18, ఫిబ్రవరి 2012, శనివారం

ప్రాచీన భారత విజ్ఞానం : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నవాడు వాస్కోడగామా అనడం ఎంతవరకు సత్యం?

మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.

సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: "నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు - గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు." ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు. ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు.

పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నతస్థితిలోనున్న దేశంలో ఇప్పుడా విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారిపాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకానిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలిసికోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకరమిశ్రా ఇలా వ్రాసినారు:

"అందరికన్న ముందున్న హిందువులు"

పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినపుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయినారు. 17 వ శతాబ్దం నాటివరకు కూడా ఐరోపావారి ఓడలు అధికాధికంగా ఆరువందల టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కాని భారత్‌లో "గోఘా" పేరుగల పెద్ద ఓడలు 15 వందల టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపావారు తెలిసికొన్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని వినియోగించడం మొదలు పెట్టాయి. నైపుణ్యము గల హిందూదేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారుచేయించే పరిశ్రమల్ని అనేకం ప్రారంభించారు. 1811 సంవత్సరంలో లెఫ్టినెంటు వాకర్ ఇలా వ్రాసినాడు: బ్రిటిషువారి ఓడలన్నీ ప్రతి పన్నెండేళ్ళకు మరమ్మతుల పాలయ్యేవి. కాని భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్టిండియా కంపెనీ వద్ద "దరియా దౌలత్" అనే పేరు గల ఒక ఓడ ఉండేది. అది 87 సంవత్సరాలపాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడల నిర్మాణానికి సీసం కర్ర ( చండ్రచెట్టు కలప ), సాల వృక్షము కర్ర, టేకు కర్ర -- ఈ మూడు రకాల కలప వాడేవారు.

1811లో ఒక ఫ్రెంచి యాత్రికుడు వాల్ట్ జర్ సాల్విన్స్ "లే హిందూ" అనే పుస్తకం వ్రాసినాడు. "ప్రాచీన కాలం నుండి నౌకా నిర్మాణ కళలో హిందువులు చలా ఆరితేరియున్నారు. నేడు కూడా వారీ కళలో యూరపువారికి పాఠము చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌకా నిర్మాణ కళను నేర్చుకొనుటకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువల వద్ద అనేక విషయాలు తెలుసుకొన్నారు. భారతీయ ఓడలలో సౌందర్యం, నాణ్యత కలగలసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్యసాహసాలకూ ప్రతీకలుగా ఉన్నవి." ముంబాయిలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీనిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళం "షాహీబేడే"లో చేర్చుకొన్నారు. వీనిలో "ఏషియా" అను పేరుగల ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలది. దానిలో 84 ఫిరంగులు అమర్చబడి యుండెను. బెంగాలులోని హుగ్లీ, సిల్‌హట్, చట్టగాఁవ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలుండేవి. 1781 నుండి 1821 వరకు, 1,22,693 టన్నుల సామర్థ్యం గల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి.

ఆంగ్లేయుల కుటిలత్వము:

బ్రిటిషు ఓడలవ్యాపారులు భారతీయుల నౌకా నిర్మాణ కళా ఔన్నత్యాన్ని ఓర్వలేకపోయినారు. భారతీయ ఓడల్ని వాడవద్దని ఈస్టిండియా కంపెనీపై ఒత్తిడి తీసికొచ్చారు. ఈ విషయంలో అనేక విచారణలు కూడా జరిగినవి. 1811 లో కర్నల్ వాకర్ గణాంకాలతో సహా ఋజువు చేసినాడు. "భారతీయ ఓడలకు ఖర్చు తక్కువ, అవి చాలా బలంగా ఉంటాయి. బ్రిటిష్ నౌకాదళంలో కేవలం భారతీయ ఓడలనే వాడినచో చాలా పొదుపు అవుతుంది." బ్రిటిష్ నౌకానిర్మాణ కార్మికులు మరియు వ్యాపారులు ఉభయులలో ఈ మాట చాలా భయాందోళన్ కలిగించింది. డాక్టర్ టేలర్ అనునతడు ఇలా వ్రాసినాడు: "హిందూదేశపు సరకులతో నిండిన భారతీయ ఓడ లండన్ ఓడరేవు చేరుకొన్నపుడు ఆంగ్లేయ ఓడల వ్యాపారులు చాలా భయ కంపితులయ్యేవారు. థేమ్సునది ఒడ్డున శత్రువుల నౌకాదళపు ఓడల్ని చూసినపుడు కూడా అంతగా భయపడేవారు కాదు."

లండన్ ఓడరేవులో పనిచేసే కార్మికులు అందరికన్న ముందు ఆందోళనకు దిగినారు. "మన పనులన్నీ నష్టాల పాలవుతాయి. మా కుటుంబాలు పస్తులతో చస్తారు" అని గోల చేసినారు. ఈస్టిండియా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇలా వ్రాసినారు: "హిందూ దేశపు ఓడ పనివారలు ( కళాసీలు ) ఇక్కడికి వచ్చి మన సామాజిక స్థితిగతులను చూస్తారు. దానితో మనపై వారికున్న గౌరవం, భయభక్తులు పూర్తిగా మంటగలసి పోతాయి. వాళ్ళ దేశం వెళ్ళి మనలోని లోపాలను, లొసుగులను, మన బండారాన్ని బయటపెట్టి ప్రచారం చేస్తారు. దానితో ఆసియావాసులకు మన పట్ల ఉన్న ఆదరభావం నశిస్తుంది. ఈ ఆదరభావము, భయభక్తుల వలననే మనం ప్రభుత్వాన్ని నిలుపుకొని యుండగలిగినాము. ఇపుడది కాస్త లేకుండాపోతుంది. కావున దీని ప్రభావం మనకు చాలా హానికారకమవుతుంది." వెంటనే ఆంగ్ల పార్లమెంటు సర్ రాబర్ట్‌పీల్ అధ్యక్షతన దీనిపై ఒక కమిటీ వేసినారు.

నల్లచట్టము:

ఈ కమిటీ సభ్యులలో పరస్పరము -- అభిప్రాయభేదము లేర్పడినవి. అయినా పై రిపోర్టు ఆధారంగా ఒక చట్టమును 1814లో తెచ్చారు. దీని ప్రకారం భారతీయ కళాసీలకు బ్రిటిషు నావికులుగా పనిచేయు అర్హత లేదు. బ్రిటిషు ఓడలలో తక్కువలో తక్కువ 3/4 వంతు బ్రిటిషు కళాసీలను నియమించుట తప్పనిసరి. బ్రిటిషువారిని కాకుండా ఇతర దేశాలకు చెందిన యజమానుల ఓడలు లండన్ ఓడరేవులో ప్రవేశించే వీలులేదు. ఇంగ్లండులో తయారైన ఓడల ద్వారానే బయటిదేశాల సరకులు ఇంగ్లండుకు రావాలి." --- ఇలాంటి నల్లచట్టము అనేక కారణాల వలన మొదట అమలు కాకున్నను తర్వాత 1863 నుండి ఇది పూర్తిగా అమలు చేయబడినది. భారతదేశంలో కూడా ఇలాంటి నియమాలు గల నల్ల చట్టము తేబడినది. దీనివలన భారతదేశంలోని ప్రాచీన నౌకా నిర్మాణ కళ అంతరించిపోయినది. భారతీయ ఓడలపైన, సరకులపైన విధించిన పన్ను బాగా పెంచబడింది. ఇలా భారతీయ వ్యాపారుల్ని ఓడల్ని వ్యాపారం చేయకుండా వేరు చేయడం జరిగింది.

సర్ విలియం డిగ్వీ అనునతడు ఇలా చాలా చక్కగా చెప్పినాడు: "పాశ్చాత్య ప్రపంచపు రాణి ( బ్రిటిషురాణి ) ప్రాచ్య సాగర రాణిని ఇలా వధించివేసింది" భారతీయ నౌకా నిర్మాణ కళ ముగిసిపోయిన తీరును తెలియజెప్పే సంక్షిప్త ఇతిహాసమిదే!"

మూలం: భారతీయ ఉజ్వల వైజ్ఞానికి పరంపర.
రచయిత: సురేశ్ సోని, తెలుగు అనువాదం: బెల్లంకొండ మల్లారెడ్డి.
నవయుగ భారతి ప్రచురణలు.


http://scienceintelugu.blogspot.in/2010/03/blog-post_05.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి