16, ఫిబ్రవరి 2012, గురువారం

మత హింసకు ‘మతలబు’ ఏమిటి?- కాకుమాను తారానాథ్


 

ఇప్పటి పార్లమెంటు సమావేశాల్లోనే, ‘మత హింసనిరోధం, న్యాయసాధన,పరిహార ప్రదానం’ ‘ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనల్ టార్గెటెడ్ వైలెన్స్ , యాక్సెస్ టు జస్టిస్ అండ్ రిపరేషన్స్’ బిల్లు చర్చకు రావచ్చు. యుపిఎ ప్రభుత్వం దానిని పాస్ చేసేందుకు హడావుడి చేయవచ్చు. దాని వివరాలు చాలా భయావహంగా ఉన్నాయి. దాని ముసాయిదా బయటికి వదిలారు, చర్చలకోసం! -ఇది మన న్యాయశాఖ చేత తయారుచేయబడి, మంత్రివర్గ ఆమోదంతో, పార్లమెంటు ముందుకు వస్తున్న బిల్లు కాదు. దీనిని తయారు చేసింది జాతీయ సలహా మండలి -నేషనల్ ఎడ్వైజరీ కౌన్సిల్- -ఎన్‌ఎసి- వారు. జాతీయ సలహా మండలి అనేదొకటుందనే బహుశా మనలో చాలామందికి తెలియకపోవచ్చు.....

మామూలుగా మతపరమైన తగాదాలను శాంతిభద్రతల -లా అండ్ ఆర్డర్- సమస్యలుగానే భావించి రాష్ట్రాలు ఇండియన్ పీనల్ కోడ్ కింద చర్యలు తీసుకుంటారు. మన రాజ్యాంగం ప్రకారం అధికారాలను విభజించుకోవడంలో, లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలకే అప్పగించబడింది. మరీ పరిస్థితులు విషమించినపుడు కేంద్ర ప్రభుత్వం రాష్టప్రతిపాలన ద్వారా జోక్యం చేసుకోవడం ఉంటుంది. అంతే. కానీ ఈ బిల్ కనుక చట్టమైతే సరాసరి కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పరోక్షంగా జోక్యం చేసుకుంటుంది! అసలీ బిల్లు ఉద్దేశ్యంలో, ఎప్పుడూ మైనార్టీలు నేరాలు చేయరు, ఎప్పుడూ మెజారిటీ సభ్యులే నేరాలు చేస్తారు. దీనినే గనుక అర్ధం ప్రకారమే అమలు చేస్తే జిహాదీ ముఠాలు అసలు నేరాలే చేసారనడానికి ఆస్కారమే ఉండదు. 
ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్రంలో ఏడుగురు సభ్యుల నేషనల్ అథారిటీ ఏర్పరచబడుతుందట. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుతో సహా కనీసం నలుగురు మైనారిటీ సభ్యులుండాలి. ప్రభుత్వాలు, ఈ అధారిటీకి, పోలీసు ఇతర విచారణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలి. ఈ అధారిటీకి ఎక్కడికైనా ప్రవేశించే అధికారం, దాడులు, సోదాలు జరిపే అధికారాలు వగైరా వగైరా ఉంటాయి. అలాగే రాష్ట్రాలలోను ఏడుగురు సభ్యుల అథారిటీ ఏర్పరచబడుతుందట. ... నలుగురు మైనారిటీ సభ్యులు, మిగతా ముగ్గురు ఇతరులు. సాయుధ దళాలతో వ్యవహరించే అధికారం వీరికుంటుంది. అవసరమనుకుంటే, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలను ఇవ్వవచ్చు. ఇక వీరినెవరు నియమిస్తారు? కేంద్రంలో ప్రధానమంత్రి, హోంమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, గుర్తించబడిన రాజకీయ పక్షాల నాయకులు! అలాగే రాష్ట్రంలోకూడ. ఇక వీరు ముందుగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ - నేరవిచారణ విధాన స్మృతి - లోని 161 సెక్షన్ ప్రకారం స్టేట్‌మెంట్లు రికార్డు చేయరు. 161 సెక్షన్ ప్రకారం , చార్జిషీటు వేయక ముందు సాక్షులవద్ద వాఙ్మూలాలను రికార్డు చేసి, వారంతా నేరం జరిగిందంటే, వాటి ఆధారంగా చార్జిషీట్ వేస్తారు. పోలీసులకు ఒక విధంగా చెప్పి న్యాయస్థానంలో దానికి భిన్నంగా సాక్ష్యం చెప్తే, అతనిని ముద్దాయి తరఫు న్యాయవాది క్రాస్ పరీక్ష చేస్తారు.
 అలా కాకుండా మొత్తం ఎదురు తిరిగితే, అతనిని ‘హాస్టైల్ విట్‌నెస్- వ్యతిరేక సాక్షి-గా పరిగణిస్తుంది న్యాయస్థానం. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా 161 సెక్షన్‌ను ఎత్తేశారు! వీరికి ముద్దాయిల మధ్య టెలి సంభాషణలను టాప్ చేయడానికి వారి ఒండొరుల ఉత్తర ప్రత్యుత్తరాలు బ్లాక్ చేయడానికి అధికారముంటుంది! ఎవరి మీదనైనా దుష్ప్రచారం, విద్వేష ప్రచారం కిందనన్నా నేరంమోపితే, అతను నేరం చేసినట్లే... తాను నేరం చేయలేదని ఋజువు చేసుకోవాల్సిన భారం అతనిమీదే ఉంటుంది. 
మామూలు చట్టం వలె న్యాయస్థానంలో నేరం ఋజువు చేయబడేదాకా ప్రతి ముద్దాయి నిర్దోషే అనేసూత్రం ఇక్కడ పనికిరాదు . ఈ కేసుల్లో నియమింపబడే ప్రాసిక్యూటరు బాధ్యత, మిగతా కేసుల్లోవలె సత్యం న్యాయం కోసం సహకరించడం కాదు. కేవలం కథాకథిత బాధితుని -సోకాల్డ్ విక్టిమ్-కి మేలు జరిపేందుకు పాటుపడడమే ప్రాసిక్యూటరు బాధ్యత్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి