేదరికం వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాడు కూడా నాకు లాగే భారతీయుడే, సాటి మనిషే అన్న స్పృహ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి మతాన్ని గాని, సంస్కృతిని గాని ప్రాతిపదికగా తీసుకోవడంలో ఏ తప్పూ లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఏదో ఒక మతం వైపు మొగ్గుచూపాయి. కాని భారతదేశంలో దీనికి భిన్నంగా అన్ని మతాలు సమానమే అనే ధృక్పధంతో అందరినీ ఆదరించారు. అదే వారి పాలిట శాపమైంది.

    మనం ఏ మతాన్ని విమర్శించనవసరం లేదు. ఎవరిపైనా ఎదురు దాడి చేయవలసిన ఆగత్యం లేదు. మనలోని లోటుపాట్లని సరిచేసుకుని, మనల్ని మనం కించపరుచుకొని, ఎదుటి వారికి లోకువ ఇవ్వకుండా, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని భద్రంగా భావి తరాలకు అందించగలిగితే చాలు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కూడా బాల గంగాధర్‌ తిలక్‌ వంటి వారు ప్రసిద్ధ గణేష్‌ మహోత్సవాలు మొదలుపెట్టి, ప్రజల హృదయాల్లో జాతీయ భావనని రగిలించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సమర్థ రామదాసు శివాజీకి, విజయనగర సామ్రాజ్య స్థాపనకి హరిహరరాయలు, బుక్కరాయలకి విద్యారణ్య స్వామి వంటి వారు వేదాలు, పురాణ కథల ద్వారానే దేశ భక్తిని రగిలించారు. పిల్లలకి కూడా పాఠ్యాంశాల్లో వేద శ్లోకాలని, పురాణాల్లోని ఆదర్శమూర్తుల కథల్నీ పెట్టడం వలన వారు కూడా పెద్దయాక ఆయా ఆదర్శాలని అవలంభించడానికి వీలవుతుంది. భారతదేశం ఎవరో దోచుకుని వదిలిపెట్టేసిన దేశం కాదని, మనం కూడా దోచుకోవడానికే ఉన్నామని కాకుండా, ఇది మనదేశమని, నేను భారతీయుడినని గర్వంగా చెప్పుకోగలిగిన విజ్ఞానం ఇక్కడ ఉందని, ఇక్కడి సంస్కృతికి నేను నిజమైన వారసుడనని, ప్రాచీన భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపచేయడం మన తక్షణ కర్తవ్యమని (-స్వామి వివేకానంద) ప్రతి వ్యక్తి భావించే విధంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రతి రోజు పాఠశాల ప్రతిజ్ఞలో చెప్పుకోవడమే కాకుండా, నిజంగా ప్రతి ఒక్కరి చేత ఆలోచింపచేసి, ఆచరింపచేసే విధంగా చేయగలిగితేనే భారతదేశానికి నిజమైన విముక్తి, స్వాతంత్య్రం.


 http://saradaa.blogspot.in/

1 కామెంట్‌:

  1. Sardagaru
    I agree with u. we suould work with hand in hand for our culture
    N 1 request........let me know how to type in telugu here N Facebook.....can u do this favour for me

    రిప్లయితొలగించండి