19, ఫిబ్రవరి 2013, మంగళవారం

చైనా దాడికి 50 ఏళ్లు - 2

దేవదూతల దుస్తులు




చైనా సైన్యం సరిహద్దు రేఖ దాటి వచ్చేసింది.

ఇంకొన్ని రోజుల్లో చైనా సేనలు తేజ్ పూర్ ను ఆక్రమించుకోవడం దాదాపు ఖాయం.
భయంతో తేజ్ పూర్ నిర్మానుష్యమైంది.

ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదరయ్యారు. ఊరు వల్లకాడైపోయింది.
తేజ్ పూర్ కి అయిదు కిలోమీటర్ల దూరంలో భొమురాగురి గ్రామం ఉంది.

ఉన్నట్టుండి భొమురాగుడిలో జెండా ఎగిరింది.

మన మువ్వన్నెల జెండా కాదు.

పోనీ చైనా వాడి ఎర్రజెండా కూడా కాదు.

భొమురాగురిలో ఆకుపచ్చ జెండా ఎగిరింది. ఆ జెండాలో అర్థచంద్రుడు. నక్షత్రం!! ఇంటింటా ఆకుపచ్చ జెండా!!!

భొమురాగురి లో ఆనందోన్మాదంతో నినాదాలు ఆకాశాన్నంటాయి.

"భారత్ మాతాకీ జయ్" కాదు.

"ఛైర్మన్ మావోకీ జయ్" అంతకన్నా కాదు.

అక్కడ వినిపించిన నినాదం......

"పాకిస్తాన్ జిందాబాద్."

* * *

భొమురాగురి భలే చిత్రమైన ఊరు. 1962 లో దాని జనాభా అయిదారు వందలకు మించి ఉండదు. ఊరు ఊరంతా తూర్పు బెంగాల్ (1947 నుంచి 1971 దాకా పాకిస్తాన్, ఆ తరువాత నుంచీ బంగ్లాదేశ్) నుంచి వచ్చిన వలసదారు ముస్లింలు. కూలి నాలి చేసుకుని పొట్టపోసుకుంటారు. పేదరికం వాళ్ల నెత్తిన ప్రచండతాండవం చేస్తుంది. ఒక చిరిగిన లుంగీ తప్ప ఒంటిపై ఏమీ ఉండదు. అందుకే అసొం వాసులకు వాళ్లంటే దయ, జాలి, కరుణ. కొబ్బరికాయలు దింపడం, ఇంటికి వెదురు కంచె వేయడం వంటి పనులు వాళ్ల చేత చేయించి, కూలి ఇచ్చేవారు. అది చాలదని కాస్త బియ్యం ఇచ్చేవారు. వాడు వెళ్తూ వెళ్తూ ఏ సొరకాయో దొంగతనంగా చంకనబెట్టుకుపోతూంటే పట్టుకుని, వాడిని తిట్టి, మళ్లీ పాపం అనుకుని, ఆ సొరకాయతో పాటూ ఇంకో సొరకాయ కూడా ఇచ్చి పంపించేవారు.

కానీ భొమురాగుడి వలసదారులకు తాము పాకిస్తానీలమని తెలుసు. తమది పచ్చ జెండా అని తెలుసు. "పాకిస్తాన్ జిందాబాద్" తమ నినాదమని తెలుసు. చైనా వచ్చేస్తోందని తెలుసు. చైనా, పాకిస్తాన్ దోస్తులని తెలుసు. చైనావాడు వచ్చేస్తే "ముందుంది మంచికాలం" అనీ తెలుసు. అందుకే ఆకుపచ్చ జెండా ఎగరేశారు.

అంతటితో ఆగకుండా తేజ్ పూర్ నిర్మానుష్యం అయిపోయింది కాబట్టి ఉన్నదంతా దోచుకోవచ్చుననుకున్నారు. ఏ సందులో ఏ ఇల్లుందో వాళ్లకి బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఇళ్లలో వాళ్లు కూలినాలి చేశారు. ఏ ఇంట్లో ఏముందో వారికి బాగా తెలుసు. ఎందుకంటే దింపిన కొబ్బరికాయలు గదిలో సర్దే సాకుతో ఇల్లంతా కలయచూశారు. ఏ గదిలో ఏయే విలువైన వస్తువులున్నాయో తెలుసు. ఎందుకంటే నీరు తాగే పేరిట వాళ్లు అన్నీ చూసేసుకున్నారు.
అందుకే "పాకిస్తాన్ జిందాబాద్", "అల్లాహో అక్బర్" నినాదాలతో ఊరిమీద దాడి చేశారు. 





* * *

ఆశ్చర్యం......

అల్లరిమూకలు తేజ్ పూర్ పట్టణంలో అడుగుపెట్టగానే వారికి ఈలలు వినిపించాయి. కొందరు కుర్రాళ్లు కర్రలు పట్టుకుని కవాతు చేస్తూ కనిపించారు. ఇంకో వీధిలోకి వెళ్లగానే అక్కడ సైకిల్ పై కొందరు విజిల్ ఊదుతూ పహరా కాస్తూ కనిపించారు. మరో వీధి, ఇంకొక వీధి, దాని పక్క వీధి... ఎక్కడికి పోతే అక్కడ విజిల్ వినిపించింది. ఒకరో ఇద్దరో కర్ర పుచ్చుకుని కాపలా కాస్తూ ఉన్నారు. 

భొమురాగురి మూకలు నిరాశపడిపోయారు. ఉస్సూరుమంటూ వెనక్కి వెళ్లిపోయారు.

* * *

యుద్ధవిరామం అమలైంది. ప్రజలు మళ్లీ ఇళ్లకు తిరిగొచ్చారు. వాళ్ల సామాన్లు, విలువైన వస్తువులు యథాతథంగా ఉన్నాయి. ఎలాంటి దోపిడీ జరగలేదు. నెమ్మదిగా వాళ్లకు విషయం తెలిసింది. ఒక ముప్ఫై నలభై మంది దేవదూతల్లాంటి కుర్రాళ్లు తమనుకాపాడారని అనుకున్నారు. వాళ్లకి వేల వేల కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు.




* * *

ఆ దేవదూతలు ఖాకీ నిక్కరు, తెల్లచొక్కా, నల్లటోపీ, తోలు బెల్టు ధరించారు.

వారి చేతుల్లో లాఠీలున్నాయి.

నోట "నమస్తే సదావత్సలే మాతృభూమే" మంత్రం ఉంది.

వాళ్లు నిజంగా Ready for Selfless Service. 






(ఫోటోలు - 1) తేజ్ పూర్ పట్టణం తాలూకు దృశ్యాలు. 2) తేజపూర్ లోని అగ్నిగఢ్. బాణాసురుడు కృష్ణుడి మనవడైన అనిరుద్ధుడిని ఇక్కడే బంధించాడట. 3) ఇది 1984 నాటి ఫోటో. భొమురాగురి నుంచి నగావ్ జిల్లాలోని శిల్ ఘాట్ వరకూ కొలియాభొమొరా బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న నాటి ఫోటో ఇది. ఇందులో పొడవుగా ఉన్నాయన పేరు తరుణ్ మహంత. 1962 లో తేజ్ పూర్ ను కాపాడిన దేవదూతల్లో ఒకరు. ఆయన కుటుంబంతో నేను. (నన్ను గుర్తుపట్టండి), 4) కొలియాభొమురా బ్రిడ్జి ఇప్పుడెలా ఉందో చూపే ఫోటో. )



 http://rakalokam.blogspot.in/2012/10/50-2.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి