8, జులై 2012, ఆదివారం

పాక్ లో హిందూ ఆలయాలపై దాడి


పాకిస్తాన్ పెషావర్ లోని గోరఖ్ నాథ్ దేవాలయం

పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై దాడులు ఎక్కువయ్యాయి. భారత్ లో మైనారిటీ వర్గాలకు అన్ని రకాల మతస్వేచ్ఛ  ఉండగా, పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కొరవడింది. పాకిస్తాన్ లోని వాయువ్య ప్రాంతంలో గల పెషావర్ లోని గోరఖ్ నాథ్ దేవాలయంపై ఇటీవల దాడి జరిగింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోరఖ్ నాథ్ దేవాలయాన్ని అధికారులు మూసివేయగా, హైకోర్టు ఆదేశాల మేరకు 2011 లో ఆ దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తిరిగి తెరిచారు. అప్పటినుంచి హిందువులు గోరఖ్ నాధుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. 

కాగా, ఇటీవల కొందరు దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న చిత్ర పటాలను చించివేసి, ఆలయ గర్భ గుడిలోని శివ లింగాన్ని ధ్వంసం చేశారు. గత రెండు నెలల్లో దుండగులు వరుసగా మూడోసారి ఈ గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి చేశారు. సాహిత్యాన్ని ధ్వంసం చేశారు. 

ఈ గోరఖ్ నాథ్ ఆలయానికి 160 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం పంజాబ్, రాజస్తాన్, కాశ్మీర్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు ఈ ఆలయాన్ని సందర్శించి పునీతులయ్యేవారు. దేశ విభజన అనంతరం ఈ ఆలయాన్ని మూసివేశారు. అయితే హిందువుల నిరంతర పోరాటం ఫలితంగా గత ఏడాది పెషావర్ హైకోర్టు ఈ ఆలయాన్ని తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. 

భారత్ లో మత ప్రజాస్వామ్యం లేదంటూ ఇటీవల కొందరు నాస్తికులు, భౌతిక వాదులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను మాత్రం వారు ఖండించలేక పోతున్నారు. హిందుత్వం మతతత్వం అని, ఇతర మతాలలో చాలా విశాల భావాలున్నాయని వాదిస్తున్న ఇటువంటి వారికి పాకిస్తాన్ లోని హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు కనువిప్పి కావాలి. 
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_3107.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి